• facebook
  • whatsapp
  • telegram

శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం

భారత్‌ ఆపన్నహస్తం

ద్వీప దేశమైన శ్రీలంక గతంలో ఎన్నడూ ఎరగని ఆర్థిక కష్టాలతో విలవిలలాడుతోంది. విదేశాల నుంచి దిగుమతులకూ నగదు చెల్లించే పరిస్థితి అక్కడ కనిపించడం లేదు. ప్రస్తుతం శ్రీలంకలో విదేశ మారక నిల్వలు సైతం చాలా తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. చమురు, నిత్యావసర వస్తువులను సింహళ దేశం దిగుమతి చేసుకుంటోంది. విదేశ మారక నిల్వల కొరతతో లంకలో పెట్రోధరలు విపరీతంగా పెరిగాయి. డాలర్‌తో శ్రీలంక రూపాయి మారకపు విలువ రూ.275కు పడిపోయింది. గ్యాస్‌, పెట్రోల్‌, పాలపొడికోసం ప్రజలు గంటల తరబడి క్యూలలో నిలబడాల్సి వస్తోంది. వాటికి తోడు ఉక్రెయిన్‌పై రష్యా దాడితో ఇనుము, సిమెంట్‌, ఔషధాల ధరలకు రెక్కలొచ్చాయి. ప్రభుత్వ అనాలోచిత విధానాలతో కోట్ల మంది ప్రజలు ఆహారంకోసం అలమటిస్తున్నారు. క్యూలలో నిల్చొనే శక్తిలేక ఇప్పటికే కొందరు వృద్ధులు కన్నుమూశారు.

కుదేలైన పర్యాటక రంగం

సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు గతేడాది పురుగు మందులు, రసాయన ఎరువులపై శ్రీలంక ప్రభుత్వం నిషేధం విధించింది. రైతాంగాన్ని సన్నద్ధం చేయకుండానే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టడం పంటల ఉత్పత్తిపై ప్రభావం చూపి ఆహార సంక్షోభానికి దారి తీసింది. మరోవైపు హిందూ మహాసముద్రంలో చొరబాటుకు యత్నిస్తున్న చైనాకు శ్రీలంక భారత వ్యతిరేక వైఖరి మంచి అవకాశంగా కనిపించింది. రెండు దశాబ్దాలుగా రుణాలిస్తూ సింహళ దేశాన్ని రుణ ఊబిలోకి లాగింది. వడ్డీలు చెల్లించకపోవడంతో ఏకంగా హంబన్‌టొటా నౌకాశ్రయాన్ని 99 ఏళ్లపాటు లీజుకు తీసుకుంది. శ్రీలంక పాలకులు సైతం అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ వద్ద రుణాలకు యత్నించకుండా డ్రాగన్‌ వద్దే తీసుకున్నారు. ఆ అప్పుల వడ్డీలకే తమ ఆదాయాన్ని వెచ్చిస్తుండటంతో దేశం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది.

గత సెప్టెంబర్‌లో శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స ఆర్థిక ఆత్యయిక స్థితిని ప్రకటించారు. ఫలితంగా నిత్యావసరాలు, ఆహార పదార్థాల సరఫరా ప్రభుత్వ నియంత్రణలోకి వెళ్లిపోయాయి. శ్రీలంక జీడీపీలో అయిదు నుంచి 10శాతం పర్యాటక రంగంనుంచే సమకూరుతుంది. కొవిడ్‌ అనంతరం విదేశీ పర్యాటకుల సంఖ్య దాదాపు 70శాతం తగ్గింది. శ్రీలంక అంతర్జాతీయ పర్యాటకుల్లో 20శాతందాకా రష్యా, ఉక్రెయిన్‌ నుంచే ఉంటారని అంచనా. యుద్ధం కారణంగా అక్కడినుంచి సందర్శనలు దాదాపుగా నిలిచిపోయాయి. చైనా నుంచీ పర్యాటకులు పెద్దగా రావడం లేదు. మరోవైపు యూరోపియన్‌ సమాఖ్య దేశాలకు శ్రీలంక ఉత్పత్తులు ఎక్కువగా ఎగుమతి అవుతున్నాయి. ఎల్‌టీటీపై పోరులో భాగంగా శ్రీలంక సైన్యం అనేక యుద్ధ నేరాల ఆరోపణలను ఎదుర్కొంటోంది. వాటిపై సమగ్ర విచారణ జరిపించాలని ఈయూ కోరుతోంది. మానవ హక్కులకు విఘాతంగా మారిన ఉగ్రవాద నియంత్రణ చట్టాన్ని రద్దు చేయాలని సూచిస్తోంది. లేకుంటే శ్రీలంక నుంచి వస్తున్న ఉత్పత్తులకు అందిస్తున్న రాయితీని ఎత్తివేస్తామని హెచ్చరించింది. అదే జరిగితే కొలంబో ఆర్థిక వ్యవస్థ భారీ నష్టాల్లో కూరుకుపోతుందని ఆర్థిక వేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ పరిణామాలతో ఇప్పటికే సింహళ జాతీయ వాదులతో తీవ్రంగా నష్టపోయిన శ్రీలంక తమిళులు భారత్‌కు శరణార్థులుగా వస్తున్నారు. రాబోయే రోజుల్లో వారి సంఖ్య మరింతగా పెరిగితే వసతులు కల్పించడానికి తమిళనాడుపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది.

సైన్యాన్ని నిలువరిస్తే సత్సంబంధాలు

ఇటీవలే వంద కోట్ల డాలర్ల రుణాన్ని శ్రీలంకకు భారత్‌ ప్రకటించింది. సింహళ ఆర్థిక మంత్రి బసిల్‌ రాజపక్స ఇండియాకు వచ్చి ప్రధాని మోదీతో సమావేశమైన అనంతరం ఈ నిర్ణయం వెలువడింది. పలు అంశాల్లో లంకకు భారత్‌ సహకారం అందించనుంది. శ్రీలంకలో వివిధ రంగాల్లో భారత్‌ పెట్టుబడులకు ఆ దేశ యంత్రాంగం త్వరిత సహకారం అందించాలని గతంలోనే ఒప్పందం కుదిరింది. ఆహార ధాన్యాలు, పెట్రో ఉత్పత్తులు, ఔషధాల దిగుమతులు, కరెన్సీ మార్పిడి, ట్రింకోమలిలో చమురు నిల్వ కేంద్రాలను ఆధునికీకరించడం తదితరాలూ ఆ జాబితాలో ఉన్నాయి. వాటికి సంబంధించిన కార్యాచరణపై శ్రీలంక వేగం పెంచాల్సిన అవసరం ఉంది. తమ దేశం నుంచీ 250 కోట్ల డాలర్ల రుణంకోసం శ్రీలంక సంప్రతింపులు జరుపుతున్నట్లు చైనా అధికార వర్గాలు వెల్లడించాయి. దాన్నిబట్టి మరోసారి డ్రాగన్‌ రుణ చట్రంలో సింహళ దేశం చిక్కుకొనే సూచనలు కనిపిస్తున్నాయి. శ్రీలంకలో ఎవరు అధికారంలోకి వచ్చినా భౌగోళిక, సాంస్కృతిక సంబంధాల దృష్ట్యా భారత్‌తో సఖ్యత అవసరం. ఇండియా సైతం పొరుగున ఉన్న శ్రీలంకకు ప్రాధాన్యం ఇస్తోంది. రెండు దశాబ్దాలుగా చైనాకు దగ్గరై రుణ ఊబిలో కూరుకుపోవడంతో పాటు, బీజింగ్‌ విధానాలతో తమ దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతున్న తీరును శ్రీలంక ప్రజలు గమనిస్తున్నారు. దాంతో తమ చిరకాల మిత్ర దేశమైన భారత్‌తో సయోధ్య ఉండాలని అభిలషిస్తున్నారు. ఇండియా మత్స్యకారులపై కాల్పులు, దౌర్జన్యాలతో శ్రీలంక సాయుధ బలగాలు రెండు దేశాల మధ్య అశాంతిని ఎగదోస్తున్నాయి. వారిని అక్కడి ప్రభుత్వం నిలువరిస్తేనే ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం అవుతాయి.

- కొలకలూరి శ్రీధర్‌

 

 

‣ Read Latest job news, Career news, Education news and Telugu news

‣ Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 24-03-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం