• facebook
  • whatsapp
  • telegram

కళాఖండాల కోసం ఖండాంతర వేట

విదేశాల్లో భారత సాంస్కృతిక సంపద

వలస పాలనలో భారత్‌తోపాటు ఆసియా, ఆఫ్రికాల నుంచి చారిత్రక ప్రశస్తి కలిగిన కళాఖండాలను పాశ్చాత్య దేశాలు అపహరించుకుపోయాయి. వలస పాలన ముగిసిన తరవాతా ఇది కొనసాగుతూనే ఉంది. ఇంటి దొంగలు తస్కరించి తీసుకెళ్లిన కళాఖండాలను అమెరికా, బ్రిటన్‌లలోని విఖ్యాత పురావస్తుశాలల్లో, సుప్రసిద్ధ విశ్వవిద్యాలయాల్లో దర్జాగా ప్రదర్శిస్తున్నారు. ఆస్ట్రేలియా, జర్మనీలు పెద్ద మనసుతో వీటిని తిరిగి ఇస్తున్నా- అమెరికా, బ్రిటన్‌లు పంథా మార్చుకోవడం లేదు. ఆస్ట్రేలియా జాతీయ గ్యాలరీ తన వద్ద ఉన్న 14 భారతీయ కళాఖండాలను తిరిగి ఇచ్చేస్తానని ప్రకటించింది. వీటిలో 13 కళావస్తువులు సుభాష్‌ కపూర్‌ అనే భారత సంతతి వ్యక్తి విక్రయించినవే. అపహరించిన కళా వస్తువులతో న్యూయార్క్‌లో ‘ఆర్ట్‌ ఆఫ్‌ ది పాస్ట్‌’ అనే గ్యాలరీని నడుపుతున్న కపూర్‌ ప్రస్తుతం కటకటాల వెనక ఉన్నాడు.

నైజీరియాలోని బెనిన్‌ ప్రాంతం నుంచి 18వ శతాబ్దంలో బ్రిటిష్‌వారు లూటీ చేసిన కాంస్య విగ్రహాలను బ్రిటన్‌లోని వివిధ మ్యూజియాల్లో ఇప్పటికీ ప్రదర్శిస్తున్నారు. వాటిలో కొన్ని జర్మనీకి చేరాయి. వాటిని బెనిన్‌కు తిరిగి ఇస్తానని జర్మనీ ఇటీవలే ప్రకటించింది. బ్రిటన్‌, అమెరికాలు మాత్రం అపూర్వ భారతీయ చారిత్రక, కళా వస్తువులను తిరిగిచ్చే ఊసే ఎత్తడం లేదు. వీటిలో బ్రిటిష్‌ రాణి కిరీటాన్ని అలంకరిస్తున్న కోహినూర్‌ వజ్రం ప్రధానమైంది. ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి నుంచి తస్కరించిన బుద్ధ విగ్రహం, కర్ణాటకలో టిప్పు సుల్తాన్‌ ఖజానా నుంచి లూటీ చేసిన పులి బొమ్మలను బ్రిటన్‌ మ్యూజియాల్లో ప్రదర్శిస్తున్నారు. ‘బ్రిటిష్‌వారు భారతీయుల ప్రాణాలు బలిగొన్నారు. సహజ వనరులను లూటీ చేశారు. వాటిని వారు ఎలాగూ తిరిగి ఇవ్వలేరు. కనీసం మా సాంస్కృతిక వారసత్వాన్ని అయినా తిరిగి ఇవ్వండి’ అని ఇండియా ప్రైడ్‌ ప్రాజెక్ట్‌ (ఐపీపీ) వ్యవస్థాపకుడు అనురాగ్‌ సక్సేనా డిమాండ్‌ చేస్తున్నారు. వలస కాలంలో లూటీ అయిన, స్వాతంత్య్రానంతరం చోరీ చేసిన భారతీయ కళావస్తువులను స్వదేశానికి రప్పించడానికి సక్సేనా 2014లో ఐపీపీని స్థాపించారు. ఈ కృషికి ప్రపంచవ్యాప్తంగా వలంటీర్లు ఆన్‌లైన్‌లో చేయూత ఇస్తూ, ఒక సామాజిక ఉద్యమంగా మలుస్తున్నారని తెలిపారు. ఐపీపీ కృషి నెమ్మదిగా ఫలితాలు చూపుతోంది. జర్మన్‌ ఛాన్స్‌లర్‌  ఏంజెలా మెర్కెల్‌ గతంలో మన దేశాన్ని సందర్శించినప్పుడు భారత్‌లో చోరీకి గురై, తమ దేశానికి చేరిన పదో శతాబ్దం నాటి దుర్గామాత విగ్రహాన్ని మన ప్రభుత్వానికి తిరిగి అప్పగించారు. అమెరికాలోని పురావస్తు ప్రదర్శనశాలలు మాత్రం ఇప్పటికీ కళాచోరుల కొమ్ముకాస్తున్నాయి. ‘ఆర్ట్‌ ఆఫ్‌ ది పాస్ట్‌’ యజమాని సుభాష్‌ కపూర్‌కు, అమెరికాలోని రూబిన్‌-లాడ్‌ ఫౌండేషన్‌కు దొంగచాటు వ్యాపార బంధం ఉంది. దొంగిలించిన వాటిని కళాఖండాల సేకర్తల నుంచి చట్టబద్ధంగా కొనుగోలు చేశామంటూ ఫోర్జరీ పత్రాలు సృష్టించడం కపూర్‌కు, అతని అనుచరులకు వెన్నతో పెట్టిన విద్య. కపూర్‌ తోడుదొంగ అయిన సలీనా మహమ్మద్‌ భారత్‌ నుంచి చోరీ అయిన లక్ష్మీనారాయణ విగ్రహాన్ని నకిలీ పత్రాలతో రూబిన్‌-లాడ్‌ ఫౌండేషన్‌ పరం చేశాడు. ఆ ఫౌండేషన్‌ దాన్ని శాన్‌ ఆంటోనియా మ్యూజియానికి అరువిచ్చింది. కపూర్‌ సంస్థ నుంచి చేతులు మారిన కళావస్తువుల సంఖ్య 25కు పైనే ఉంటుందని ఐపీపీ లెక్కగట్టింది. వీటిలో ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి అపహరించి తెచ్చిన కుబేర విగ్రహం ప్రసిద్ధమైంది. దీన్ని ఏకంగా యేల్‌ విశ్వవిద్యాలయ సంగ్రహాలయంలో ప్రదర్శిస్తున్నారు. ఇదీ రూబిన్‌-లాడ్‌ ఫౌండేషన్‌ నుంచి వచ్చినదే. సుభాష్‌ కపూర్‌ సంస్థ నుంచీ యేల్‌ వర్సిటీ నేరుగా కళావస్తువులను కొన్నది. అందులో ఒకటైన చలువరాతి ఆర్చి మూలస్థానం రాజస్థాన్‌లోని మౌంట్‌ అబూ అని సాధికారికంగా నిర్ధారించారు.

కళావస్తువుల దొంగరవాణాను ప్రోత్సహించడం యేల్‌ వర్సిటీకి మాత్రమే పరిమితం కాదు. జగద్విఖ్యాత హార్వర్డ్‌ విశ్వవిద్యాలయమూ ఇలాంటి పనులే చేస్తోంది. 19వ శతాబ్దంలో మైసూరు నుంచి అపహరించిన చందన పేటిక ఒకటి హార్వర్డ్‌ మ్యూజియంలో ఉంది. ఇదీ సుభాష్‌ కపూర్‌ నుంచి వచ్చినదే. అమెరికాలోని అనేక ఇతర మ్యూజియాలూ సుభాష్‌ కపూర్‌-రూబిన్‌ ఫౌండేషన్‌ల చలవతో భారతీయ కళాఖండాలను అక్రమంగా ప్రదర్శిస్తున్నాయి. అమెరికా, బ్రిటన్‌ల నుంచి తన సాంస్కృతిక వారసత్వాన్ని భారత ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. వాటి పరిరక్షణకు శ్రద్ధ తీసుకోవాలి. 2014-18 మధ్యకాలంలో అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీలు తిరిగి ఇచ్చిన 28 కళావస్తువులను భారత పురాతత్వ సర్వే సంస్థ (ఏఎస్‌ఐ)కి అప్పగించగా, వాటిని దిల్లీ పురానా ఖిల్లాలోని గిడ్డంగిలో పడేశారు. వాటిని పదిలంగా ఉంచాలనే శ్రద్ధ అధికారుల్లో కనిపించడం లేదు. ఘనమైన మన సాంస్కృతిక వారసత్వాన్ని పది కాలాలపాటు సంరక్షించుకోవడానికి ప్రభుత్వాలు కంకణబద్ధం కావాలి.

- ప్రసాద్‌
 

Posted Date: 13-09-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం