• facebook
  • whatsapp
  • telegram

TGPSC: మహిళాశిశు సంక్షేమ శాఖలో... సీడీపీవో, ఈవో పోస్టుల రాతపరీక్షలు రద్దు

* త్వరలో పునఃపరీక్షలు ఉంటాయని టీజీపీఎస్సీ వెల్లడి 
 

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో నిరుడు ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో... గతంలో నిర్వహించిన రెండు ఉద్యోగ నోటిఫికేషన్ల రాతపరీక్షల్ని టీజీపీఎస్సీ రద్దుచేసింది. మహిళాశిశు సంక్షేమ శాఖలో శిశు అభివృద్ధి ప్రాజెక్టు అధికారులు (సీడీపీవో ప్రకటన నంబరు 13/2022), విస్తరణ అధికారులు (ఈవో ప్రకటన నంబరు 11/2022) ప్రశ్నపత్రాలు లీకైనట్లు వెల్లడైంది. ఈ కేసు విచారణలో భాగంగా సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ లాబొరేటరీ (సీఎఫ్‌ఎస్‌ఎల్‌), ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) నివేదిక ఆధారంగా 2023 జనవరి 3, 8 తేదీల్లో నిర్వహించిన పరీక్షలు రద్దు చేసినట్లు టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్‌ నికోలస్‌ ఒక ప్రకటనలో వెల్లడించారు. పునఃపరీక్ష తేదీలను అభ్యర్థులకు త్వరలో వెల్లడిస్తామన్నారు. ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో గతంలోనే గ్రూప్‌-1, ఏఈఈ, ఏఈ పరీక్షలు రద్దు చేశారు. ఈ పరీక్షలపై మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సిట్, ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ నివేదిక వచ్చిన తరువాత నిర్ణయం తీసుకుంటామని అప్పట్లోనే కమిషన్‌ తెలిపింది. తాజాగా ఈ నివేదిక రావడంతో పరీక్షలు రద్దు చేసింది. 

ఇప్పటికే సీడీపీవో ఎంపిక జాబితా వెల్లడి...

మహిళా శిశు సంక్షేమశాఖలో 23 సీడీపీవో, 181 ఈవో పోస్టులకు 2022లో ఉద్యోగ ప్రకటనలు వెలువడ్డాయి. సీడీపీవో పోస్టులకు 19,182 మంది, ఈవో పోస్టులకు 26,751 మంది దరఖాస్తు చేసుకున్నారు. సీడీపీవో పోస్టులకు 2023 జనవరి 3న, ఈవో పోస్టులకు జనవరి 8న సీబీఆర్‌టీ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల తుదికీలు వెల్లడయ్యాయి. ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం బయటపడటంతో ఫలితాలు ప్రకటించలేదు. అయితే కొత్త కమిషన్‌ ఏర్పాటయ్యాక సీడీపీవో పోస్టులకు 23 మందితో ఎంపిక జాబితాను టీజీపీఎస్సీ ప్రకటించింది. తాజాగా ఈ పరీక్ష రద్దవడంతో ఎంపిక జాబితా కూడా రద్దు అయినట్లేనని కమిషన్‌ వర్గాలు వెల్లడించాయి.
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 20-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.