• facebook
  • whatsapp
  • telegram

పౌర ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి

తాలిబన్ల ఉక్కుపిడికిట్లో అఫ్గాన్‌

అఫ్గానిస్థాన్‌ యుద్ధం ముగింపుపై అమెరికా అధ్యక్షుడు బైడెన్‌కు పకడ్బందీ ప్రణాళిక ఏమీ లేదని తేలిపోయింది. అగ్రరాజ్య సేనలు అర్ధరాత్రి వేళ పెట్టేబేడా సర్దుకోవడం అఫ్గాన్‌ దళాల స్థైర్యాన్ని దెబ్బతీసింది. ఆ తరవాత వారాల వ్యవధిలోనే కాందహార్‌, హెరాత్‌, లష్కర్‌ఘాలతో కలిపి 18 రాష్ట్రాల రాజధానులను తాలిబన్లు వశపరచుకొన్నారు. కాబూల్‌కు సమీపంలోని కీలక ప్రాంతాలు సైతం వారి అధీనంలోకి వెళ్ళిపోయాయి. అఫ్గాన్‌ ఆర్థిక మంత్రి ఖలీద్‌ రాజీనామా చేసి, దేశాన్ని వీడటం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. ఈ క్రమంలో పాలనాధికారాన్ని తాలిబన్లతో పంచుకొనేందుకు కాబూల్‌లోని పౌర ప్రభుత్వం అయిష్టంగానే ముందుకొచ్చింది. ఖతార్‌లో జరుగుతున్న చర్చల్లో ‘రాజీ’ సూత్రం ప్రతిపాదించింది. అధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీ రాజీనామాకు పట్టుపట్టిన తాలిబన్ల నుంచి వెంటనే స్పందన రాలేదు. తొంభై రోజుల్లో కాబూల్‌ వారి వశం కానుందని అమెరికా నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీనితో మిగిలిన దౌత్య సిబ్బందిని తరలించేందుకు మూడు వేల మంది సైనికులను తిరిగి అక్కడికి పంపనున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్‌ప్రైస్‌ పేర్కొన్నారు. మరోవైపు, దేశం మొత్తాన్ని వారం రోజుల్లోనే హస్తగతం చేసుకొంటామని తాలిబన్లు ప్రకటించారు.

దళాల స్వయంకృతం

వెనక్కి వెళ్ళే హడావుడిలో అమెరికా తన ఆయుధ డంపులను అఫ్గాన్‌లోనే వదిలేసింది. ఈ నిర్లక్ష్యం తాలిబన్లకు వరంగా మారింది. సుల్తాన్‌ఖిల్‌ సైనిక స్థావరంలోని కంటైనర్ల కొద్దీ ఆయుధాలు, వాహనాలు వారి పరమయ్యాయి. తాజాగా కుందూజ్‌ విమానాశ్రయాన్ని స్వాధీనం చేసుకోవడంతో ఇండియా ఇచ్చిన ఎం.ఐ. హెలికాప్టర్‌తో పాటు అమెరికా ‘స్కాన్‌ ఈగిల్‌ డ్రోన్లు’ సైతం వారి చేతికొచ్చాయి. ఉగ్రమూకలు వ్యూహాత్మకంగా అఫ్గాన్‌ ప్రత్యేక కమాండోలు, పైలట్లు, అమెరికన్ల దుబాసీలను లక్ష్యంగా చేసుకొంటున్నాయి. సెలవులో ఉన్న పైలట్లను గుర్తించి హతమారుస్తున్నారు. అఫ్గాన్‌ దళాలకు వాయుసేన మద్దతును తగ్గించడమే ఈ దాడుల లక్ష్యం. దీన్ని గ్రహించిన అమెరికా తమ సహాయక బృందాలను తరలించేందుకు అవసరమైన రవాణా మార్గాల కోసం అఫ్గాన్‌, ఉజ్బెకిస్థాన్‌, పాక్‌లతో కలిసి సరికొత్త క్వాడ్‌ను ఏర్పాటు చేసింది. ఆ తరవాత పాక్‌ గగనతలం మీదుగా తాలిబన్లను లక్ష్యంగా చేసుకొని చెదురుమదురు దాడులు చేసింది. ఇవి కేవలం ముష్కరుల వేగాన్ని తగ్గించడానికి ఉద్దేశించినవే కాని, వారిని పూర్తిగా అడ్డుకోవడానికి కాదు. మరోవైపు, పౌర ప్రభుత్వానికి ఆదాయం అందకుండా కీలక చెక్‌పోస్టులపై తాలిబన్లు పట్టు సాధించారు. తుర్క్‌మెనిస్థాన్‌, ఉజ్బెకిస్థాన్‌, తజకిస్థాన్‌ సరిహద్దు జిల్లాలు వారి అదుపాజ్ఞల్లోకి వెళ్ళిపోయాయి. ఇరాన్‌ వైపు ఉండే ఇస్లాం ఖలా డ్రైపోర్ట్‌, పాక్‌కు సమీపంలోని స్పిన్‌బౌల్దక్‌ పోస్టులనూ తాలిబన్లు కైవసం చేసుకొన్నారు.

అఫ్గాన్‌ భద్రతా దళాల ప్రస్తుత పరిస్థితి పూర్తిగా వాటి స్వయంకృతమే. దళాల శిక్షణ, ఇతర అవసరాల కోసం అమెరికా 8800 కోట్ల డాలర్లు వెచ్చించింది. అయినా వారిలో పోరాట పటిమ లోపించి, అవినీతి పాతుకుపోయిందని నాటో, అమెరికన్‌ బలగాల ఉన్నతాధికారులు ఎప్పుడో వాపోయారు.  శత్రు ప్రాంతాల్లో గస్తీ సమయాల్లో సైతం మాదక ద్రవ్యాల వినియోగం, అమెరికన్‌ పరికరాలతో ప్రైవేటు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసుకొని వసూళ్లకు పాల్పడటం, పరస్పరం కాల్పులు జరుపుకోవడం తదితరాలు అఫ్గాన్‌ భద్రతా సిబ్బందికి సాధారణమయ్యాయి. మరోవైపు హెల్మాండ్‌ సహా పలు గ్రామీణ ప్రాంతాల్లో తాలిబన్ల ఆధ్వర్యంలోని పాఠశాలలకు కాబూల్‌ ప్రభుత్వం నిధులను సమకూర్చింది. ముష్కరమూకలకు గ్రామీణుల్లో ఉన్న బలమైన పట్టు చెదిరిపోకుండా ఉండటానికి ఇది అక్కరకొచ్చింది. దీనికి తోడు పాకిస్థాన్‌ కుయుక్తులూ తాలిబన్లకు కలిసివచ్చాయి. వారికి పాక్‌ మద్దతు కొనసాగుతున్నట్లు ‘స్పిన్‌ బౌల్దక్‌’ విషయంలో బయటపడింది. అక్కడి తాలిబన్లపై అఫ్గాన్‌ వాయుసేన దాడిచేస్తే తాము రంగంలోకి దిగుతామని పాక్‌ హెచ్చరించినట్లు పౌర ప్రభుత్వ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా ఆరోపించారు. ఇంకోవైపు పాక్‌లోని లష్కరే తొయిబా సహా ఇతర సంస్థలకు చెందిన పది వేల మంది ఉగ్రవాదులు అఫ్గాన్‌లోకి చొరబడ్డారు. తాష్కెంట్‌లో జరిగిన మధ్య దక్షిణాసియా దేశాల సదస్సు వేదికపైనే ఈ విషయాన్ని అఫ్గాన్‌ అధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీ స్వయంగా ప్రకటించారు.

భారత్‌పై విషం కక్కుతూ...

ఘనీ సర్కారుతో తాలిబన్లు చర్చలు జరపరంటూ పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ తాజాగా వ్యాఖ్యానించారు. తమ దేశంలోని ఉగ్ర స్థావరాలను ఆయన శరణార్థి శిబిరాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. తాను పెంచి పోషిస్తున్న భారత వ్యతిరేక ఉగ్రశిబిరాలను తాలిబన్‌ పాలిత అఫ్గాన్‌కు తరలించి ఎఫ్‌ఏటీఎఫ్‌ ఆంక్షల నుంచి బయటపడాలన్నది పాక్‌ వ్యూహంగా కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో తాలిబన్లతో ఇండియా తెర వెనక చర్చలు జరిపింది. ఐరాసలోని ‘తాలిబన్లపై ఆంక్షల కమిటీ’ అధ్యక్ష హోదాలో- వారి నాయకుల ప్రయాణాలపై ఉన్న ఆంక్షలను తాత్కాలికంగా నిలిపివేసింది. పాక్‌తో అంటకాగుతున్న తాలిబన్లపై ఇవి ఏమాత్రం ప్రభావం చూపలేదు. భారత్‌ నిర్మించిన ‘సల్మా డ్యామ్‌’ సహా పలు ప్రాజెక్టులపై దాడులు నిర్వహిస్తున్నారు. దీంతో వారు ఇక మారరనే వాస్తవాన్ని ఇండియా గ్రహించింది. ఈ మేరకు తన వైఖరిని ఇటీవల స్పష్టం చేసింది. కాబూల్‌పై ఎలాంటి బలవంతపు పాలననూ తాము గుర్తించబోమని అమెరికాతో కలిసి ప్రకటించింది. ఐరాస వేదికగానూ పాక్‌ వైఖరిని పరోక్షంగా తప్పుపట్టింది. అఫ్గాన్‌ గడ్డపై నుంచి తన సిబ్బందిని పూర్తిగా వెనక్కి రప్పించే ప్రయత్నాలూ చేపడుతోంది. మజారే షరీఫ్‌లోని దౌత్య కార్యాలయాన్ని పూర్తిగా మూసివేసింది. మరోవైపు, అఫ్గాన్‌ షియాలైన హజారాల విషయంలో ఇరాన్‌ ఆందోళన చెందుతోంది. వారి విషయంలో ఇరాన్‌ స్పందించే తీరు అఫ్గాన్‌లో భారత ప్రయోజనాల మీద ప్రభావం చూపవచ్చు. సమయం కలసివచ్చే వరకు వేచిచూడటం మినహా ఇండియాకు మరోమార్గం లేదు.

రష్యా, చైనా మద్దతు

తజకిస్థాన్‌ సరిహద్దుల్లో తాలిబన్లకు రష్యా భారీగా ఆయుధాలను సరఫరా చేస్తోందని అమెరికా జనరల్‌ జాన్‌నికొల్సన్‌ మూడేళ్ల క్రితమే పేర్కొన్నారు. గతంలో సోవియట్‌పై యుద్ధం సమయంలో ముజాహిదీన్‌లకు అమెరికా సాయం చేసినందుకు బహుశా ఇది ప్రతీకారం కావచ్చు. భారత్‌తో కలిసి అఫ్గాన్‌ పౌర ప్రభుత్వానికి మద్దతుగా పనిచేసే ఉద్దేశం లేదని రష్యా ఇప్పటికే తేల్చి చెప్పేసింది. అఫ్గాన్‌లోని రష్యా ప్రతినిధి జమీర్‌ కబులోవ్‌- పాక్‌తో అంటకాగుతాడని అంటారు. పాక్‌, రష్యాలతో ఉన్న బంధమే తాలిబన్లను చైనాకు దగ్గర చేసింది. ఇటీవల తాలిబన్‌ బృందం చైనాలో పర్యటించి విదేశాంగ మంత్రి వాంగ్‌యీతో భేటీ అయింది. వీగర్‌ వేర్పాటువాదులకు తమ దేశంలో స్థానం లభించదని భరోసా ఇచ్చింది. అందుకు ప్రతిగా విమాన విధ్వంసక ఆయుధాలను సరఫరా చేయాలని కోరింది. డ్రాగన్‌ దానికి సిద్ధపడితే తాలిబన్లను అడ్డుకోవడం ఇతరులకు కష్టసాధ్యమవుతుంది.

- పెద్దింటి ఫణికిరణ్‌
 

Posted Date: 14-08-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం