• facebook
  • whatsapp
  • telegram

CBSE, STATE BOARD: సిలబస్‌ ఒక్కటే.. పరీక్షలు వేర్వేరు!  

* సీబీఎస్‌ఈ బడుల్లో హిందీ బోధన.. పబ్లిక్‌ పరీక్షలు ఉండవు!

* ఆంగ్ల మాధ్యమంలో పరీక్షలతో విద్యార్థులకు భారం

ఈనాడు, అమరావతి: గత వైకాపా ప్రభుత్వం పాఠశాల విద్యలో చేసిన ప్రయోగాలు అయోమయంగా మారాయి. రాష్ట్రంలో విద్యార్థులందరూ ఒకే సిలబస్‌ చదువుతున్నా పరీక్షలు మాత్రం విభిన్నంగా ఉన్నాయి. ఇప్పుడు దీన్ని ఎలా సరిచేయాలనేదానిపై కొత్త ప్రభుత్వం దృష్టిసారించింది. పదోతరగతి  విద్యార్థులకు ఈ ఏడాది ఎన్‌సీఈఆర్టీ సిలబస్‌ అమలు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు బడుల్లో చదివే అందరికీ సీబీఎస్‌ఈ సిలబస్‌ అమలవుతోంది. సీబీఎస్‌ఈ గుర్తింపు ఉన్న వెయ్యి బడులకు ఆ బోర్డు పరీక్ష నిర్వహిస్తుంది. మిగతా అన్నింటికీ రాష్ట్రబోర్డే పరీక్షలు పెడుతుంది. విద్యార్థులు ఒకే సిలబస్‌ చదువుతున్నా పరీక్షల విధానం, చదివే సబ్జెక్టుల్లో వ్యత్యాసం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఏటా 6 లక్షల మంది పదోతరగతి పరీక్షలు రాస్తున్నారు. ఈసారి వీరిలో 82,764 మంది సీబీఎస్‌ఈ పరీక్షలను తొలిసారి రాస్తారు. 

సిలబస్‌ ఒక్కటే.. 

రాష్ట్రంలో 6,500 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఉండగా.. వెయ్యింటికే సీబీఎస్‌ఈ గుర్తింపు ఉంది. అన్నింట్లోనూ సీబీఎస్‌ఈ సిలబస్‌నే అమలు చేస్తున్నారు. కానీ.. పరీక్షలు, అంతర్గత మార్కులు, చదివే సబ్జెక్టుల విధానంలో వ్యత్యాసం ఉంది. సీబీఎస్‌ఈలో ఐదు సబ్జెక్టులే ఉంటాయి. భాష సబ్జెక్టులు రెండింట్లో రెండో భాషగా తెలుగు లేదా హిందీ ఒకటే ఉంటుంది. వీరికి అంతర్గత మార్కులు 20% ఉంటాయి. 80 మార్కుల రాతపరీక్షలో 13 మార్కులు తెచ్చుకుంటే ఉత్తీర్ణులైనట్లుగా పరిగణిస్తారు. కానీ, రాష్ట్రబోర్డులో అంతర్గత మార్కులు ఉండవు. వంద మార్కులకు పరీక్ష రాయాలి. ఆరు సబ్జెక్టుల విధానం ఉంది. ఒకే సిలబస్‌ చదువుతున్న విద్యార్థులకు రెండు బోర్డుల్లో రెండు రకాలుగా పరీక్షలుంటాయి. 

హిందీ చదవాలి.. పరీక్ష ఉండదు

సీబీఎస్‌ఈలో ఎక్కువమంది రెండో భాషగా తెలుగు ఎంచుకున్నారు. దీంతో వీరు హిందీ చదవక్కర్లేదు. కానీ, రాష్ట్రవ్యాప్తంగా గతంలో నియమితులైన హిందీ ఉపాధ్యాయులు ఉన్నారు. దాంతో పదోతరగతి విద్యార్థులకు హిందీని బోధిస్తున్నారు. అంటే, హిందీ చదివినా పబ్లిక్‌ పరీక్ష ఉండదు. ప్రభుత్వ బడుల్లో హిందీ అదనంగా బోధిస్తున్నారు.

తెలుగు మార్పుతో అనేక ఇబ్బందులు

పాఠశాల విద్యాశాఖ ఈ ఏడాది పదోతరగతి విద్యార్థులకు తెలుగు పుస్తకం మార్చినా, సకాలంలో సీబీఎస్‌ఈ బోర్డుకు చెప్పలేదు. దీంతో బోర్డు పాత తెలుగు పుస్తకాన్నే అమలుచేయాలని ఆదేశాలు ఇచ్చింది. చాలా ప్రభుత్వబడుల్లో ఏప్రిల్‌లోనే కొత్త తెలుగు పుస్తకంలోని పాఠాలు బోధించారు. ఇప్పుడు మళ్లీ మొదట్నుంచి చెప్పాల్సి వస్తోంది. ఇందులోనూ ప్రభుత్వ, ప్రైవేటుకు కొన్ని పాఠాలు మారిపోవడంతో ఏది బోధించాలో తెలియక, ఉపాధ్యాయుల్లో సందిగ్ధత ఉంది. 

అకడమిక్‌ కేలండర్‌లో జాప్యం

పాఠశాలలకు ఇంతవరకు అకడమిక్‌ కేలండర్‌ విడుదల చేయలేదు. సీబీఎస్‌ఈ బడులకు మూడు నెలలకు ప్రణాళిక ఇచ్చారు. రాష్ట్రబోర్డు పరీక్షలకు ఇంతవరకు ఆ ఊసే లేదు. సాధారణంగా పాఠశాలల పునఃప్రారంభంలో అకడమిక్‌ కేలండర్‌ ఇస్తారు. ఉపాధ్యాయులు సైతం అకడమిక్‌ కేలండర్‌ విడుదల చేయాలని పలుమార్లు వినతులు అందించారు.

ఆంగ్లంలోనే రాయాలి

వైకాపా ప్రభుత్వం 2020-21లో ఒకేసారి 1-6 తరగతులను ఆంగ్ల మాధ్యమంలోకి మార్చేసింది. వీరిలో చాలామంది అప్పటివరకు తెలుగు మాధ్యమంలో చదివారు. ఇప్పుడు వీరు పదోతరగతికి వచ్చారు. వీరిలో 82వేల మంది సీబీఎస్‌ఈ బోర్డు, మిగతా వారు రాష్ట్రబోర్డు పరీక్షలను ఆంగ్ల మాధ్యమంలో రాయాలి.
ద్విభాష పాఠ్యపుస్తకాలు ఉన్నందున విద్యార్థులు తమకు అర్థమయ్యే భాషలో చదువుకుంటున్నారు. చాలాచోట్ల పదోతరగతి సాంఘిక, సామాన్య శాస్త్రాలను ఉపాధ్యాయులు తెలుగులోనే చెప్పేస్తున్నారు. తెలుగులో చదివినా పబ్లిక్‌ పరీక్షలు మాత్రం ఆంగ్లంలోనే రాయాలి. సీబీఎస్‌ఈ రాసేవారు పకడ్బందీగా సన్నద్ధమైతే తప్ప పరీక్షల్లో మంచి మార్కులు రావు.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 21-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.