• facebook
  • whatsapp
  • telegram

దరి చేరనున్న 5జీ సాంకేతికత

అధిగమించాల్సిన సవాళ్లెన్నో...

దేశీయ టెలి కమ్యూనికేషన్స్‌ రంగంలో కొత్త విప్లవానికి నాంది పలకనున్న 5జీ నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. 5జీ స్పెక్ట్రమ్‌ వేలాన్ని ఈ ఏడాదిలోనే నిర్వహిస్తామని, ఈ ఆర్థిక సంవత్సరం(2022-23)లోనే సేవలను అందుబాటులోకి తెస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇటీవల బడ్జెట్‌లో ప్రకటించారు. 4జీ కంటే వంద రెట్లు వేగవంతమైన అంతర్జాలాన్ని, అంతేస్థాయిలో మెరుగైన కనెక్టివిటీని అందుబాటులోకి తీసుకొచ్చే 5జీ సేవలు అందుబాటులోకి వస్తే కేవలం మొబైల్‌ ఫోన్‌ వినియోగదారులకే ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌(ఐఓటీ)తో పాటు పారిశ్రామిక, వైద్య రంగాలకూ అత్యాధునిక సాంకేతిక సంపత్తి అందుతుంది.

తొలుత ప్రధాన నగరాల్లో...

గతేడాది చివరికే ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా దేశాల్లో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. చైనా అయితే మరో అడుగు ముందుకేసి 6జీ నెట్‌వర్క్‌ ట్రయల్స్‌ కూడా ప్రారంభించింది. ఆ దేశాలతో పోలిస్తే మనం కొత్త తరం సాంకేతికతను అందుకునే విషయంలో వెనకబడినట్లే. 5జీ నెట్‌వర్క్‌ ఏర్పాటుకు తాము ఆసక్తి చూపుతున్నా ప్రభుత్వం సరిగ్గా స్పందించడం లేదని ఎయిర్‌టెల్‌, జియో వంటి టెలికాం కంపెనీలు పలు సందర్భాల్లో ఆవేదన వ్యక్తం చేశాయి. ఎట్టకేలకు ప్రభుత్వమూ 5జీ రాకకు పచ్చజెండా ఊపిన వేళ... దీని అమలులో ఉన్న సవాళ్లను అధిగమించాల్సి ఉంది. ఏప్రిల్‌, మే నెలల్లో 5జీ స్పెక్ట్రమ్‌ వేలాన్ని నిర్వహించనున్నట్లు టెలికాం వర్గాలు చాలాకాలంగా చెబుతున్నాయి. బడ్జెట్‌లో మంత్రి ప్రకటన తరవాత స్పెక్ట్రమ్‌ వేలం మార్చిలోనే ఉండవచ్చనే చర్చ మొదలయింది. అదే జరిగితే ఈ ఆర్థిక సంవత్సరం పూర్తయ్యేనాటికి (2023 మొదట్లో) కనీసం దేశంలోని ప్రధాన నగరాల్లో 5జీ సేవలు అందుబాటులోకి రావచ్చు. దేశంలోని 13 నగరాల్లో 2022లో 5జీ సేవలు ప్రారంభిస్తామని టెలికాం శాఖ ఇటీవల ప్రకటించడం దీనికి బలం చేకూరుస్తోంది. జియో చాలాకాలంగా 5జీ నెట్‌వర్క్‌ ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభించింది. శాంసంగ్‌తో కలిపి 5జీ ప్రయోగాలు చేసిన జియో హువావే, ఎరిక్సన్‌, నోకియాలతోనే జట్టు కడతామని ప్రకటించింది. ఎయిర్‌టెల్‌ కూడా హువావే, జెడ్‌టీఈ, ఎరిక్సన్‌, నోకియాలతో కలిసి 5జీ ట్రయల్స్‌ చేపడతామని పేర్కొంది. వొడాఫోన్‌ కూడా తమ భాగస్వాముల పేర్లు ప్రకటించి, పోటీలో నిలిచింది. స్పెక్ట్రం వేలం పూర్తయితే ఇవన్నీ 5జీ నెట్‌వర్క్‌ ఏర్పాటుకు వేగంగా అడుగులు వేసేందుకు సిద్ధంగా ఉన్నాయి.

టెలికాం ఉత్పత్తుల తయారీ సంస్థ ఎరిక్సన్‌ అంచనా ప్రకారం 5జీ సేవలు 2027 నాటికి అంతర్జాతీయంగానూ గాడినపడే అవకాశం ఉంది. భారత్‌లోని టెలికాం వినియోగదారుల్లో 50 కోట్ల మంది 5జీ సేవలు అందుకుంటారని లెక్కగట్టింది. ఆ దిశగా ముందుకెళ్ళాలంటే టెలికాం కంపెనీలు, 5జీ హ్యాండ్‌సెట్‌ తయారీదారులు అద్భుతమైన వేగంతో పని చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే శాంసంగ్‌, ఒన్‌ప్లస్‌, ఒప్పో, వివో, రియల్‌మీ వంటి మొబైల్‌ ఫోన్ల తయారీదారులంతా 5జీ హ్యాండ్‌సెట్ల తయారీలో నిమగ్నమయ్యారు. 2021 చివరి నాటికి దేశంలోకి వచ్చే స్మార్ట్‌ఫోన్లలో 5జీ స్మార్ట్‌ఫోన్లు 22శాతం ఉండటం కొత్త సాంకేతికత కోసం కంపెనీల సన్నద్ధతను తెలియజేస్తున్నాయి. దేశమంతటా 5జీ సేవలు అందుబాటులోకి వచ్చేందుకు కనీసం రెండు నుంచి మూడేళ్లు పట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. టెల్కోలు 5జీ సేవలపై ఇప్పటి నుంచి రెండేళ్లలో కనీసం లక్షన్నర కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే అవకాశం ఉందని క్రిసిల్‌ అంచనా వేసింది. కంపెనీలు మౌలిక వసతుల్ని ఎంత వేగంగా సమకూర్చుకుంటే, దేశవ్యాప్తంగా ఈ కొత్త తరం టెలికాం నెట్‌వర్క్‌ అంత వేగంగా అందుబాటులోకి వస్తుంది.

తప్పని ధరాభారం

దేశంలో టెలికాం టారిఫ్‌లు తక్కువగా ఉన్నాయని కంపెనీలు పదేపదే చెబుతున్నాయి. ఇటీవలే ధరలు పెంచాయి. మరోమారు పెంచేందుకూ కొన్ని సంస్థలు సిద్ధమవుతున్నాయి. 5జీ సర్వీసులు అందుబాటులోకి వస్తే ఛార్జీలు ఇంకా పెరుగుతాయి. ఎంత వేగవంతమైన అంతర్జాల సదుపాయం అందుబాటులోకి వచ్చినా, కనెక్టివిటీ అత్యద్భుతంగా ఉన్నా భారీగా ధర చెల్లించి 5జీ సేవలు పొందేందుకు ఎంత మంది వినియోగదారులు ముందుకొస్తారన్నదీ ప్రశ్నే. ఇప్పటికీ దేశంలోని సగం మంది మొబైల్‌ఫోన్‌ వినియోగదారులు 2జీ నెట్‌వర్కే వాడుతుండటం గమనార్హం. అదీకాక దేశంలోని టెలికాం కంపెనీలు చెప్పే వేగానికి, వాస్తవంగా వినియోగదారుడు అందుకునే వేగానికి, సేవలకు ఎక్కడా పొంతన ఉండటం లేదు. 4జీ వినియోదారులు హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై లాంటి మెట్రో నగరాల్లో కూడా ఇప్పటికీ కనెక్టివిటీ సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో 5జీ సర్వీసులు అందుబాటులోకి వచ్చినా నాణ్యమైన సేవలు అందడానికి మరింత జాప్యం జరగడం ఖాయమన్నది పరిశ్రమ వర్గాల మాట.

- శ్యాంప్రసాద్‌ ముఖర్జీ
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ సులువుగా... సమగ్రంగా రాజ్యాంగాన్ని చదివేద్దాం!

‣ మార్కుల ఆధారంగా నేవీ ఉద్యోగాలు!

‣ అన్ని అడుగులూ కొలువుల వైపు!

‣ మౌఖిక పరీక్షల్లో ఇవి గుర్తుంచుకోవాలి!

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 11-03-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

సైన్స్ & టెక్నాలజీ

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం