• facebook
  • whatsapp
  • telegram

రాజుకుంటున్న ఆయుధ పోటీ

చైనాకు దీటుగా పలు దేశాల అడుగులు

ప్రపంచ వాణిజ్యంలో 50 శాతం హిందూ, పసిఫిక్‌ (ఇండో-పసిఫిక్‌) మహా సముద్రాల గుండానే సాగుతోంది. చైనా ఆర్థిక విజృంభణ మొదలైనప్పటి నుంచి ఆ దేశానికి, చమురు, ఇనుప ఖనిజం వంటి కీలక ముడి సరకులు ఇండో-పసిఫిక్‌ జలాల ద్వారానే చేరుతున్నాయి. చైనా నుంచి ఈ మార్గంలోనే పారిశ్రామిక తదితర ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. చైనాతోపాటు జపాన్‌, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, ఆగ్నేయాసియా దేశాల వాణిజ్యానికి సైతం ఇదే కీలకం. వాణిజ్య నౌకలు ఈ దేశాలకు సరకుల రవాణాలో మలక్కా జలసంధిగుండా రాకపోకలు సాగిస్తాయి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం మలక్కా జలసంధికి సమీపంలోని  అండమాన్‌-నికోబార్‌ దీవులకు వ్యూహపరంగా అమిత ప్రాధాన్యం ఇచ్చి,  అక్కడ త్రివిధ సాయుధ దళ కమాండ్‌ను ఏర్పాటు చేసింది. ఇంతవరకు ఇండో-పసిఫిక్‌ జలాలు అమెరికా యుద్ధ నౌకల స్వేచ్ఛా విహారానికి నెలవులుగా ఉంటూ వచ్చాయి. సముద్ర దొంగలు, ఉగ్రవాదులు, చైనా ఆధిపత్య ధోరణుల నుంచి తీర దేశాలకు రక్షణగా అవి సంచరిస్తున్నాయి. అమెరికా ఇక్కడకు విమాన వాహక యుద్ధనౌకలను పంపుతోంది. వీటి వెన్నంటిఇతర యుద్ధ నౌకలు సమూహంగా తరలివస్తాయి. అమెరికా వద్ద 11 అణుచోదిత విమాన వాహక నౌకలున్నాయి. సముద్రాలపై తిరుగులేని ఆధిపత్యం  చలాయించే సాధనాలు కాబట్టి క్యారియర్‌ నౌకలు వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైనవి.

చైనా తాజాగా ఇండో-పసిఫిక్‌లో అమెరికా ఆధిక్యాన్ని సవాలు చేయడానికి నడుంకట్టింది. రానున్న కాలంలో ఆరు విమాన వాహక యుద్ధనౌకల్ని సమకూర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న చైనా ఇటీవలే రెండో నౌక షాండోంగ్‌తో జలప్రవేశం చేయించింది. దీనికి ముందు, 1998లో తన మొదటి యుద్ధ నౌక లియావోనింగ్‌ను ఉక్రెయిన్‌ నుంచి కొనుగోలు చేసి, మార్పుచేర్పులతో 2012లో రంగంలోకి దించింది. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో సోవియట్‌ యూనియన్‌ వర్యాగ్‌ పేరిట నిర్మాణం ప్రారంభించిన ఈ యుద్ధనౌక సోవియట్‌ పతనం తరవాత ఉక్రెయిన్‌ వాటాగా చేతులు మారింది. దాని నిర్మాణాన్ని పూర్తిచేసే ఆర్థిక స్థోమత లేక ఉక్రెయిన్‌ దాన్ని చైనాకు విక్రయించింది. చైనా మూడో యుద్ధనౌక ఈ ఏడాది చివరికల్లా సముద్రంలోకి దిగవచ్చు. నాలుగో నౌక నిర్మాణం ఇప్పటికే ప్రారంభమైందని వార్తలు వస్తున్నాయి.

చైనా దూకుడును అడ్డుకోవడానికి అమెరికా నేతృత్వంలో క్వాడ్‌ సిద్ధమవుతోంది. క్వాడ్‌ సభ్యదేశమైన భారత్‌ అమ్ములపొదిలో ఇప్పటికే ఒక విమాన వాహక యుద్ధ నౌక (విక్రమాదిత్య) ఉంది. దీన్ని రష్యా నుంచి కొనుగోలు చేసి ఆధునిక హంగులతో సాగరజలాల్లోకి దించారు. స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మిస్తున్న రెండో క్యారియర్‌ విక్రాంత్‌ వచ్చే ఏడాది జలప్రవేశం చేస్తుందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రకటించారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లయిన సందర్భంగా అది రంగంలోకి దిగుతుంది. ఈ విమాన వాహక నౌక నిర్మాణాకృతి మొదలుకొని, దాని నిర్మాణానికి వాడిన ప్రత్యేక ఉక్కు, దానికి అమర్చే ఆయుధాలు, సెన్సర్ల వరకు దాదాపు 75 శాతం పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందాయి. 2030కల్లా మూడో విమాన వాహక నౌక విశాల్‌ను సిద్ధం చేయాలని భారత్‌ ఆశిస్తోంది.

క్వాడ్‌లో సభ్య దేశమైన జపాన్‌ రెండో ప్రపంచ యుద్ధానంతరం సొంత విమాన వాహక యుద్ధ నౌకల్ని  సమకూర్చుకోలేదు. హెలికాప్టర్లను తీసుకెళ్లే రెండు క్యారియర్‌ నౌకలను మాత్రం తయారు చేసుకుంది. చైనా దూకుడును దృష్టిలో ఉంచుకుని, ఈ రెండింటినీ విమాన వాహక యుద్ధ నౌకలుగా మార్చే కార్యక్రమాన్ని జపాన్‌ ముమ్మరించింది. ఈ రెండు ఒక్కొక్కటీ 10 యుద్ధ విమానాలను తీసుకెళ్లగలుగుతాయి. చైనా మద్దతు గల ఉత్తర కొరియాను అమెరికా వత్తాసుతో ఎదుర్కొనే దక్షిణ కొరియా కూడా మారిన పరిస్థితుల్లో సొంత విమాన వాహక యుద్ధనౌకలను సమకూర్చుకొంటోంది. రెండు క్యారియర్‌ నౌకల నిర్మాణానికి సన్నాహాలు మొదలుపెట్టింది. తూర్పు చైనా, దక్షిణ చైనా సముద్రాలపై ఆధిపత్యానికి దూకుడు ప్రదర్శిస్తున్న చైనాను నిలువరించేందుకు జపాన్‌, దక్షిణ కొరియాలు సన్నద్ధం కావడం కీలక పరిణామం. మరోవైపు పాకిస్థాన్‌ను అడ్డుపెట్టుకుని గ్వాదర్‌ రేవు ద్వారా అరేబియా సముద్రంలో పాగా వేయాలని చైనా యత్నించడం, బంగాళాఖాతం హిందూ మహాసముద్ర జలాల్లో డ్రాగన్‌ యుద్ధ నౌకలు, జలాంతర్గాముల సంచారం పెరగడం చూసి భారత్‌ కూడా అప్రమత్తమైంది. భారత్‌ నిర్మించబోయే విశాల్‌ క్యారియర్‌ నౌకకు కీలక పరిజ్ఞానాలను, నిఘా విమానాలనూ అందించడానికి అమెరికా ముందుకొచ్చింది. జపాన్‌, దక్షిణ కొరియా నౌకలపై మోహరించడానికి ఎఫ్‌35 యుద్ధ విమానాలను అమెరికా విక్రయించనుంది. ఈ క్రమంలో చైనాకు దీటుగా పలు దేశాలు అవసరమైన ఆయుధాల్ని సముపార్జించుకునేందుకు కార్యాచరణ మొదలుపెట్టాయి.

- కైజర్‌ అడపా
 

Posted Date: 29-06-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం