• facebook
  • whatsapp
  • telegram

భారత్‌ మెడపై కాట్సా కత్తి

సాధ్యాసాధ్యాల పరిశీలనలో అమెరికా

ఇండియా- అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు రసకందాయంలో పడ్డాయి. ఎస్‌-400 క్షిపణి వ్యవస్థలను మన దేశం కొనుగోలు చేస్తుండటమే ఇందుకు కారణం. తమ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ రష్యా నుంచి ఈ ఆయుధ సంపత్తిని సముపార్జించుకుంటుండటంపై అగ్రరాజ్యం గుర్రుగా ఉంది. ఇలాంటి పరిస్థితులు తలెత్తినప్పుడు ఇతర దేశాలపై ప్రయోగించేందుకు తయారు చేసుకున్న ‘ఆంక్షల ద్వారా అమెరికా ప్రత్యర్థుల్ని నిరోధించే చట్టం (సీఏఏటీఎస్‌ఏ-కాట్సా)’ అస్త్రాన్ని మనపై ప్రయోగించేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది. తమ దేశ ప్రయోజనాలకు విఘాతం కలిగేలా వ్యవహరిస్తున్నందుకు ఇండియాపై కొరడా ఝళిపించాల్సిందేనని కొందరు అమెరికన్లు వాదిస్తుండగా, వ్యూహాత్మక అవసరాలను దృష్టిలో ఉంచుకొని భారత్‌కు మినహాయింపు ఇవ్వాలని మరికొందరు వాదిస్తున్నారు.

మెరుగైన రక్షణ కోసమే...

ప్రపంచంలోకెల్లా అత్యంత అధునాతన గగనతల రక్షణ వ్యవస్థల్లో ఎస్‌-400 ట్రయంఫ్‌ ఒకటి. డ్రోన్లు, క్షిపణులు, రాకెట్లతో పాటు యుద్ధ విమానాల దాడుల నుంచి అది రక్షణ కల్పిస్తుంది. తనవైపు దూసుకొచ్చే శత్రు దేశాల ఆయుధాలను క్షిపణుల ప్రయోగంతో కూల్చివేస్తుంది. ప్రధానంగా చైనా, పాకిస్థాన్‌లతో పొంచి ఉన్న ముప్పు నుంచి రక్షణ ఛత్రంగా పని చేస్తుందన్న ఉద్దేశంతో భారత్‌ దీని కొనుగోలుకు నిర్ణయించింది. అయిదు ఎస్‌-400 వ్యవస్థల సముపార్జన కోసం 2018 అక్టోబరులో రష్యాతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, వాటికి బదులు అమెరికాకు చెందిన ఎంఐఎం-104 పేట్రియాట్‌ వ్యవస్థలను ఇండియా కొనుగోలు చేయాల్సిందన్నది కొందరి వాదన. కానీ- పేట్రియాట్‌ వ్యవస్థ ప్రధానంగా క్షిపణుల నుంచి రక్షణ కోసం రూపొందించినది. యుద్ధ విమానాలను నిరోధించడంలో అది అంత ప్రభావశీలంగా పని చేయకపోవచ్చన్న అనుమానాలు ఉన్నాయి. పేట్రియాట్‌తో పోలిస్తే ఎస్‌-400 ధర చాలా తక్కువ. కాబట్టి భారత్‌ తన అవసరాలు, ఆర్థిక పరిమితులను దృష్టిలో పెట్టుకొని ఎస్‌-400ను ఎంచుకోవడం ఉత్తమ నిర్ణయమన్నది నిర్వివాదాంశం. తొలి ఎస్‌-400 వ్యవస్థ వచ్చే నెలలోనే మన దేశానికి అందే అవకాశముంది. చైనా వద్ద ఇప్పటికే ఎస్‌-400 రక్షణ వ్యవస్థ ఉంది. గత ఏడాది మే నెలలో తూర్పు లద్దాఖ్‌లో ఉద్రిక్తతలు తలెత్తినప్పుడు ముందుజాగ్రత్తగా చైనా ఈ వ్యవస్థను మోహరించినట్లు సమాచారం. రష్యా, ఉత్తర కొరియా, ఇరాన్‌ల నుంచి గణనీయ స్థాయిలో సైనిక, నిఘా ఒప్పందాలు కుదుర్చుకొని, సంబంధిత ఆయుధ సంపత్తిని కొనుగోలు చేసే దేశాలపై ఆర్థిక, ప్రయాణపరమైన ఆంక్షలు విధించేందుకు కాట్సా చట్టం వీలు కల్పిస్తుంది. జాతీయ ప్రయోజనాలు, వ్యూహాత్మక అవసరాలను పరిరక్షించే చర్యల్లో భాగంగా దీనినుంచి మినహాయింపులు ఇచ్చే అధికారం దేశాధ్యక్షుడికి ఉంటుంది. ఎస్‌-400ను కొనుగోలు చేసిన కారణంగా చైనా, టర్కీ (ఇది నాటో భాగస్వామి)లపై ఇప్పటికే కాట్సాను ప్రయోగించారు. ప్రస్తుతం ఇండియాపైనా ఈ చట్టం ప్రకారం ఆంక్షలు విధించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. వ్యూహాత్మక అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు వెనక్కి తగ్గితే... దాన్ని ఉదాహరణగా చూపుతూ భవిష్యత్తులో మరిన్ని దేశాలు మినహాయింపులు కోరే ముప్పుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. గతంలో మనం దిగుమతి చేసుకున్న ఆయుధాల్లో దాదాపు 80శాతం రష్యావే; ఇటీవలి కాలంలో పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోంది. అమెరికా సహా పలు ఇతర దేశాల నుంచి కొనుగోళ్లు పెరిగాయి. త్రివిధ దళాలకు ఉపయోగపడేలా రూ.22 వేల కోట్లతో అమెరికా నుంచి 30 సాయుధ డ్రోన్లను కొనుగోలు చేయాలని కేంద్ర సర్కారు తాజాగా నిర్ణయించింది.

వ్యూహాత్మక బంధం

పోఖ్రాన్‌ పరీక్షల తరవాత ఇండియాపై విధించిన ఆంక్షల తాలూకు చేదు జ్ఞాపకాలు ఇప్పుడిప్పుడే చెదిరిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో కాట్సాను ప్రయోగిస్తే పరిస్థితి మళ్లీ మొదటికొస్తుంది. కొన్నేళ్లుగా బలపడుతూ వస్తున్న బంధం దెబ్బతింటుంది. ఈ నేపథ్యంలో బైడెన్‌ ప్రభుత్వం వివేకంతో ఆలోచించాలి. ద్వైపాక్షిక సంబంధాలను ఆంక్షల ద్వారా ప్రమాదంలోకి నెట్టేయకూడదు. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో చైనా దూకుడుకు కళ్లెం వేయాలని అమెరికా బలంగా కోరుకుంటోంది. క్వాడ్‌ కూటమిలో భాగస్వామిగా ఉన్న ఇండియా మద్దతు లేకుండా ఆ లక్ష్యాన్ని చేరుకోవడం అసాధ్యం. తమకు ఇష్టం లేదన్న ఒకే ఒక్క కారణంతో రష్యాతో రక్షణ సంబంధాలను ఇండియా పూర్తిగా తెంచుకోవడం కుదరదన్న విషయాన్ని కూడా అమెరికా గ్రహించాలి. ఇరాన్‌ నుంచి చమురు కొనుగోళ్లపై ఆంక్షల విషయంలో అమెరికా మాటను మోదీ సర్కారు గౌరవిస్తున్న సంగతిని గుర్తెరగాలి. పాశ్చాత్య దేశాలకు దూరమవుతున్న రష్యా, క్రమంగా చైనాకు దగ్గరవుతోంది. ఆ రెండు దేశాల మధ్య బంధం రోజురోజుకూ బలపడుతోంది. ఇండియా మద్దతు ఉంటే చైనా నుంచి రష్యాను దూరం చేయవచ్చని కొందరు విశ్లేషకులు బైడెన్‌ సర్కారుకు సూచిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కాట్సా ఆంక్షల నుంచి మినహాయింపునిస్తే... వ్యూహాత్మక బంధం మరింత మెరుగు పడుతుందని వారు వివరిస్తున్నారు. మరోవైపు- భారత్‌ కూడా ఆయుధ సంపత్తి కోసం విదేశాలపై ఆధారపడటం తగ్గించుకోవాలి. దేశీయంగా ఉత్పత్తి పెంచి, రక్షణ రంగంలో స్వావలంబన సాధించాలి. ఇందుకోసం బడ్జెట్‌లో కేటాయింపులు భారీగా పెంచాలి.

- నవీన్‌కుమార్‌
 

*************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ కులగణనకు పెరుగుతున్న డిమాండ్లు

‣ ప్రజాప్రయోజనం నెరవేరుతుందా?

Posted Date: 19-11-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం