* ఏప్రిల్ 4 నుంచి చివరి విడత పరీక్షలు
* మార్చి 2 వరకు దరఖాస్తుకు అవకాశం
ఈనాడు ప్రతిభ డెస్క్: జేఈఈ మెయిన్ తొలి విడత (సెషన్ 1) పరీక్ష ఫలితాలు ఫిబ్రవరి 12న వెల్లడి కానున్నాయి. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు నిర్వహించిన సెషన్ 1 కీని జాతీయ పరీక్షల సంస్థ (NTA) విడుదల చేసిన విషయం తెలిసిందే. చివరి విడత (సెషన్ 2) ఏప్రిల్ 4 నుంచి 15 మధ్య నిర్వహించనున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది. గతంలో ఒకేసారి రెండు విడతలకు దరఖాస్తు చేసిన వారు మళ్లీ ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదని ఎన్టీఏ తెలిపింది. మార్చి 2వ తేదీ అర్ధరాత్రి వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ చివరి విడత పూర్తయ్యాక.. రెండింటిలో ఉత్తమ స్కోర్ను పరిగణనలోకి (రెండు విడతలు రాస్తే) తీసుకొని ర్యాంకును కేటాయిస్తారు. తొలి విడత పేపర్-1కు దేశవ్యాప్తంగా 11,70,036 మంది విద్యార్థులు (95.8 శాతం) హాజరయ్యారని ఎన్టీఏ వెల్లడించింది. మొత్తం 12,21,615 మంది దరఖాస్తు చేసుకున్నారని పేర్కొంది. ఎన్ఐటీల్లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (బీఆర్క్), బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్ (బీప్లానింగ్) సీట్ల భర్తీకి జనవరి 24న నిర్వహించిన పేపర్-2 పరీక్షకు 74,002 మంది దరఖాస్తు చేసుకోగా.. 55,493 (75 శాతం) మంది హాజరయ్యారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.