* బాలికలు దరఖాస్తుకు అర్హులు
అమరావతి: ఏపీలో సమగ్ర శిక్ష ఆధ్వర్యంలోని 352 కస్తూర్బాగాంధీ విద్యాలయాల్లో (కేజీబీవీ) 2024-25 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తులు మొదలయ్యాయి. 6, 11వ తరగతుల్లో కొత్తగా ప్రవేశాలు, 7, 8, 9 తరగతుల్లో మిగిలిన సీట్లను భర్తీ చేసేందుకు మార్చి 12 నుంచి ఏప్రిల్ 11 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. అనాథలు, బడి బయట పిల్లలు, డ్రాపౌట్స్ (మధ్యలో బడి మానేసిన వారు), పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన బాలికలు మాత్రమే దరఖాస్తు చేసుకొనేందుకు అర్హులు. కేజీబీవీ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో అప్లికేషన్లు స్వీకరిస్తారు. విద్యార్థుల తల్లిదండ్రుల ఆదాయ పరిమితి గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.2 లక్షలు; పట్టణ ప్రాంతాల్లో రూ.1.4 లక్షలు మించరాదు.
షెడ్యూల్ ఇదే..
మార్చి 12 నుంచి ఏప్రిల్ 11 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిదో తరగతుల విద్యార్థుల సెలక్షన్ జాబితా ఏప్రిల్ 15 నాటికి సిద్ధమవుతుంది. ఏప్రిల్ 16 నుంచి 18 వరకు వెరిఫికేషన్ చేసి.. ఏప్రిల్ 19న జాబితాను విడుదల చేస్తారు. ఎంపికైన విద్యార్థులకు ఫోన్లో సమాచారం ఇస్తారు. ఏప్రిల్ 19 నుంచి 24 వరకు సంబంధిత కేజీబీవీల్లో ప్రిన్సిపాళ్లు సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేస్తారు. మరిన్ని వివరాలను టోల్ ఫ్రీ నంబర్ 18004258599 సంప్రదించవచ్చని సమగ్రశిక్ష రాష్ట్ర సంచాలకులు బి.శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.