* అర్హతలు సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
ఈనాడు, అమరావతి: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) రాసేందుకు అర్హతలను సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒకటి నుంచి 5 తరగతులకు బోధించే సెకండరీ గ్రేడ్ టీచర్స్ (SGT)కు నిర్వహించే టెట్-1 పేపర్కు రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (DELED), నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (BELED) చేసిన వారే అర్హులని పేర్కొంది. ఓసీలకు ఇంటర్మీడియట్, తత్సమాన విద్యార్హతలో 50శాతం మార్కులు ఉండాలనే నిబంధన పెట్టింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు 5% మినహాయింపునిచ్చి.. 45% మార్కులు ఉండాలని పేర్కొంది. ఎస్జీటీ పోస్టులకు బీఈడీ చేసిన వారు అర్హులేనంటూ జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి 2018లో ఇచ్చిన నోటిఫికేషన్ను సుప్రీంకోర్టు రద్దు చేసినందున ఈ సవరణ ఉత్తర్వులు ఇచ్చినట్లు ప్రభుత్వం పేర్కొంది. టెట్ నిర్వహణ వ్యయాన్ని అభ్యర్థుల దరఖాస్తు ఫీజుల నుంచే భరించాలని సూచించింది. వైకాపా ప్రభుత్వం వచ్చాక 2022లో ఒకసారి టెట్ నిర్వహించింది. గతంలో ఏడాదికి రెండుసార్లు టెట్ నిర్వహించాలనే నిబంధన ఉండగా.. ఒక్కసారే నిర్వహించాలని 2021లో జగన్ సర్కార్ దాన్ని సవరించింది.
రెండో పేపర్ అర్హత మార్కుల్లో మినహాయింపు
టెట్ ‘పేపర్-2ఏ’కు హాజరయ్యే ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు డిగ్రీలో అర్హత మార్కులను 40శాతానికి తగ్గించింది. ఒక్కసారికే ఈ మినహాయింపు ఇస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. గతంలో టెట్ రాసేందుకు అర్హత మార్కులు 45శాతం కాగా..దీన్ని 5శాతం తగ్గించింది. డిగ్రీలో 40శాతం మార్కులతో బీఈడీ చేసేందుకు అనుమతిస్తున్నారు. కానీ, టెట్ రాసేందుకు 45శాతం ఉండాలనే నిబంధన గతంలో పెట్టారు. దీనిపై అనేక ఫిర్యాదులు రావడంతో ఎప్పటికప్పుడు మినహాయింపునిస్తున్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.