• facebook
  • whatsapp
  • telegram

Highest pass: ఇంటర్‌లో అత్యధిక ఉత్తీర్ణత


ఈనాడు, అమరావతి: ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల పబ్లిక్‌ పరీక్షల్లో ఈ ఏడాది అత్యధిక ఉత్తీర్ణత నమోదైంది. గత ఎనిమిదేళ్ల ఫలితాలతో పోల్చితే ఈసారే ఎక్కువ మంది విద్యార్థులు పాసయ్యారు. రెండు సంవత్సరాలకు కలిపి 8,55,030 మంది పరీక్షలు రాయగా.. 6,17,403 మంది (72%) ఉత్తీర్ణత సాధించారు. ప్రథమ సంవత్సరంలో 67%, ద్వితీయ సంవత్సరంలో 78% మంది ఉత్తీర్ణులయ్యారు. కొవిడ్‌ సమయంలో మినహా గత ఎనిమిదేళ్లలో ఇదే అత్యధికం. గతేడాది ప్రథమ సంవత్సరంలో 61%, రెండో ఏడాదిలో 72% పాసయ్యారు. ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల ఫలితాలను కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ వి.వి.సుబ్బారావుతో కలిసి ఇంటర్‌ మండలి కార్యదర్శి సౌరభ్‌ గౌర్‌ ఏప్రిల్‌12న విడుదల చేశారు. మొదటి ఏడాది 4,61,273 మంది పరీక్షలు రాయగా, 3,10,875 మంది, రెండో ఏడాది 3,93,757 మంది పరీక్షలకు హాజరు కాగా 3,06,528 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురతో పోల్చితే బాలికలు మంచి ఫలితాలు సాధించారు. ద్వితీయ సంవత్సరంలో బాలురు 75%, బాలికలు 81% ఉత్తీర్ణులయ్యారు. ప్రథమ సంవత్సరంలో బాలురు 64%, బాలికలు 71% చొప్పున పాసయ్యారు.

* ఫెయిలైన విద్యార్థులు నిరుత్సాహపడొద్దు

ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులు కాని విద్యార్థులు నిరుత్సాహపడొద్దని, ఈ ఫలితాల ఆధారంగా తమను తాము తక్కువగా ఊహించుకోవద్దని కార్యదర్శి సౌరభ్‌ గౌర్‌ సూచించారు. భవిష్యత్తులో సాధించే విజయాలకు ప్రస్తుత ఓటమి తొలిమెట్టు అని పిల్లలకు తల్లిదండ్రులు భరోసా ఇవ్వాలని, ఫలితాల గురించి ఆందోళన చెందొద్దని పేర్కొన్నారు. విద్యార్థుల సర్టిఫికెట్లను డిజిలాకర్‌లో ఉంచామని, వాటిని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపారు.

కృష్ణా జిల్లాదే హవా: ఈసారి ఇంటర్‌ ఫలితాల్లో కృష్ణా జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. కార్పొరేట్‌, ప్రైవేటు కళాశాలలు ఇక్కడ ఎక్కువగా ఉండడంతో ఫలితాల్లోనూ ముందంజలో నిలిచింది.

ప్రథమ సంవత్సరం ఫలితాల్లో కృష్ణా 84%, గుంటూరు 81%, ఎన్టీఆర్‌ 79% ఉత్తీర్ణతతో వరుసగా మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా 48% ఉత్తీర్ణతతో అట్టడుగున నిలిచింది.

ద్వితీయ సంవత్సరంలో కృష్ణా 90%, గుంటూరు 87%, ఎన్టీఆర్‌ 87%, విశాఖపట్నం 84% ఉత్తీర్ణతతో ముందువరుసలో ఉండగా, చిత్తూరు 63%తో చివరిలో నిలిచింది.

ప్రథమ సంవత్సరంలో బాలురు, బాలికల ఉత్తీర్ణత  శాతాల పరంగా కృష్ణా జిల్లా 82%, 86% చొప్పున సాధించి మొదటి స్థానంలో ఉంది. బాలురలో అనకాపల్లి 39%, బాలికల్లో అల్లూరి సీతారామరాజు జిల్లా 50%తో అట్టడుగున నిలిచాయి.

ద్వితీయ సంవత్సరానికి సంబంధించి.. బాలుర, బాలికల ఉత్తీర్ణత రెండు విభాగాల్లో కృష్ణా జిల్లా 90 శాతం చొప్పున సాధించి అగ్రస్థానంలో ఉంది. బాలుర అత్యల్ప ఉత్తీర్ణతలో అనకాపల్లి 56శాతంతో అట్టడుగున నిలిచింది. బాలికల పరంగా 68 శాతంతో చిత్తూరు చివరన నిలిచింది.
 


మరింత సమాచారం... మీ కోసం!

‣ స్టాన్‌ఫర్డ్‌లో ఎంబీఏ సీటు.. రూ.కోటి స్కాలర్‌షిప్పు!

‣ నెట్‌ విలువలకు.. నెటికెట్‌

‣ భారీ వేతన వరప్రదాయిని.. కోడింగ్‌

‣ సోషల్‌ మీడియా ఖాతాల ముఖ్యపాత్ర

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 13-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.