• facebook
  • whatsapp
  • telegram

కశ్మీర్‌పై ఆచితూచి...

హింసకు కళ్ళెం వేసేదెలా?

జమ్మూ కశ్మీర్‌లో పరిస్థితి రాజకీయ నాయకులు చెబుతున్నంత ప్రశాంతంగా ఏమీ కనిపించడం లేదు. అక్కడ ఈ ఏడాది అక్టోబరు అయిదు నుంచి పదిహేనో తేదీ లోపు వేర్వేరు ఉగ్రదాడుల్లో స్థానికేతరులతో కలిపి 11 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు అక్టోబరు 11న పూంఛ్‌లోని డేరాకీ గలీ, భట్టా దురియాన్‌ అడవుల్లో భద్రతాదళాలు, ఉగ్రవాదుల మధ్య మొదలైన ఎదురుకాల్పులు నేటికీ కొనసాగుతున్నాయి. అక్టోబరు 19న భారత సైన్యాధిపతి జనరల్‌ నరవణె జమ్ముకు వెళ్ళి పరిస్థితిని సమీక్షించారు. అక్టోబరు 23న అక్కడి భద్రతా దళాలు, లెఫ్టినెంట్‌ గవర్నర్‌తో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా భేటీ అయ్యారు. ప్రధాని మోదీ ఈ ఏడాది దీపావళి సంబరాలను ఎదురుకాల్పులు కొనసాగుతున్న రాజౌరీ, పూంఛ్‌ జిల్లాల్లోనే జరుపుకొని మన సైనిక దళాల్లో ఆత్మ స్థైర్యం నింపారు. కశ్మీర్‌లో యువత ఉగ్రవాదం వైపు ఆకర్షితులు కాకుండా చేయడంలో మాత్రం కేంద్రం పెద్దగా పురోగతి సాధించలేదు. ఫలితంగా పాక్‌ తన చేతికి మట్టి అంటకుండా కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని ఎగదోస్తోంది.

రెండేళ్ల క్రితం కేంద్రం జమ్మూ కశ్మీర్‌ ప్రత్యేక హోదాను తొలగించింది. కేంద్రం నిర్ణయంతో కశ్మీర్‌ వాసుల్లో అసంతృప్తి నెలకొన్నా, వారు గుంభనంగా ఉండటాన్ని ప్రభుత్వం గుర్తించలేకపోయింది. ఆ పరిస్థితుల్లో పాకిస్థాన్‌ నుంచి డ్రోన్ల ద్వారా భారీ ఎత్తున పిస్తోళ్ల వంటి చిన్న ఆయుధాల సరఫరా యత్నాలు పెరగడం ప్రమాదకర సంకేతం. లక్షల సంఖ్యలో తుపాకులను అఫ్గాన్‌లో పోగుపెట్టి ఆ దేశాన్ని అమెరికా, రష్యా, పాక్‌లు ఛాందసవాదుల చేతుల్లోకి నెట్టాయి. ఇప్పుడు కశ్మీర్‌లో పాక్‌ అలాంటి యత్నాలే చేస్తోంది. ‘ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌, యాంటీ ఫాసిస్ట్‌ ఫ్రంట్‌’ ముసుగుల్లో లష్కరే, జైషే సంస్థలు అక్కడ పనిచేస్తున్నాయి. వీరు దాడులను చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో వాటిని పోస్టు చేసి ప్రచారం చేసుకొంటున్నారు. అదే సమయంలో భద్రతా విభాగాల్లో బదిలీలు సైతం పరిస్థితిని కొంత దిగజార్చాయి. ప్రత్యేక కార్యకలాపాల బృందం (కార్గో) ఉగ్రవాదుల కదలికలకు సంబంధించి కీలకమైన సమాచారాన్ని సేకరిస్తుంది. దాదాపు అయిదు నెలలపాటు దీని బాధ్యతలను పూర్తి స్థాయి అధికారికి అప్పగించలేదు. కూలీలు ఉప్పందించడంతో పూంఛ్‌లో ఎదురుకాల్పులు మొదలై సుదీర్ఘంగా సాగుతున్నాయి. అక్కడి పర్వతాలపై నక్కిన ఒక్కో శత్రువును మట్టుపెట్టాలంటే సగటున అయిదు నుంచి తొమ్మిది మంది ప్రత్యేక దళ సిబ్బంది అవసరం. జమ్మూ కశ్మీర్‌లో కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలూ ఉన్నాయి. ఈ ఏడాది అక్టోబర్‌కు ముందు వరకు అక్కడ హింస చాలావరకు తగ్గింది. జిల్లా అభివృద్ధి మండలి (డీడీసీ) ఎన్నికలను విజయవంతంగా నిర్వహించారు. తిరిగి వచ్చిన కశ్మీరీ పండితులకు పునరావాస కార్యక్రమాలు చేపట్టారు. అక్కడ పారిశ్రామిక అభివృద్ధి కోసం ఈ ఏడాది మార్చి నాటికి సుమారు రూ.23 వేల కోట్ల విలువైన ఒప్పందాలు కుదిరినట్లు కేంద్రం రాజ్యసభలో పేర్కొంది. కశ్మీర్‌లో మౌలిక వసతుల ప్రాజెక్టులు నెలకొల్పేందుకు దుబాయ్‌ ప్రభుత్వం ఇండియాతో ఒప్పందం చేసుకొంది. యునెస్కో ఎంపిక చేసిన 49 సృజనాత్మక నగరాల్లో శ్రీనగర్‌ తాజాగా స్థానం సంపాదించింది.

కేవలం సైనిక బలంతోనే వేర్పాటువాదం, ఉగ్రవాదాన్ని అణచివేసిన దాఖలాలు ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేవు. సైనిక శక్తికి సమాంతరంగా రాజకీయ ప్రక్రియ సైతం కొనసాగిన చోట్ల హింసకు కళ్ళెం పడింది. జమ్మూకశ్మీర్‌ ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించిన తరవాత పూర్తిగా రాష్ట్రపతి పాలనలోకి వెళ్ళిపోయింది. కేంద్రం నియోజకవర్గ పునర్విభజన అనంతరం ఎన్నికలు నిర్వహించి ప్రజాపాలనను పునరుద్ధరించాలని భావించినా, కొవిడ్‌ కారణంగా ఏడాది జాప్యం తప్పలేదు. జస్టిస్‌ రంజనా దేశాయ్‌ నేతృత్వంలోని నియోజకవర్గ పునర్విభజన కమిషన్‌తో అభిప్రాయాలు పంచుకొనేందుకు కశ్మీర్‌ లోయలోని ప్రధాన పార్టీలు తొలుత మొండికేసినా, ఆ తరవాత కొంత మెత్తబడ్డాయి. జమ్మూకు గతంలో తగిన ప్రాతినిధ్యం దక్కలేదన్న విమర్శలూ ఉన్నాయి. ఇది రాజకీయ ప్రక్రియే అయినా కత్తిమీద సాము లాంటిది. కశ్మీర్‌లోని అసంతృప్తిని ఉగ్రవాదంగా మార్చడంలో పాక్‌ది అందెవేసిన చేయి. చాలా మంది రాజకీయ అసంతృప్త నేతలే నేటి ప్రమాదకర ఉగ్రవాదులన్న విషయాన్ని కేంద్రం దృష్టిలో ఉంచుకోవాలి. కశ్మీర్‌లో ఏ ప్రభుత్వం ఏర్పడినా గతంలో మాదిరిగా ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఇకపై ఉండదు. భారత రాజ్యాంగ పరిధిలోనే అవి కొనసాగాలి. నియోజకవర్గ పునర్‌ వ్యవస్థీకరణలో పాలకులు పట్టువిడుపు ధోరణిని అవలంబిస్తే కొత్త సమస్యలకు తావుండదు.

- పి.కిరణ్‌

Posted Date: 11-11-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం