• facebook
  • whatsapp
  • telegram

పాక్‌లో బుసకొడుతున్న ఉగ్రనాగు

స్వయంకృతాపరాధాల పర్యవసానం

ఎవరు తీసిన గోతిలో వాళ్లే పడతారు! ప్రపంచంలో అతిపెద్ద ఇస్లామిక్‌ ఉగ్రవాద పోషణ కేంద్రమైన పాకిస్థాన్‌ విషయంలో ఈ సామెత అక్షరాలా వర్తిస్తుంది. ‘మా ప్రప్రథమ లక్ష్యం పాకిస్థాన్‌ను సర్వనాశనం చేయడమే’ అని అఫ్గానిస్థాన్‌లో చెలరేగిపోతున్న ఇస్లామిక్‌ స్టేట్‌-ఖొరాసాన్‌ (ఐసిస్‌-కె) సంస్థ సభ్యుడు నజీఫుల్లా తాజాగా ప్రకటించారు. అంతేకాదు, ఈ సంస్థ మరో ఆరు నెలల్లో అమెరికామీదా దాడి చేసే సామర్థ్యాన్ని సంతరించుకోవచ్చని అగ్రరాజ్య రక్షణ శాఖ ఉపమంత్రి కాలిన్‌ కాల్‌ గత నెలలో సెనెట్‌కు తెలిపారు. అఫ్గాన్‌లోనే తిష్ఠ వేసిన అల్‌ఖైదా సైతం ఒకటి రెండేళ్లలో అమెరికాపై దాడి చేసే సామర్థ్యాన్ని సంపాదించవచ్చునని హెచ్చరించారు. ఈ ఏడాది ఆగస్టులో కాబూల్‌ విమానాశ్రయం వద్ద ఆత్మాహుతి దాడితో 13 మంది అమెరికన్‌ సైనికుల మరణానికి కారణమైన సంస్థ ఐసిస్‌-కె. షరియా చట్టాన్ని ప్రపంచమంతటా అమలు చేయాలని కృత నిశ్చయంతో ఉన్నామని, అందుకు అడ్డు వచ్చేవారెవరైనా సరే ఇస్లాం మతాన్ని, ఖురాన్‌ను వ్యతిరేకిస్తున్నట్లేనని, వారు తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ఐసిస్‌-కె సభ్యుడు నజీఫుల్లా హెచ్చరించారు. గతంలో తాలిబన్లు అఫ్గాన్‌లో అధికారంలో ఉన్నప్పుడు షరియా చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తామని మాట ఇచ్చి నిలబెట్టుకోనందువల్లే ఐసిస్‌-కెని ప్రారంభించామని ఆయన చెబుతున్నారు.

అఫ్గాన్‌లో పెత్తనంకోసం తహతహ

ప్రస్తుతం ఐసిస్‌-కె అఫ్గాన్‌, పాక్‌లకు పరిమితమైనా... మున్ముందు మధ్యాసియాలో, దక్షిణాసియాలో పూర్వ ఖలీఫా సామ్రాజ్యాన్ని పునఃప్రతిష్ఠించాలని ఉవ్విళ్లూరుతోంది. ప్రపంచ ఇస్లామిక్‌ సామ్రాజ్యాన్ని తిరిగి స్థాపించాలనే లక్ష్యానికి తాలిబన్లు తిలోదకాలిచ్చి, పాక్‌ ప్రోద్బలంతో పూర్తిగా అఫ్గాన్‌కే పరిమితమవుతున్నారని ఐసిస్‌-కె మండిపడుతోంది. అందుకే పాక్‌ను సర్వనాశనం చేస్తానంటోంది. అఫ్గాన్‌లో ఉన్న జిహాదీ గ్రూపులన్నింటిలోకీ అత్యంత ప్రమాదకరమైనది ఐసిస్‌-కె. ఇరాక్‌, సిరియాలలో నెలకొన్న ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐఎస్‌) స్ఫూర్తితో 2015లో అఫ్గానిస్థాన్‌లో ఐసిస్‌-కె ప్రారంభమైంది. పాకిస్థానీ, అఫ్గానీ తాలిబన్లు, ఇస్లామిక్‌ మూవ్‌మెంట్‌ ఆఫ్‌ ఉజ్బెకిస్థాన్‌ మాజీ సభ్యులతో మొదలైన ఈ సంస్థ క్రమంగా విస్తరించింది. ప్రస్తుతం అఫ్గానిస్థాన్‌ గూఢచారి సంస్థల సభ్యులు సైతం ఐసిస్‌-కెలో చేరిపోతున్నారు. ఇంతకుముందు అమెరికా మద్దతుతో నడిచిన అష్రఫ్‌ ఘనీ ప్రభుత్వ ఇంటెలిజెన్స్‌ సంస్థల్లో పనిచేసిన ఈ గూఢచారులను నేడు తాలిబన్లు వేటాడుతున్నందువల్ల వారిలో అత్యధికులు ఆత్మరక్షణ కోసం ఐసిస్‌-కెలో చేరిపోతున్నారు. అఫ్గానిస్థాన్‌లో అరాచకం, అల్లకల్లోలం సృష్టించడం ద్వారా తాలిబన్లను బలహీనపరచి తానే పెత్తనం చేయాలని ఐసిస్‌ చూస్తోంది. తదనుగుణంగా ప్రభుత్వ కార్యాలయాల మీద, బాలికల పాఠశాలల మీద, ప్రజాస్వామ్య ప్రదర్శనల మీద, షియా ప్రార్థన స్థలాల మీద దాడులకు తెగబడుతోంది. అంతర్జాతీయ సహాయ సిబ్బందిపైన, అఫ్గాన్‌లో మైనారిటీలైన సిక్కులు, హజారాల మీద కూడా ఐసిస్‌-కె పంజా విసరుతోంది. పాక్‌ సరిహద్దులోని నంగన్‌ హార్‌, కునార్‌ ప్రాంతాలను కేంద్రంగా చేసుకుని కార్యకలాపాలు సాగించే ఐసిస్‌- పాక్‌ నుంచి ఉగ్రవాదులను చేర్చుకుంటోంది. సాధన సామగ్రిని సేకరిస్తోంది. ఇరాక్‌, సిరియాలలోని మాతృ సంస్థ ఐసిస్‌ నుంచి ఐసిస్‌-కె కు పది కోట్ల డాలర్ల నిధులు అందినట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో అమెరికా, అష్రఫ్‌ ఘనీ ప్రభుత్వ దాడులతో ఐసిస్‌-కె నీరసించిపోయింది. తమ శ్రేణుల్లో మళ్ళీ ఉత్సాహం నింపడానికి ఆ సంస్థ అధిపతి షహాబ్‌ అల్‌ ముజాహిర్‌ నిరుడు ఆగస్టులో జలాలాబాద్‌ జైలు మీద దాడి జరిపి వందలాది ఉగ్రవాదులను విడుదల చేశారు. వారిలో తాజాగా పాక్‌కు హెచ్చరిక పంపిన నజీఫుల్లా ఒకరు!

పాముకు పాలు పోసి...

పాకిస్థాన్‌ సైన్యానికి, ప్రభుత్వాలకు ఉగ్రవాద సర్పాలను పెంచి పోషించడం వెన్నతో పెట్టిన విద్య. విదేశీ ఉగ్రవాద సంస్థలుగా అమెరికా ప్రకటించిన గ్రూపుల్లో 12 పాకిస్థాన్‌లో తిష్ఠ వేశాయని, వాటిలో అయిదు భారతదేశంపై దాడులు జరుపుతున్నాయని గతనెలలో అమెరికా కాంగ్రెస్‌(పార్లమెంటు)కు సమర్పితమైన ఒక నివేదిక వెల్లడించింది. పాక్‌ సైన్యానికి ప్రీతిపాత్ర ఇస్లామిక్‌ సంస్థ తెహ్రీకే-లబ్బైక్‌ పాకిస్థాన్‌ (టీఎల్‌పీ) గురించి ఇక్కడ చెప్పుకోవాలి. ఇటీవల అరెస్టయిన టీఎల్‌పీ అధ్యక్షుడు సాద్‌ హుసేన్‌ రిజ్వి విడుదలను డిమాండ్‌ చేస్తూ గత నెలలో 8,000 మంది కార్యకర్తలు లాహోర్‌ వీధుల్లో ప్రదర్శన జరిపారు. ఈ సందర్భంగా హింసాయుత ఘర్షణలు చోటుచేసుకుని ముగ్గురు పోలీసులతో సహా మొత్తం 10 మంది మరణించారు. దాదాపు 700 మంది గాయపడ్డారు. ఇస్లామిక్‌ తీవ్రవాదంపై ఫ్రాన్స్‌ తీసుకున్న కఠిన చర్యలను నిరసిస్తూ గత ఏప్రిల్‌లో నిరసన ప్రదర్శనలు జరిపిన సందర్భంగా టీఎల్‌పీ అధినేత సాద్‌ హుసేన్‌ అరెస్టయ్యారు. గతంలో నవాజ్‌ షరీఫ్‌ ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టడానికి పాక్‌ సైన్యం టీఎల్‌పీని సృష్టించి ఉసిగొల్పింది. నేడు ఆ సంస్థకు మద్దతు ఇస్తున్న తెహ్రీక్‌-ఇ-తాలిబన్‌ పాకిస్థాన్‌- ఇమ్రాన్‌ ప్రభుత్వంపై సాయుధ తిరుగుబాటు చేయాల్సిందిగా పాకిస్థానీలను పురిగొల్పుతోంది. పాలుపోసి పెంచినా విష సర్పాలు కాటేయక మానతాయా?

అంతర్గత కలహాలు

నేడు అఫ్గానిస్థాన్‌ పూర్తిగా తాలిబన్ల ఏలుబడిలో ఉందనుకోవడం పొరపాటు. దేశంలోని 34 రాష్ట్రాల్లో 15 అల్‌ఖైదా నేతృత్వంలో ఉన్నాయి. ఆయా రాష్ట్రాల్లో అన్ని కార్యకలాపాల్నీ అల్‌ఖైదాయే నిర్వహిస్తోంది. పాక్‌ సరిహద్దు రాష్ట్రాల్లో ఐసిస్‌-కె చురుగ్గా ఉంది. తాలిబన్లకు స్వదేశంలో గట్టి పోటీదారుగా హక్కానీ నెట్‌వర్క్‌ను చెప్పాలి. 1980లలో సోవియట్‌ను ఎదుర్కోవడానికి అమెరికా ప్రభుత్వం, పాకిస్థాన్‌ సైనిక గూఢచారి సంస్థ ఐఎస్‌ఐలు కలిసి హక్కానీ నెట్‌వర్క్‌ను పెంచిపోషించాయి. 1996లో, తిరిగి ఇటీవల ఏర్పడిన తాలిబన్‌ ప్రభుత్వాల్లో హక్కానీలు పెద్ద వాటా తీసుకున్నారు. ఈ రెండు వర్గాల మధ్య ఇప్పటికే లుకలుకలు మొదలైనట్లు వార్తలు వస్తున్నాయి. ఏదిఏమైనా, ఐసిస్‌-కె తనపైనా దాడి చేయవచ్చునని అమెరికా అనుమానిస్తోంది కాబట్టి- దాన్ని నిరోధించడానికి తాలిబన్లు, హక్కానీలు అవసరపడవచ్చు. అమెరికన్లు ఇప్పటికే తాలిబన్లతో మంతనాలు జరుపుతున్నారు. ఖతార్‌లోని అల్‌ ఉదైద్‌ వైమానిక స్థావరం నుంచి, అరేబియా సముద్రంలో నిలిపిన విమాన వాహక యుద్ధ నౌక నుంచి అమెరికన్‌ డ్రోన్లు, యుద్ధ విమానాలు పైకి లేచి పాకిస్థాన్‌ గగనతలం మీదుగా అఫ్గాన్‌లో ప్రవేశించి ఐసిస్‌, అల్‌ ఖైదాలపై దాడులు చేస్తాయి. అంటే, వాషింగ్టన్‌కు మళ్ళీ పాకిస్థాన్‌ అవసరం వచ్చిపడుతుందన్నమాట. అందుకేనేమో పాక్‌ను సర్వనాశనం చేస్తామని ఐసిస్‌-కె తాజాగా హెచ్చరించింది.

- కైజర్‌ అడపా

Posted Date: 06-11-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం