* ఆందోళనలో లక్షల మంది అభ్యర్థులు
ఈనాడు ప్రతిభ డెస్క్: సార్వత్రిక ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం శనివారం (మార్చి 16న) వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్లో మే 13న ఒకే విడతలో అసెంబ్లీ/ లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి. తెలంగాణలోనూ లోక్సభ పోలింగ్ అదే రోజు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో మేలో జరిగే కొన్ని ముఖ్యమైన పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఈఏపీసెట్ తెలంగాణలో మే 9 నుంచి 12 వరకు, ఏపీలో మే 13 నుంచి 19 వరకు నిర్వహించబోతున్నారు. దాదాపు అయిదు లక్షల మంది వీటిని రాస్తారు. అదే సమయంలో 4,187 ఖాళీలతో వెలువడిన దిల్లీ పోలీసు, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్)లో సబ్-ఇన్స్పెక్టర్ నియామక పరీక్ష-2024 నోటిఫికేషన్కు సంబంధించి మే 9, 10, 13 తేదీల్లో రాత పరీక్షలు జరగబోతున్నాయి. వీటికీ తెలుగు రాష్ట్రాల నుంచి వేలమంది హాజరయ్యే అవకాశం ఉంది. పరీక్ష సెంటర్ల కేటాయింపులు, ప్రజా రవాణా సౌకర్యాలకు ఎన్నికల వల్ల ఇబ్బందులు తలెత్తవచ్చని భావిస్తున్నారు. దూరంగా సెంటర్ పడితే, అక్కడ సరైన సౌకర్యాలు లేకపోతే కష్టమవుతుందని భయపడుతున్నారు. కొంతమంది తమ ఓటు హక్కు వినియోగించుకోడానికి అవకాశం లేకుండా పోతుందేమో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని ఏ విధమైన ఆటంకాలు, ఇబ్బందులు లేకుండా పరీక్షలు నిర్వహించడానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.