• facebook
  • whatsapp
  • telegram

శత్రు ఆస్తుల వేలం

ఇప్పటిదాకా శత్రుదేశాల పౌరులకు చెందిన షేర్లు, బంగారం, వెండి వంటి చరాస్తులను భారత ప్రభుత్వం విక్రయించింది. ఇకపై భూములు, భవనాల వంటి స్థిరాస్తుల వేలాన్నీ చేపట్టనుంది. స్థిరాస్తుల విక్రయం ద్వారా లక్ష కోట్ల రూపాయలు సమకూరతాయని అంచనా.

పాకిస్థాన్‌, చైనా పౌరులకు, సంస్థలకు భారత్‌లో నేటికీ 12,611 స్థిరాస్తులు ఉన్నాయి. వాటిలో 126 ఆస్తులు చైనావి. మిగతావన్నీ పాకిస్థాన్‌కు చెందినవి. 20 రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని శత్రు స్థిరాస్తులపై జాతీయ సర్వే జరిపిన మీదట, వాటిలో అత్యధికంగా ఉత్తర్‌ ప్రదేశ్‌లో 6,255 స్థిరాస్తులు ఉన్నాయని నిర్ధారణ అయ్యింది. ఆంధ్రప్రదేశ్‌లో ఒకే ఒక్క శత్రు స్థిరాస్తి ఉండగా, తెలంగాణలో అలాంటివి 158 ఉన్నాయి. పశ్చిమ్‌ బెంగాల్‌లో 4,088, దిల్లీలో 659, గోవాలో 295, మహారాష్ట్రలో 208 స్థిరాస్తులు ఉన్నాయి. గుజరాత్‌లో 151, త్రిపురలో 105, బిహార్‌, మధ్యప్రదేశ్‌లలో 94 చొప్పున, ఇంకా ఛత్తీస్‌గఢ్‌, హరియాణా, కేరళ, తమిళనాడు, డామన్‌ డయ్యూ, అండమాన్‌ నికోబార్‌ దీవులు వంటి చోట్లా శత్రు స్థిరాస్తులను గుర్తించారు.

ప్రత్యేక చట్టం

కేంద్ర ప్రభుత్వం శత్రు స్థిరాస్తులను ప్రభుత్వ రంగ సంస్థ అయిన మెటల్‌ స్క్రాప్‌ ట్రేడ్‌ కార్పొరేషన్‌ (ఎంఎస్‌టీసీ) ద్వారా ఎలెక్ట్రానిక్‌ వేలం వేయాలని నిర్ణయించింది. 2018 నుంచి 2022 వరకు శత్రు దేశ పౌరులకు చెందిన షేర్లు, బంగారం, వెండి వంటి చరాస్తులను విక్రయించి రూ.3,400 కోట్లు ఆర్జించినట్లు కేంద్ర హోంశాఖ అధికారులు తెలిపారు. వాటిలో రూ.1,100 కోట్లు విప్రో సంస్థలోని శత్రు షేర్ల విక్రయం ద్వారా లభించాయి. విప్రోతో పాటు 152 కంపెనీలలోని శత్రు షేర్లను విక్రయించి కేంద్రం రూ.2,708 కోట్లను ఆర్జించింది. ఇంకా 1,700 గ్రాముల శత్రు బంగారాన్ని విక్రయించి రూ.49 లక్షలకు పైగా సంపాదించింది. 28 కిలోల వెండిని విక్రయించగా దాదాపు 11 లక్షల రూపాయలు లభించాయని కేంద్రం వివరించింది. ఇకపై శత్రు స్థిరాస్తుల విక్రయాన్ని కేంద్రం ప్రారంభించబోతోంది.

దేశీయంగా శత్రు ఆస్తుల స్వాధీనం, విక్రయానికి కేంద్రం 1968లోనే చట్టం తెచ్చింది. దేశ విభజన తరవాత పాకిస్థాన్‌కు వలస పోయిన మహ్మూదాబాద్‌ రాజా (ఉత్తర్‌ ప్రదేశ్‌) ఆస్తులు పై చట్టం కింద శత్రు ఆస్తిగా పరిగణన పొందాయి. రాజా మరణించిన తరవాత ఆయన కుమారుడు కుటుంబ ఆస్తుల కోసం కోర్టుకెక్కాడు. 30 ఏళ్ల పోరాటం తరవాత సుప్రీంకోర్టు 2005లో రాజా కుమారుడికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో శత్రు ఆస్తులుగా వర్గీకరణ పొందిన వాటి కోసం దేశమంతటా కోర్టు వ్యాజ్యాలు వెల్లువెత్తాయి. ఫలితంగా శత్రు ఆస్తులను వారసులకు వాపసు ఇవ్వాలంటూ కోర్టులు తీర్పు ఇచ్చే వీలు లేకుండా 2010లో రాష్ట్రపతి ఆర్డినెన్సు జారీ చేశారు. దీని స్థానంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం శత్రు ఆస్తుల (సవరణ, ధ్రువీకరణ) బిల్లును 2016లో పార్లమెంటులో ప్రవేశపెట్టింది. అది 2017లో ఉభయ సభల ఆమోదం పొందింది. 1968కి ముందు, తరవాతా శత్రు ఆస్తులకు ఈ చట్టం వర్తిస్తుంది. ఈ ఆస్తుల కేసుల్లో సివిల్‌ కోర్టులు, మరే ఇతర సంస్థలు జోక్యం చేసుకోవడానికి వీల్లేదని 2017 నాటి చట్టం స్పష్టం చేస్తోంది. 2020నాటికి మహ్మూదాబాద్‌ రాజాకు ఉన్న 422 హెక్టార్ల భూమి విలువ రూ.421 కోట్లకు చేరింది. దాన్ని స్వాధీనం చేసుకోవాలని ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర హోంశాఖకు చెందిన భారత శత్రు ఆస్తుల సంరక్షణ సంస్థ (సీఈపీఐ) ఆధీనంలో ఉన్న ఆస్తుల విక్రయానికి తాజాగా కొత్త మార్గదర్శకాలు జారీ అయ్యాయి. వాటి ప్రకారం శత్రు ఆస్తుల్లో నివాసం ఉంటున్నవారిని ఖాళీ చేయించే ప్రక్రియను జిల్లా మేజిస్ట్రేట్‌ లేదా డిప్యూటీ కమిషనర్‌ ప్రారంభిస్తారు. శత్రు ఆస్తి విలువ కోటి రూపాయలకు లోపే ఉంటే, సదరు భూమి లేదా భవనంలో నివాసం ఉంటున్నవారికి మొదట దాన్ని విక్రయించజూపుతారు. వారు దాన్ని కొనడానికి నిరాకరించినా, సొంతం చేసుకునే స్థోమత లేకపోయినా నిర్దేశిత పద్ధతుల్లో దాన్ని ఇతరులకు విక్రయిస్తారు. కోటి రూపాయల నుంచి రూ.100 కోట్ల విలువైన శత్రు స్థిరాస్తులను ఎలెక్ట్రానిక్‌ వేలం ద్వారా లేదా మరేదైనా ఇతర పద్ధతిలో విక్రయిస్తారు.

చైనా పెట్టుబడులు

పాకిస్థాన్‌తో పాటు చైనాకూ భారత్‌లో ఆస్తులు ఉన్నాయి. 1962 యుద్ధం తరవాత అవి శత్రు ఆస్తులుగా పరిగణన పొందాయి. ఇటీవలి దశాబ్దాల్లో భారత్‌లో చైనా కంపెనీల కార్యకలాపాలు విస్తరించాయి. దేశీయంగా వివిధ రంగాల్లో చైనా పెట్టుబడులు 620 కోట్ల డాలర్లని అంచనా. 2020 మార్చి నాటికి భారతీయ కంపెనీల షేర్లలో చైనా రూ.3,257 కోట్ల మేరకు పెట్టుబడి పెట్టింది. సరిహద్దుల్లో గిల్లికజ్జాలు పెట్టుకుంటున్న చైనా రేపు పూర్తిస్థాయి యుద్ధానికి దిగితే, భారత భూభాగంలోని చైనా కంపెనీల ఆస్తులను కేంద్రం స్వాధీనం చేసుకుంటుందనడంలో సందేహం లేదు. శత్రు ఆస్తులపై అనేక ఇతర దేశాలూ ఇలాంటి విధానాలనే అవలంబిస్తున్నాయి.

- వరప్రసాద్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ రాష్ట్రాలతో సఖ్యత.. అభివృద్ధికి రాచబాట

‣ వినియోగం క్షీణిస్తే ఆర్థికంగా మందగతే

‣ మూలధన వ్యయం.. లొసుగుల మయం!

‣ ఇరాన్‌ సౌదీల కొత్త నెయ్యం

‣ వనాలు.. మానవాళికి రక్షా కవచాలు!

Posted Date: 25-03-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం