* తాజా నిబంధనలు ఇవే..
* మొత్తం 6,100 ఖాళీల భర్తీ
* కొత్తగా అప్రెంటిస్షిప్ విధానం
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో డీఎస్సీ, ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ప్రకటన కొద్ది రోజుల్లో విడుదల కానుందని సమాచారం. మంగళవారం విద్యా శాఖ అధికారులతో మంత్రి బొత్స సత్యనారాయణ సమావేశమై నియామక ప్రక్రియ, విధివిధానాలపై చర్చించారు. ఈ మేరకు డీఎస్సీలో 6,100 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈసారి కొత్తగా 12ఏళ్ల క్రితం తొలగించిన అప్రెంటిస్షిప్ విధానాన్ని తీసుకురానున్నారు. డీఎస్సీలో ఎంపికైన ఉపాధ్యాయులు రెండేళ్లపాటు గౌరవవేతనానికి పని చేయాల్సి ఉంటుంది. టెట్, డీఎస్సీలకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షల నిర్వహణకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ టీసీఎస్తో ఒప్పందం కుదుర్చుకోనుంది.
* డీఈడీ వారికే ఎస్జీటీ అర్హత
సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులకు పేపర్-1, స్కూల్ అసిస్టెంట్లకు పేపర్-2 విడివిడిగా టెట్ నిర్వహిస్తారు. ఎస్జీటీ పోస్టులకు డీఈడీ లేదా నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చదివిన వారు మాత్రమే అర్హులు. టెట్ రాసేందుకు ఓసీలకు ఇంటర్మీడియట్లో 50 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు 45 శాతం మార్కులు ఉండాలి. స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులైన అభ్యర్థులకు డిగ్రీలో అర్హత మార్కులు 40 శాతంగా ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని ఈ ఒక్కసారికే అనుమతించింది. గత ప్రభుత్వంలో 2018లో చివరిసారిగా డీఎస్సీ నిర్వహించారు. మొత్తం 7,902 పోస్టులకు ప్రకటన ఇవ్వగా.. 6.08 లక్షల దరఖాస్తులు వచ్చాయి. గతంలో ఎస్జీటీ పోస్టులకు బీఈడీ చేసిన వారికి అర్హత కల్పించినందున ఈ పోస్టులకు డీఎస్సీ, టెట్ కలిపి 100 మార్కులకు నిర్వహించారు. టీజీటీ వారికి ఆంగ్ల భాషలో స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించారు. ఈసారి టెట్, డీఎస్సీ విడివిడిగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. టెట్, డీఎస్సీ రెండింటికి దరఖాస్తుల స్వీకరణ పూర్తయ్యేనాటికి ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.