• facebook
  • whatsapp
  • telegram

పరిశోధనలే దన్నుగా పురోగమనం

ప్రణాళికాబద్ధ ప్రస్థానం ప్రాణావసరం

స్వాతంత్య్రం వచ్చి వందేళ్లు పూర్తయ్యేసరికి భారత ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి అనే అంశాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన అభిప్రాయాలను ఆగ‌స్టు 15వ తేదీన ప్రకటించవచ్చు. దాన్ని విజన్‌ 2047గా పరిగణిద్దాం. 2047 వచ్చేసరికి భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణం 40 లక్షల కోట్ల డాలర్లకు చేరుతుందని భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) అంచనా వేస్తోంది. ఈ ఆశాభావానికి మూడు కారణాలున్నాయి. ఒకటి- రానున్న మూడు దశాబ్దాల్లో పాశ్చాత్య దేశాలు, చైనా, జపాన్‌లలో వృద్ధుల జనాభా పెరిగిపోనుండగా... భారత్‌లో యువ జనాభా విస్ఫోటనం సంభవించనున్నది. రెండు- భారత్‌లో పరిశ్రమలకు కావలసిన శ్రామిక శక్తి చౌకగా లభించడం. మూడు- పారిశ్రామిక వస్తువులకు, ఇతర సేవలకు భారత్‌లోనే సువిశాల మార్కెట్‌ అందుబాటులో ఉండటం. ప్రపంచంలో 2050కల్లా చైనా, అమెరికాల తరవాత మూడో అతిపెద్ద ఆర్థిక శక్తి భారతదేశమే అవుతుందని, అప్పటికి భారత్‌ జీడీపీ అమెరికాకు దాదాపు సమానంగా ఉంటుందని ‘ది ఎకానమిస్ట్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌’ అంచనా. దానికన్నా ముందు, అంటే 2030 కల్లా ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించాలని భారత్‌ పట్టుదలగా కృషిచేస్తోంది.

ఆటంకాలను అధిగమించాలి

ఎన్డీయే పాలనలో జన్‌ధన్‌ ఖాతాలు తెరవడం, లబ్ధిదారులకు నేరుగా నగదు బదిలీ చేయడం (డీబీటీ), డిజిటల్‌ చెల్లింపుల విజృంభణ సానుకూల అంశాలు. పట్టణాభివృద్ధి ప్రణాళికలు, తాగు నీటి సరఫరా పథకాలు, మౌలిక వసతుల నిర్మాణానికి ప్రాధాన్యం పెరిగింది. పౌర విమానయాన విస్తరణ, కొత్త ఆరోగ్య-విద్యా విధానాలు, స్టార్టప్‌ ఇండియా, ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకం (పీఎల్‌ఐ) వంటివి మంచి ఫలితాలను అందించాయి. ప్రధాని మోదీ విదేశాల్లోని భారతీయ సంతతివారికి మాతృదేశంతో సాన్నిహిత్యం పెంచడం, అంతర్జాతీయంగా దేశ ప్రతిష్ఠను పెంపొందించడం కూడా కలిసివచ్చే అంశాలే. అదే సమయంలో మూడు సమస్యలు భారత్‌ శీఘ్ర ప్రగతికి అడ్డుగోడలుగా నిలిచే ప్రమాదం ఉంది. అవి- కేంద్ర రాష్ట్రాల విత్తలోటు రెండంకెలకు చేరుకోవడం, కరెంటు ఖాతా లోటు పెరగడం, వడ్డీ రేట్లు హెచ్చుతున్న సమయంలో ప్రభుత్వ రుణ భారం చాలా ఎక్కువగా ఉండటం. గడచిన 40-50 ఏళ్లలో జీడీపీలో పారిశ్రామికోత్పత్తి వాటా 15-16 శాతం వద్దనే తచ్చాడుతోంది. అందుకే పారిశ్రామిక రంగం పెద్దయెత్తున ఉపాధి అవకాశాలు సృష్టించలేకపోతోంది.

శాసన, ఆర్థిక, పాలనాపరంగా కేంద్ర, రాష్ట్రాల సంబంధాల్లో నిజమైన సమాఖ్య స్ఫూర్తి వెల్లివిరియాల్సి ఉంది. ప్రాకృతిక, ఆర్థిక, మానవ వనరుల పరంగా రాష్ట్రాల మధ్య ఉన్న తీవ్ర అంతరాలను పరిష్కరించాల్సి ఉంది. రాజ్యాంగం రాష్ట్రాలకు కేటాయించిన విద్య, వైద్యం, భూమి, వ్యవసాయం వంటి అంశాల్లో కేంద్రం జోక్యం చేసుకోకపోవడం మేలు. విద్య, వైద్యాలపై ప్రభుత్వ వ్యయంలో రాష్టాల వాటా వరసగా 88శాతం, 82శాతం. అలాంటప్పుడు ఈ రంగాల్లో కేంద్ర ప్రాయోజిత పథకాల అవసరం ఏముంది? ఆయా రంగాల్లో కనీస ప్రమాణాలను నిర్దేశించి రాష్ట్రాలు వాటిని పాటించేలా చూడటం వరకే కేంద్రం పరిమితమైతే బాగుంటుంది. కేంద్రం కీలక గణాంకాల సేకరణ, అంతర్జాతీయ సహకారం, అంతర్జాతీయ బాధ్యతల నిర్వహణ, అంటువ్యాధులు, ప్రకృతి ఉత్పాతాల నిభాయింపు వంటి కార్యక్రమాలపై దృష్టిపెట్టి మిగతా అంశాలను రాష్ట్రాలకు వదలాలి. సంక్షేమం పేరిట కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ఉచిత వరాలు శ్రుతిమించుతున్నాయి. దీనివల్ల ధరలు పెరగడం, ప్రైవేటు పెట్టుబడులు రాకపోవడం, జీతభత్యాలు పెరగకపోవడం, పనిచేసే సంస్కృతి క్షీణించడం వంటి అనర్థాలు కలుగుతాయని రిజర్వు బ్యాంకు హెచ్చరించింది. 2022-23లో పలు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన ఉచిత వరాలపై ఖర్చు లక్ష కోట్ల రూపాయలు దాటిపోతుందని తెలిపింది. ఉచిత, అయాచిత వరాలు వెనెజ్వెలా దేశాన్ని దుర్భర దారిద్య్రంలోకి నెట్టాయి. మన దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో పరిస్థితి అంతవరకు రాకుండా జాగ్రత్తపడాలి. నిర్ణీత ప్రమాణాలను అతిక్రమించిన రాష్ట్రాల్లో ఆర్థిక ఆత్యయిక పరిస్థితిని విధించే విషయాన్ని కేంద్రం, రిజర్వుబ్యాంకు పరిశీలించాలి. లాభాలు ఆర్జిస్తున్న కేంద్ర ప్రభుత్వ సంస్థలు 2020-21లో తమ లాభాలను 37శాతం మేర పెంచుకోగా, నష్టాల బారిన పడిన సంస్థలు ఇదేకాలంలో తమ నష్టాలను 29శాతం వరకు తగ్గించుకున్నాయి. దీన్ని బట్టి కేంద్ర ప్రభుత్వ సంస్థల పనితీరు మెరుగుపడుతున్నట్లు తేలుతోంది. 

అధిక కేటాయింపులు

అమెరికా, చైనాలు నేడు ప్రపంచంలో అగ్ర ఆర్థిక శక్తులుగా నిలుస్తున్నాయంటే కారణం శాస్త్రసాంకేతిక రంగాల్లో పరిశోధనల(ఆర్‌ అండ్‌ డీ)పై భారీ పెట్టుబడులు పెట్టడమే. అమెరికాలో పరిశోధన, అభివృద్ధికి ప్రైవేటు రంగమే చోదక శక్తి అని చాలామందిలో ఒక అపోహ ఉంది. నిజానికి అమెరికా ప్రభుత్వమే ఆర్‌ అండ్‌ డీని చేపడుతోంది. ఒక పరిశోధన ఫలించాలంటే 15 నుంచి 20 ఏళ్లవరకు పడుతుంది. భారీ పెట్టుబడులు పెట్టి, ఫలితాల కోసం అంతకాలం నిరీక్షించే స్తోమత ప్రైవేటు రంగానికి ఉండదు. అమెరికా ప్రభుత్వం నెలకొల్పిన ‘డిఫెన్స్‌ అడ్వాన్స్డ్‌ రిసెర్చ్‌ ప్రాజెక్ట్స్‌ ఏజెన్సీ (డార్పా)’యే ఇంటర్నెట్‌ సృష్టికర్త. వ్యాధుల చికిత్సకు వాడే ఔషధ పదార్థాల్లో 75శాతం అమెరికా ప్రభుత్వం నిధులు సమకూర్చిన ప్రాజెక్టులు సృష్టించినవే. భారత ప్రభుత్వం కూడా అంతరిక్ష, రక్షణ పరిశోధనలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఫార్మా, హరిత ఇంధనాలు, సౌర శక్తి, అణు శక్తి, కృత్రిమ మేధ వంటి రంగాల్లో అధునాతన పరిశోధనలకు ప్రభుత్వ నిధులను ఇప్పుడున్నదానికన్నా మూడు రెట్లు ఎక్కువగా కేటాయించాలి. ప్రపంచంలో అగ్రశ్రేణి ఆర్థిక శక్తిగా ఎదిగే సత్తా భారత్‌కు ఉంది. కాకపోతే ఆ లక్ష్య సాధనకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలి. కొవిడ్‌ వల్ల ఏర్పడిన ఆటంకాలు తాత్కాలికమేనని గుర్తించి, అభివృద్ధి బాటలో దృఢంగా ముందడుగు వేయాలి.

పెరుగుతున్న అంతరాలు

భారతదేశంలో సంపద, ఆదాయాల పరంగా ధనిక, పేద అంతరాలు పెరిగిపోవడం సామాజిక ఐక్యతకు చేటు తెస్తుంది. 1961లో భారతదేశంలో ఒక శాతం సంపన్నుల వద్ద 11.9శాతం దేశ సంపద పోగుపడగా- 2020కల్లా అది 42.5శాతానికి పెరిగిపోయింది. ఆదాయపరమైన అసమానతలూ హెచ్చుతున్నాయి. మరోవైపు పేద, దిగువ మధ్యతరగతి ప్రజలు విద్యావైద్యాలు, తాగునీరు, పారిశుద్ధ్యం, పిల్లలకు పోషకాహారం వంటి కనీసావసరాల కోసం కటకటను ఎదుర్కొంటున్నారు. అదేసమయంలో పేదరికాన్ని తగ్గించడంలో భారత్‌ సాధించిన విజయాన్ని తక్కువచేయలేం. దేశంలో నిరుపేదలు 2011లో 22.5 శాతం. 2019కల్లా 10.2 శాతానికి తగ్గినట్లు ప్రపంచ బ్యాంకు వెల్లడించింది. సంఖ్యాపరంగా చూస్తే దేశంలో ఇప్పటికీ 6.5 కోట్లమంది దుర్భర దారిద్య్రంలో మగ్గుతున్నారు. కొవిడ్‌ వల్ల వీరి సంఖ్య 10 కోట్లకు చేరనున్నది. 2021లో గ్రామాల్లో 32.75 శాతం, పట్టణాల్లో 8.81 శాతం నిరుపేదలని నీతి ఆయోగ్‌ వెల్లడించింది.

నైపుణ్యాల్లో వెనకబాటు

మన విద్యా విధానం డిగ్రీ సంపాదించడానికే తప్ప ఆచరణీయ నైపుణ్యాలను సృష్టించడానికి పనికిరావడం లేదు. వృత్తి విద్య, అప్రెంటిస్‌ విధానంతో పారిశ్రామిక అగ్ర శక్తిగా రాణిస్తున్న జర్మనీ నుంచి మనం నేర్చుకోవలసింది ఎంతో ఉంది. అందుకే దేశంలో ఏటా ఇంజినీరింగ్‌ పట్టా పుచ్చుకొంటున్న 1,70,000 మందిలో 80శాతం విజ్ఞాన ఆధారిత రంగాల్లో ఏ ఉద్యోగానికీ పనికిరారని పలు సర్వేలు తేల్చాయి. నైపుణ్య లోపమే దీనికి మూల కారణం. 15-29 వయోవర్గంలోని భారతీయ యువతలో 27.2శాతం చదువు, ఉద్యోగం, శిక్షణ వంటివి లేక ఖాళీగా ఉన్నారని ప్రపంచ బ్యాంకు నివేదిక వెల్లడించింది. దక్షిణ కొరియా శ్రామిక బలగంలో 96శాతం, జపాన్‌లో 80శాతం ముందస్తు నైపుణ్య శిక్షణ పొందినవారే. భారత్‌లో అలాంటివారు మూడు శాతమే. భారత ప్రభుత్వం చేపట్టిన ‘నైపుణ్య భారత్‌’ కార్యక్రమం ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోయింది. ఇంకా దారుణమేమంటే నైపుణ్యం ఉన్న కొద్దిమంది కూడా విదేశాలకు వలస వెళ్లిపోవడం.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ మాల్దీవులతో స్నేహబంధం

‣ మూడో ప్రపంచ యుద్ధ భయం!

‣ మిగ్‌ పాపం ఎవరిది?

‣ పశ్చిమాసియాలో ఆధిపత్య పోరు

Posted Date: 09-08-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

సైన్స్ & టెక్నాలజీ

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం