* విద్యాశాఖ నిర్ణయం
ఈనాడు, హైదరాబాద్: ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నతతోపాటు ఉన్నత పాఠశాలలూ ఇక నుంచి ఉదయం 9 గంటలకే ప్రారంభమవుతాయి. అంటే అన్ని రకాల బడులకు ఒకే సమయం అమలుకానుంది. గత విద్యా సంవత్సరం(2023-24)లో తొలుత ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు ఉదయం 9 గంటలకు, హైస్కూళ్లు 9.30కు తెరుచుకునేవి. గతేడాది ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ప్రారంభ సమయాన్ని హైస్కూళ్లతో సమానంగా ప్రభుత్వం ఉదయం 9.30కు మార్చింది. ఈ ఏడాది మళ్లీ పాత విధానాన్నే అంటే ప్రాథమిక, ప్రాథమికోన్నత బడులు ఉదయం 9కి, ఉన్నత పాఠశాలలు 9.30కు ప్రారంభంకావాలని మే 22న ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం ప్రైవేట్ బడులు ఉదయం 8కే మొదలవుతున్న నేపథ్యంలో అన్ని రకాల ప్రభుత్వ పాఠశాలలూ ఉదయం 9కే పనిచేస్తే బాగుంటుందని తాజాగా పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదన పంపగా విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం ఈ నెల 12న ఆమోదం తెలిపారు. ఫలితంగా పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు ఈవీ నర్సింహారెడ్డి తాజాగా ఆదేశాలిచ్చారు. అయితే హైదరాబాద్, సికింద్రాబాద్లలో మాత్రం ట్రాఫిక్ దృష్ట్యా గతంలో మాదిరిగానే ఉదయం 8.45 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనిచేస్తాయని ఆయన పేర్కొన్నారు. అయితే ఉన్నత పాఠశాలలకు విద్యార్థులు 5 కి.మీ. దూరం నుంచి రావాల్సి ఉన్నందున ఉదయం 9కి హాజరుకావడం కష్టమవుతుందని టీఆర్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కటకం రమేష్, ప్రధాన కార్యదర్శి అంజిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అధికార వర్గాలు మాత్రం ఉదయం 9.30కు తెరిస్తే సాయంత్రం 4.45 వరకు విద్యార్థులు బడిలో ఉండాలని, దానివల్ల ఇళ్లకు వెళ్లేసరికి ఆలస్యమవుతుందని చెబుతున్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Share chat, Google News Subscribe our Youtube Channel.