* * ఈ సర్టిఫికెట్లలో ఏ ఒక్కటి ఉన్నా ఏటా రూ.15 వేలు జమ
* తాజాగా ఉత్తర్వులు జారీ
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో ఒకటి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులు ‘తల్లికి వందనం’ , ‘స్టూడెంట్ కిట్’ ప్రయోజనాలు పొందడానికి ఆధార్ కలిగి ఉండాలని, ఒకవేళ లేకపోతే నమోదు కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఆధార్ వచ్చే వరకు 10 రకాల పత్రాలను పరిగణనలోకి తీసుకుంటామని వెల్లడించింది. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు.‘తల్లికి వందనం’ పథకం కింద దారిద్య్ర రేఖకు దిగువన ఉండి, పాఠశాలలకు పిల్లల్ని పంపించే తల్లులు లేదా సంరక్షకులకు ఏడాదికి రూ.15 వేలు ఆర్థిక సాయం చేయనున్నారు. విద్యార్థులకు 75 శాతం హాజరు తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు. స్టూడెంట్ కిట్ కింద ప్రభుత్వ, ఎయిడెడ్ బడుల్లో చదివే విద్యార్థులకు బ్యాగ్, మూడు జతల ఏకరూప దుస్తులు, బెల్టు, జత బూట్లు, రెండు జతల సాక్సులు, పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, వర్క్ బుక్లు, ఆంగ్ల నిఘంటువు ఇస్తున్నారు. ఈ రెండు పథకాల కింద ప్రయోజనం పొందేందుకు ఆధార్ను కలిగి ఉండాలి. ఒకవేళ ఎవరికైనా లేకపోయినా.. విద్యాశాఖ ద్వారా ఆధార్ నమోదు సదుపాయాన్ని కల్పించాలని సూచించారు. ఆధార్ వచ్చే వరకు ఓటరు గుర్తింపు కార్డు, ఉపాధి పథకం కార్డు, కిసాన్ పాస్బుక్, రేషన్ కార్డు, పాస్పోర్టు, బ్యాంకు లేదా తపాలా పాస్బుక్, డ్రైవింగ్ లైసెన్సు, వ్యక్తిని ధ్రువీకరిస్తూ గెజిటెడ్ అధికారి సంతకం చేసిన పత్రం, తహసీల్దారు ఇచ్చే పత్రం, విభాగం సూచించే ఏ పత్రాన్నైనా అనుమతిస్తారని వెల్లడించారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Share chat, Google News Subscribe our Youtube Channel.