• facebook
  • whatsapp
  • telegram

Medical Standards: వైద్యవిద్య ప్రమాణాలపై కఠిన వైఖరి

* పరీక్షల వీడియో రికార్డింగ్‌తో అక్రమాలకు అడ్డుకట్ట

ఈనాడు, హైదరాబాద్‌: వైద్యవిద్యలో అత్యున్నత ప్రమాణాలే లక్ష్యంగా విద్యార్థులకు మెరుగైన బోధన, శిక్షణ అందించేందుకు జాతీయ వైద్యమండలి (ఎన్‌ఎంసీ) కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకువచ్చింది. 2024-25 విద్యాసంవత్సరం నుంచే వీటిని అమలు చేయాలని స్పష్టం చేసింది. వైద్య కళాశాలలకు అనుమతుల కొనసాగింపు, సీట్ల పెంపు అంశాలను ఈ నిబంధనలతో ముడిపెట్టింది. శాశ్వత సిబ్బంది, తగిన మౌలిక సదుపాయాలు ఇప్పటికీ కల్పించని కొన్ని కళాశాలలకు ఈ నిబంధనలు తాజాగా అందడంతో వాటిని ఎలా అమలు చేయాలా అని తర్జనభర్జన పడుతున్నాయి. ప్రధానంగా హైదరాబాద్‌కు దూర ప్రాంతాల్లో ఉన్న కళాశాలలపై వీటి ప్రభావం పడుతుందని భావిస్తున్నారు.


ఘోస్ట్‌ ఫ్యాకల్టీకి అడ్టుకట్ట

కొన్ని వైద్య కళాశాలలు బోధన సిబ్బందిని నియమించుకోకుండా ఎన్‌ఎంసీ బృందాలు తనిఖీలకు వచ్చినప్పుడు మాత్రమే తాత్కాలికంగా సిబ్బంది ఉండేలా చూసుకుంటున్నాయి. ఇలాంటి ప్రొఫెసర్ల పేర్లు కళాశాల రికార్డుల్లో మాత్రమే ఉంటాయి. వారు వాస్తవంగా బోధన విధులకు హాజరు కారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ అక్రమాలను నిలువరించేందుకు.. ఎన్‌ఎంసీ 75 శాతం హాజరును తప్పనిసరి చేసింది.

ఎన్‌ఎంసీ బృందాల తనిఖీ ప్రహసనంగా మారడం, ఆరోపణలు వస్తుండడంతో అందులోనూ మార్పులు చేయనుంది. నిర్దేశిత మదింపు విధానాన్ని అనుసరించడం ద్వారా ఈ ప్రక్రియలో అక్రమాలను నివారించనుంది.


పరీక్షల నిర్వహణపై పర్యవేక్షణ

కాపీయింగ్‌ వంటి అవకతవకల నివారణకు పరీక్షల పర్యవేక్షణ విధానంలోనూ మార్పులు చేయనుంది. ఇకపై పరీక్షలు జరిగే సమయంలో సీసీ టీవీ కెమెరాల ద్వారా రికార్డు చేసి.. ఎన్‌ఎంసీకి పంపాల్సి ఉంటుంది. ఫిర్యాదులు, అనుమానాలు వచ్చిన సందర్భంలో ఆ వీడియోలను పరిశీలించి చర్యలు తీసుకోనున్నారు.


ఇవీ నిబంధనలు..

వైద్య కళాశాల పనిరోజుల్లో బోధన సిబ్బంది, రెసిడెంట్‌ డాక్టర్ల హాజరు విధిగా 75 శాతం ఉండాలి. గతంలోలా ఎన్‌ఎంసీ బృందాలు నేరుగా కళాశాలలకు వచ్చి తనిఖీ చేసే విధానం స్థానంలో ఆధార్‌ అనుసంధానిత బయోమెట్రిక్‌ అటెండెన్స్‌ విధానం (ఏఈబీఏఎస్‌) అమలులోకి రానుంది. ముఖ కవళికల ఆధారంగా హాజరు నమోదు వంటి కఠిన నిబంధనలు విధించింది. దీనివల్ల బోధన సిబ్బంది, రెసిడెంట్‌ డాక్టర్ల హాజరు వివరాలు ఆన్‌లైన్‌ ద్వారా ఎన్‌ఎంసీకి నిరంతరం అందుబాటులో ఉంటాయి.

వైద్య కళాశాలలకు అనుబంధంగా ఉన్న బోధనాసుపత్రుల్లో ఏడాదిలో సగటున 80 శాతం పడకల్లో రోగులు ఉండాలి. పీజీ సీట్లున్న కాలేజీలకైతే.. అనుబంధ ఆసుపత్రుల్లోని ఐసీయూ పడకల్లో 15 శాతం నిండాలి.

అనుమతుల కొనసాగింపు, సీట్ల పెంపు సమయంలో ప్రతిసారీ వైద్య కళాశాలలకు వెళ్లి తనిఖీలు చేసే విధానం స్థానంలో ఆన్‌లైన్‌ మదింపు విధానాన్ని ఎన్‌ఎంసీ అమల్లోకి తీసుకువచ్చింది. నిర్దేశించిన ప్రమాణాలు పాటిస్తున్నదీ లేనిదీ తెలిపే సమాచారమంతా ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసుకుంటూ.. కళాశాలలతో ప్రమేయం లేకుండా ఎన్‌ఎంసీనే మదింపు చేసి నిర్ణయం తీసుకోనుంది.

 

మరింత సమాచారం... మీ కోసం!

‣ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ తుది సన్నద్ధత! (ఏపీపీఎస్సీ)

‣ గ్రూప్‌-1 ప్రిపరేషన్‌ ప్లాన్‌ (టీఎస్‌పీఎస్సీ)

‣ ‘ట్రిపుల్‌ ఆర్‌’తో ఒత్తిడిని చిత్తు చేద్దాం!

‣ సివిల్స్‌ సన్నద్ధత!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 01-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.