* ప్రతిభావంతుల కొరత వేధిస్తోంది
* ప్రస్తుత నిపుణుల్లో సగం మందికి శిక్షణ అవసరం
* నాస్కామ్ వైస్ ప్రెసిడెంట్ సంగీతా గుప్తా
![]() |
దిల్లీ: రూ.20.75 లక్షల కోట్ల (250 బిలియన్ డాలర్ల) స్థాయికి చేరిన దేశీయ టెక్నాలజీ రంగం, దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది. సుమారు 54 లక్షల మంది ఈ రంగంలో ఉపాధి పొందుతున్నారు. 3 లక్షల కోట్ల డాలర్లకు పైగా ఉన్న జీడీపీ విలువలో టెక్నాలజీ రంగ వాటా 7.5 శాతంగా ఉంది. సాంకేతిక రంగం మరింతగా వృద్ధి చెందేందుకు, వచ్చే 2-3 ఏళ్లలో అధునాతన సాంకేతిక నైపుణ్యాలు గల ఇంజినీర్లు 10 లక్షల మంది అవసరం ఉందన్నది పరిశ్రమ సంఘం అంచనా. కృత్రిమ మేధ(ఏఐ) వంటి అత్యాధునిక నైపుణ్యాలతో పాటు ఇతర సామర్థ్యాలు కూడా వీరికి కావాల్సి ఉంది. దేశంలో విద్య, శిక్షణ పరంగా గణనీయ స్థాయిలో మార్పులు చేయకపోతే, ఈ గిరాకీని అందుకోలేమని పరిశ్రమ సంఘం నాస్కామ్ పేర్కొంది. ప్రస్తుతం టెక్నాలజీ రంగంలో ఉన్న నిపుణుల్లో సగం మందికి పైగా ఏఐ, బిగ్ డేటా అనలిటిక్స్, సైబర్ భద్రత వంటి వాటిపై శిక్షణ ఇవ్వాల్సి ఉందని నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్ (నాస్కామ్) సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ముఖ్య వ్యూహాధికారి సంగీతా గుప్తా వెల్లడించారు. కొత్తగా కళాశాలల నుంచి వచ్చే పట్టభద్రులతో ఆధునిక టెక్ ఉద్యోగాల్లో 25 శాతం మాత్రమే నింపగలమని తెలిపారు. వేగంగా మారుతున్న డిజిటల్ యుగంలో నైపుణ్య శిక్షణ అనేది ఒక్కరోజులో జరిగేది కాదని, ఇది నిరంతర ప్రక్రియ అని ఆమె అభిప్రాయపడ్డారు.
ఐటీ కంపెనీలకు నిపుణుల లేమి
ఐటీ సేవలు అందిస్తున్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) వంటి సంస్థలు నిపుణుల లేమితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్స్ కార్ప్ (ఐబీఎం), యాక్సెంచర్ వంటి అంతర్జాతీయ సంస్థలతో పోటీ పడేందుకు భారతీయ ఐటీ కంపెనీలకు ఇది ఒక ప్రతికూలతగా మారుతోంది. సరైన నైపుణ్యాలు లేకపోవడంతో 80,000 ఉద్యోగాల నియామక ప్రక్రియ చేపట్టలేదని గత నెలలో టీసీఎస్ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏఐలో శిక్షణ పొందే తన ఉద్యోగుల సంఖ్యను రెట్టింపు చేసింది. మరోవైపు దిగ్గజ ఇంజినీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ సంస్థ లార్సన్ అండ్ టూబ్రో (ఎల్ అండ్ టీ) లిమిటెడ్ కూడా తన ఐటీ, ఐటీ ఆధారిత సేవల యూనిట్లో 20,000 మంది ఇంజినీర్ల అవసరం ఉందని గత నెలలో ప్రకటించింది.
విద్యా వ్యవస్థ సరిగా లేకనే..
దేశంలో విద్యా వ్యవస్థ పాఠశాల స్థాయి నుంచీ సరిగా లేదని, ఉద్యోగ విపణికి అవసరమైన నైపుణ్యాలను కళాశాలల్లో సైతం అందించడం లేదని నాస్కామ్ వైస్ ప్రెసిడెంట్ సంగీతా గుప్తా అభిప్రాయపడ్డారు. డిజిటల్ ప్రతిభావంతుల గిరాకీ-సరఫరా అంతరం ప్రస్తుతం 25 శాతం ఉండగా, 2028 నాటికి ఇది 29 శాతానికి చేరుకునే అవకాశం ఉందని తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కూడా దేశంలో విద్యా విధానంపై ఇటీవల ఆందోళన వెలిబుచ్చిన సంగతి తెలిసిందే. పాఠశాల విద్య కూడా లేని వారి కంటే ఎక్కువ చదువులు చదివిన యువతరానికి ఉపాధి తక్కువగా ఉండే అవకాశం ఉందని అంతర్జాతీయ కార్మిక సంస్థ(ఐఎల్ఓ) నివేదిక కూడా హెచ్చరించింది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Share chat, Google News Subscribe our Youtube Channel.