* వైఎస్సార్ పేరు తొలగింపు బిల్లుకు సభ ఆమోదం
![]() |
ఈనాడు, అమరావతి: విజయవాడలోని వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును తిరిగి ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా మార్చుతూ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లును సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘దేశంలోనే మొదటిసారి ఏపీలో ఆరోగ్య విశ్వవిద్యాలయం తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్. దానికి ఆయన పేరు తొలగించి రాజశేఖరరెడ్డి పేరు పెట్టడంలో ఔచిత్యం ఏంటో? వర్సిటీ పేరు మార్పు తరువాత ఇక్కడ కోర్సులు పూర్తిచేసిన వారు ఇతర దేశాల్లోని ఉన్నత విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు పొందేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారికిచ్చినవి అసలైన సర్టిఫికెట్లా..? నకిలీవా? అనే అనుమానాలు, గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పుడు తిరిగి పాత పేరు పెట్టడం వల్ల వాటికి పరిష్కారం లభించనుంది. గత ప్రభుత్వం వర్సిటీ పేరు మార్చే సమయంలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులుగా చెప్పుకొనేవారు వైకాపాలో ఉంటూ ఎందుకు అభ్యంతరం చెప్పలేదో..? వారి పేర్లు సభలో చెప్పదలుచుకోలేదు. ఎంతో చరిత్ర కలిగిన కడప జిల్లా పేరునూ జగన్ మార్చారు. పేర్లు మార్చడం, ఫొటోలు వేయించుకోవడం ఆయనకు పిచ్చిగా మారింది’ అని మంత్రి సత్యకుమార్ మండిపడ్డారు.