* అన్స్టాప్ టాలెంట్ నివేదిక
ముంబయి: మన దేశంలో పూర్తి స్థాయిలో ప్రాంగణ నియామకాల ఘనత సాధించిన కళాశాలలు 7 శాతంగానే ఉన్నాయని యాన్యువల్ అన్స్టాప్ టాలెంట్ నివేదిక 2024 వెల్లడించింది. నైపుణ్యాల లేమి, సరైన ప్రతిభ లేకపోవడంతోనే 100 శాతం ప్రాంగణ నియామకాలు అన్ని కళాశాలల్లో జరగడం లేదని పేర్కొంది. 91 శాతం మంది విద్యార్థులు తమ కళాశాలలో ఉద్యోగానికి అవసరమైన అన్ని అంశాలు బోధిస్తున్నారని భావిస్తుండగా, నైపుణ్య లేమి, సన్నద్ధత లేకపోవడం వంటివి ప్రధాన సవాళ్లుగా ఉన్నాయని 66 శాతం మంది రిక్రూటర్లు, 42 శాతం విశ్వవిద్యాలయ భాగస్వాములు వెల్లడించారని నివేదిక వివరించింది. 88 శాతం మంది హెచ్ఆర్ (మానవ వనరుల) ప్రాక్టీషనర్లు నైపుణ్య-ఆధారిత నియామకాలకు అభ్యర్థుల సామర్థ్యాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అకడమిక్స్, రెఫరెన్సెస్, ఇంటర్న్షిప్లు, ప్రాజెక్టుల వంటివి తర్వాతే చూస్తున్నట్లు పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా 11,000 మంది విద్యార్థులు, విశ్వవిద్యాలయ భాగస్వాములు, మానవ వనరుల అధికారులతో విస్తృత సర్వే నిర్వహించి సేకరించిన ప్రతిస్పందనల ఆధారంగా ఈ నివేదిక రూపొందించినట్లు అన్స్టాప్ వ్యవస్థాపకులు, సీఈఓ అంకిత్ అగర్వాల్ వెల్లడించారు. వేతన పెంపుల కంటే ఉద్యోగ భద్రతకు 60 శాతం మంది (ప్రతి అయిదుగురిలో ముగ్గురు) ప్రాధాన్యమిస్తున్నారని నివేదిక తెలిపింది. భత్యాలు, ఇతర ప్రయోజనాల కంటే చేతికి వచ్చే వేతనమే ముఖ్యమని అధిక శాతం మంది పేర్కొనడం గమనార్హం. బి-స్కూల్ విద్యార్థులకు మార్కెటింగ్ ఉద్యోగాలు అగ్ర స్థానంలో ఉన్నాయి. ఆర్ట్స్, సైన్స్ విద్యార్థులకు ఫైనాన్స్, అనలిటిక్స్ ఉద్యోగాలు అధిక ప్రాధాన్య జాబితాలో ఉన్నాయి. ఆర్ట్స్, సైన్స్, కామర్స్లో పురుషులకు రూ.6-10 లక్షలు, మహిళలకు రూ.2-5 లక్షల వార్షిక ప్యాకేజీ లభిస్తోంది. బి-స్కూల్లో 55 శాతం మంది పురుషులకు రూ.16 లక్షలకు పైగా వార్షిక వేతన ప్యాకేజీ ఉంటుండగా, మహిళల్లో 45 శాతం మందికి మాత్రమే రూ.16 లక్షలకు పైగా వార్షిక ప్యాకేజీ అందుతోందని నివేదిక తెలిపింది
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.