* అవసరమైతే శాసనసభలో చట్టం చేస్తాం: సీఎం
హైదరాబాద్: రాజ్యాంగపరంగా ఉండాల్సిన ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు అమలుచేయకుండా ఇష్టారాజ్యంగా ప్రైవేటు విశ్వవిద్యాలయాలు నడిపించుకోవడం సరైంది కాదని సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రైవేటు విశ్వవిద్యాలయాలు అనుసరించాల్సిన మార్గదర్శకాలపై సమగ్ర నిబంధనలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. పాటించని వాటిపై చర్యలు తీసుకోవాలన్నారు. ‘ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించాలనేది రాజ్యాంగంపరంగా ఉన్న హక్కు. రాష్ట్రంలోని ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లోనూ వాటిని అమలుచేయాల్సిందే. అవసరమైతే శాసనసభలో చట్టం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న ప్రైవేటు వర్సిటీలకు ఇచ్చిన అనుమతులు, మార్గదర్శకాలు, ప్రభుత్వం నుంచి పొందుతున్న సౌకర్యాలు, విద్యార్థుల సంఖ్య, వసూలు చేసిన ఫీజులు, బోధన రుసుములు, బోధన, బోధనేతర సిబ్బంది, వారి విద్యార్హతలు వంటి వాటన్నింటిపైనా నివేదిక ఇవ్వాలి. వాటిలో ఉన్న మౌలిక వసతులు, అవసరమైన మేరకు ప్రమాణాలు ఉన్నాయో లేదో కూడా పరిశీలించి నివేదికలో పొందుపరచాలి’ అని సీఎం అధికారులను ఆదేశించారు. ఇళ్ల ప్లాట్ల కింద రిజిస్ట్రేషన్ అయిన భూములుగా ధరణిలో చూపించినప్పటికీ, వాటిలో కొన్ని ప్రైవేటు వర్సిటీలు నెలకొల్పేందుకు అనుమతి ఇచ్చారని, వాటిపైనా సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశాలిచ్చారు. అనుమతులు రాకుండానే అడ్మిషన్లు నిర్వహించిన ఓ వర్సిటీ నిర్వాకంతో గత విద్యాసంవత్సరంలో చాలామంది విద్యార్థులు ఇబ్బందులు పడిన విషయాన్ని గుర్తుచేశారు. ఇకపై ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.