* పైలెట్ ప్రాజెక్టుతో 100% అక్షరాస్యత గ్రామంగా మారిన చందారం
![]() |
ఒక ఆలోచన ఏకకాలంలో రెండు ప్రయోజనాలను చేకూర్చింది. యువతులకు ఉపాధి చూపింది. ఊరిని పూర్తి అక్షరాస్యత గ్రామంగా తీర్చిదిద్దింది. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం చందారంలో వయోజన విద్యాశాఖ చేసిన ప్రయత్నం విజయవంతమైంది. దేశ వయోజనులందరినీ అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు కేంద్రం... త్వరలో న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం(ఎన్ఐఎల్పీ) తీసుకురానుంది. చందారం దానికి పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికైంది. గ్రామంలో 1,965 మంది ఉండగా... ఇంటింటి సర్వే ద్వారా 65 మందిని నిరక్షరాస్యులుగా గుర్తించారు. సాక్షర భారత్ పథకం రద్దయిన కారణంగా గౌరవ వేతనంతో వాలంటీర్ల నియామకానికి అవకాశం లేకపోయింది. అయితే, గ్రామంలో స్వచ్ఛంద సంస్థల సహకారంతో 35 మంది యువతులకు 100 రోజుల ఉచిత కుట్టు శిక్షణ శిబిరాన్ని ఏర్పాటుచేశారు. దాంతో వయోజన విద్యాధికారులు వీరిలో 13 మంది విద్యావంతులను గుర్తించారు. వారి ఇళ్ల పరిసరాల్లో నివసించే ఐదుగురేసి నిరక్షరాస్యులకు చదువు చెప్పేలా ఒప్పించారు. ఓనమాలు దిద్దించి రాయడం, చదవడంతోపాటు చిన్నచిన్న లెక్కలు సైతం నేర్పించారు. ఒకవైపు శిక్షణ పొందుతూనే వంద తరగతుల్లో చదువు నేర్పించారని జిల్లా వయోజన విద్యాధికారి ఎ.పురుషోత్తం నాయక్ తెలిపారు. యువతులకు ప్రోత్సాహకంగా డీఆర్డీఏ ద్వారా విద్యార్థులకు ఏకరూప దుస్తులు కుట్టేందుకు అవకాశం కల్పించామన్నారు. కార్యక్రమం 2023 ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు కొనసాగిందని వివరించారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Share chat, Google News Subscribe our Youtube Channel.