• facebook
  • whatsapp
  • telegram

ఓటరు మౌనం... పార్టీల్లో ఉత్కంఠ!

ఉత్తరాఖండ్‌ ఎన్నికలపై స్థానిక సమస్యల ప్రభావం

ఉత్తరాఖండ్‌ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. సీనియర్‌ మంత్రి హరక్‌ సింగ్‌ను పార్టీ నుంచి ఆరేళ్ల పాటు నిషేధిస్తున్నట్టు భాజపా ప్రకటించింది. రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలతో ఆయన కుమ్మక్కై, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు సాగిస్తున్నారని కమలదళం ఆరోపించింది. తన కోడలికి పార్టీ టికెట్టును సైతం ఆయన డిమాండు చేశారు. 2016 వరకు కాంగ్రెస్‌ నేతగా ఉన్న హరక్‌ సింగ్‌- నాటి హరీశ్‌ రావత్‌ ప్రభుత్వాన్ని అస్థిరపరుస్తూ భాజపాలో చేరారు. 2017 ఎన్నికల్లో గెలుపొందిన అనంతరం కాంగ్రెస్‌ నుంచి వలస వచ్చిన నేతలకు భాజపా మంత్రి పదవులు కట్టబెట్టింది. ఎన్నికలకు ముందు తన విధేయతను మార్చుకోవడం హరక్‌కు అలవాటే. ఠాకుర్‌ వర్గానికి చెందిన హరక్‌ గత మూడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ పార్టీలు మారారు. ప్రస్తుతం కమలదళం బహిష్కరణ తరవాత కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోవాలనుకున్న ఆయన ఆశలపై మాజీ ముఖ్యమంత్రి హరీశ్‌ రావత్‌ నీళ్లు చల్లారు. ఆయన పునరాగమనాన్ని హరీశ్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. హరక్‌ భవితవ్యం ప్రస్తుతం కాంగ్రెస్‌ అధిష్ఠానం చేతుల్లో ఉంది.

అపరిష్కృతంగా సమస్యలు

ఉత్తరాఖండ్‌లో ఈ దఫా ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌, భాజపాల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. ఇరు పార్టీలకు చెందిన అగ్రనేతలు తమ ఘనతలను చాటుకొంటూనే, ప్రత్యర్థులపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత నెలలో భారీ బహిరంగ సభలో పాల్గొని కమలదళంలో ఉత్తేజం నింపారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ సైతం పలు ర్యాలీలు నిర్వహించి ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. మరోవైపు కరోనా కారణంగా బహిరంగ ప్రచారాలను నిషేధిస్తున్నట్టు ఈసీ ప్రకటించడంతో పార్టీలు సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకుంటున్నాయి. ప్రచారాల సంగతి ఎలా ఉన్నా, రాజకీయ నేతల హామీలు ప్రజలను ఏ విధంగా ప్రభావితం చేస్తాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ దఫా ఎన్నికల్లో ఎవరిని ఎన్నుకుంటారనే ప్రశ్నకు ప్రజల మౌనమే సమాధానంగా నిలుస్తోంది. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలు, నేతల పనితీరుపై సామాన్యులకు అవగాహన ఉంది. అయితే, స్థానిక నేతలు ప్రజలను ఆకట్టుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారని పలువురు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర ప్రజలను వెంటాడుతున్న సమస్యలను నేతలు విస్మరించారన్న వాదనలు జోరెత్తుతున్నాయి. కొత్త రాష్ట్రం ఏర్పడి దశాబ్దాలు గడుస్తున్నా చాలా సమస్యలు ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయని ప్రజలు మండిపడుతున్నారు. ఉత్తరాఖండ్‌ రాష్ట్రం 2000 సంవత్సరంలో ఏర్పడింది. అక్కడ ప్రస్తుతం నాలుగోసారి శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం పుష్కర్‌సింగ్‌ ధామి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. హామీల వర్షం కురిపించే నేతలకు ప్రజల కష్టాలను అర్థం చేసుకునేంత సమయం లేకుండా పోయిందన్నది అక్కడ ప్రధానంగా వినిపిస్తున్న విమర్శ. నిరుద్యోగం, తాగునీరు, విద్య, వైద్యం, నాణ్యమైన ఆహారధాన్యాల పంపిణీ, భూ కొనుగోళ్లు- అమ్మకాల సమస్యలకు పరిష్కారం చూపాలని ఎన్నో ఏళ్లుగా అక్కడి ప్రజలు డిమాండు చేస్తున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌తో ఆస్తుల విభజన వివాదం, లోక్‌పాల్‌ నియామకంలో జాప్యం, అవినీతి ఆరోపణ కేసులపై దర్యాప్తు కమిషన్ల నివేదికలు బయటపెట్టకపోవడం ప్రజలను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తున్నాయి. ఈ దఫా ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్‌లకు ఆప్‌ బలమైన పోటీనిచ్చేందుకు సిద్ధమైంది. ఆ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. విద్యావంతులు, సాధారణ పౌరులను ఆలోచింపజేసేలా హామీలిస్తున్నారు. కేజ్రీవాల్‌ హామీలను ప్రజలు ఎంత మేరకు విశ్వసిస్తారన్నది వేచిచూడాలి.

చర్చనీయ అంశాలెన్నో...

ఉత్తరాఖండ్‌లో అక్షరాస్యత రేటు అధికం. విద్యావంతులైన ఓటర్లకు శాసనసభ ఎన్నికలను ప్రభావితం చేయగలిగే సామర్థ్యం ఉంది. స్థానిక, జాతీయ అంశాలను దృష్టిలో పెట్టుకునే... వారు ఎన్నికల్లో తమ తీర్పు ఇస్తారు. పర్వత ప్రాంతమైన గైర్‌సైణ్‌ను రాష్ట్రానికి శాశ్వత రాజధానిగా ప్రకటించాలన్న డిమాండు క్రమంగా ఊపందుకొంటోంది. ఉద్యోగాలకోసం యువత ఇతర రాష్ట్రాలకు వలస వెళ్ళిపోతుండటం, మద్యం, అడవుల్లో అక్రమ కార్యకలాపాలు సర్వత్రా చర్చనీయాంశాలవుతున్నాయి. రాష్ట్రంలో అధికంగా ఉన్న ఠాకుర్‌ జనాభాకు ఎన్నికల పోటీలో అధిక ప్రాధాన్యం లభిస్తోంది. అసెంబ్లీతోపాటు పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ వారిదే పైచేయిగా ఉంటోంది. ఠాకుర్‌లలో పేరున్న భక్త్‌ దర్శన్‌ 1952 నుంచి 1970 వరకు తిరుగులేని ఆధిపత్యం చలాయించారు. 1971లో ప్రతాప్‌ సింగ్‌ నేగి; 1977, 80లలో బ్రాహ్మణ నేతలు జగన్నాథ్‌ శర్మ, కాంగ్రెస్‌ నేత హేమ్‌వతి నందన్‌ బహుగుణలు తమ సత్తా చాటారు. 1984, 89లో ఠాకుర్‌ వర్గానికి చెందిన చంద్ర మోహన్‌ సింగ్‌ నేగి- గఢ్వాల్‌ లోక్‌సభ స్థానాన్ని దక్కించుకున్నారు. వాస్తవానికి ఠాకుర్‌లతో బలమైన మైత్రి ఉన్నప్పటికీ, వారిని ఓడించడం బ్రాహ్మణ అభ్యర్థులకు అంత సులభం కాదు. ఉత్తరాఖండ్‌ జనాభాలో మాజీ సైనికుల సంఖ్యా ఎక్కువగా ఉన్నందువల్ల పార్టీల గెలుపు, ఓటములను వారి ఓట్లు ప్రభావితం చేసే అవకాశం ఉంది. మొత్తానికి ఉత్తరాఖండ్‌ ప్రజల మద్దతు ఎవరికి ఉంటుందన్నది ఎన్నికల తరవాతే తేలనుంది.

- ఆర్‌.పి.నైల్వాల్‌ 

(ఉత్తరాఖండ్‌ వ్యవహారాల నిపుణులు)
 

******************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ అణ్వాయుధ నిరోధంపై ఐక్యగళం

‣ సేంద్రియ సాగుకు ప్రోత్సాహమే కీలకం

‣ సరిహద్దుల్లో డ్రాగన్‌ కవ్వింపులు

‣ సహకార బ్యాంకులకు సంస్కరణల చికిత్స

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 21-01-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

రాజకీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం