* ఏటా మార్చిలోగా అన్ని శాఖల్లో ఖాళీల సేకరణ : సీఎం రేవంత్రెడ్డి వెల్లడి
ఈనాడు, హైదరాబాద్: త్వరలో ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని సీఎం రేవంత్రెడ్డి వెల్లడించారు. ఏటా మార్చిలోగా అన్ని శాఖల నుంచి ఖాళీల వివరాలు సేకరించి జూన్ 2లోగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీచేసి డిసెంబరు 9లోగా నియామకాలు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. శనివారం ప్రజాభవన్లో ‘రాజీవ్గాంధీ సివిల్స్ అభయహస్తం’ అనే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా 2023లో తెలంగాణ నుంచి సివిల్స్కు ఎంపికైన 35 మందిని, ఐఎఫ్ఎస్కు ఎంపికైన ఆరుగురిని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు ఘనంగా సన్మానించి జ్ఞాపికలను అందజేశారు.
ఈ ఏడాది(2024) సివిల్స్ ప్రిలిమ్స్ ఉత్తీర్ణులకు సింగరేణి సంస్థ తరపున రూ.లక్ష చొప్పున సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సీతక్క, సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి, సీఎస్ శాంతికుమారి, సింగరేణి సీఎండీ బలరాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ ‘‘నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించడమే మా ప్రభుత్వ తొలి ప్రాధాన్యం. గత పదేళ్లలో నిరుద్యోగులకు తీరని నష్టం జరిగింది. నిరుద్యోగుల ఇబ్బందులను గుర్తించి గ్రూప్-2 పరీక్ష వాయిదా వేశాం. పకడ్బందీ ప్రణాళికతో పరీక్షలు సమర్థంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సివిల్స్ ప్రిలిమ్స్ ఉత్తీర్ణులకు ఆర్థిక సాయం అందిస్తున్న సింగరేణికి అభినందనలు. సివిల్స్లో తెలంగాణ జెండా ఎగరేసి జాతీయ స్థాయిలో సత్తా చాటాలి. ప్రిలిమ్స్ విజేతలు మెయిన్స్ కోచింగ్ కోసం అవసరమైన స్టడీ మెటీరియల్ కోసం, హాస్టల్ ఖర్చులు, మెరుగైన శిక్షణ కోసం ఉపయోగపడేలా రూ.లక్ష ఆర్థిక సాయాన్ని అందిస్తున్నాం. వీరిని స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ నుంచి మరింతమంది నిరుద్యోగులు సివిల్స్కు ప్రయత్నించాలి’’ అని చెప్పారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Share chat, Google News Subscribe our Youtube Channel.