* 5,887 పోస్టులు ఇస్తామని సీఎం జగన్ ప్రకటన
* భర్తీ చేసింది 4,072 మాత్రమే
* రిజర్వేషన్ పాటించకపోవడంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అన్యాయం
ఈనాడు, అమరావతి: డీఎస్సీ-98లో అర్హత సాధించిన 5,887 మందికి కాంట్రాక్టు విధానంలో ఉద్యోగాలిస్తున్నట్లు శాసనసభలో ప్రకటించిన సీఎం జగన్.. నియామకాలకు వచ్చేసరికి నిబంధనల పేరుతో 1,815 పోస్టులకు కోత వేశారు. రోస్టర్ ఆఫ్ రిజర్వేషన్ పాటించకపోవడంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు చాలా మంది ఉద్యోగావకాశాలు కోల్పోయారు. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీలు అంటూ ప్రతి సభలో గొప్పలు చెప్పే సీఎం జగన్కు ఈ వర్గాలకు డీఎస్సీ-98లో న్యాయం చేసేందుకు చేతులు రావడం లేదు. మినిమం టైంస్కేల్తో కాంట్రాక్టు విధానంలో నియమించిన ఈ పోస్టుల్లో మెరిట్ ప్రాతిపదికన నియామకాలు చేపట్టారు. దీంతో ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో చాలా మందికి ఉద్యోగాలు రాలేదు.
అన్నీ కోతలే..
శాసనసభ సమావేశాల సందర్భంగా 2022 సెప్టెంబరు 19న సీఎం జగన్.. డీఎస్సీ-98 అర్హులు 5,887 మందికి కాంట్రాక్టు విధానంలో ఉద్యోగాలిస్తామని ప్రకటించారు. నియామక ఉత్తర్వులకు వచ్చేసరికి వీటిని 4,534 పోస్టులకు కుదించేశారు. భర్తీకి వచ్చేసరికి మరో 462 పోస్టులు ఎగిరిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా 4,072 పోస్టులను మాత్రమే భర్తీ చేశారు. అర్హులందరికీ ఉద్యోగాలిస్తామంటూ అన్ని జిల్లాల్లోనూ అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలించారు. ప్రకాశం జిల్లాలో 726 మంది ధ్రువపత్రాలను పరిశీలించిన అధికారులు 165 మంది మాత్రమే అర్హులుగా తేల్చారు. డీఎస్సీ-98 నుంచి ఆ తర్వాత డీఎస్సీ భర్తీకి వెళ్లిన పోస్టుల్లో నియామకాలు చేపట్టారంటూ మెలిక పెట్టి కోత విధించారు. దీంతో చాలా మంది ఉద్యోగాలకు దూరమయ్యారు. సీఎం జగన్ ప్రకటించిన 5,887 పోస్టులను భర్తీ చేయాలని నిరుద్యోగ అభ్యర్థులు ఎనిమిది నెలలుగా ఆందోళనలు చేస్తూనే ఉన్నప్పటికీ ప్రభుత్వంలో చలనం లేదు.
రిజర్వేషన్ పాటించకపోవడంతో...
జిల్లాలవారీగా కటాఫ్ పెట్టి పోస్టులకు ఎంపిక చేశారు. రోస్టర్ ఆఫ్ రిజర్వేషన్ పాటించకపోవడంతో ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో చాలా మందికి ఉద్యోగాలు రాలేదు. ఈ రిజర్వేషన్ అమలు కాంట్రాక్టు విధానంలో కుదరదంటూ ప్రభుత్వం ఆ వర్గాల వినతులను పట్టించుకోవడం లేదు. కొన్ని జిల్లాల్లో ఎస్జీటీ పోస్టులు లేకపోవడంతో వేరే జిల్లాల్లో మిగులుగా ఉన్నవి ఆయా జిల్లాలకు మార్చి సర్దుబాటు చేశారు. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, అనంతపురం, గుంటూరు, ప్రకాశం, కడప, కర్నూలు జిల్లాలకు ఇతర జిల్లాలనుంచి 1,381 పోస్టులను తీసుకొచ్చి సర్దుబాటు చేశారు. ఉమ్మడి కడప, కర్నూలు, ప్రకాశం, నెల్లూరు, ఉభయగోదావరి జిల్లాలవారికి అన్యాయం చేశారని, అభ్యర్థులు ఎక్కువగా ఉన్నా తక్కువ మందికి ఉద్యోగాలిచ్చారని నిరుద్యోగులు వాపోతున్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.