* కేంద్ర పథకం నుంచి రూ.225 కోట్ల మంజూరు
* పాలమూరు విశ్వవిద్యాలయానికే రూ.100 కోట్లు
* రెండు జిల్లాల్లో అమ్మాయిల హాస్టళ్లకు రూ.20 కోట్లు
![]() |
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని మూడు విశ్వ విద్యాలయాలకు, 13 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు మహర్దశ పట్టనుంది. ప్రధానమంత్రి ఉచ్ఛతర్ శిక్షా అభియాన్(పీఎం-ఉష) కింద రాష్ట్రంలోని విద్యా సంస్థలకు మౌలిక వసతుల కల్పన కోసం రూ.225 కోట్ల మంజూరుకు అనుమతి లభించింది. కేంద్ర విద్యాశాఖ ఆమోదం తెలపడంతో త్వరలోనే నిధులు అందనున్నాయి. ఈ పథకం కింద వ్యయం చేయనున్న నిధుల్లో కేంద్ర, రాష్ట్రాల వాటా 60:40 నిష్పత్తిలో ఉంటుంది. గతంలో అమలైన రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షా అభియాన్(రూసా) పేరునే కేంద్ర ప్రభుత్వం పీఎం-ఉషగా మార్చింది. జాతీయ నూతన విద్యా విధానం లక్ష్యానికి అనుగుణంగా... విశ్వవిద్యాలయాల బలోపేతానికి, పరిశోధనలకు, అమ్మాయిల చదువులకు పెద్దపీట వేసేలా ఈ పథకం కింద నిధులను ఇవ్వనుంది. ఆయా విద్యాసంస్థలు అక్రిడిటేషన్ను పొందేలా చేయడం, నాణ్యమైన విద్యను అందించేలా తీర్చిదిద్దడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం. ఈమేరకు దేశవ్యాప్తంగా పీఎం-ఉష కింద మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ యూనివర్సిటీస్(మెరు) విభాగంలో 35 వర్సిటీలను, విశ్వవిద్యాలయాల బలోపేతం విభాగంలో మరో 73 వర్సిటీలను కేంద్రం ఎంపిక చేసింది. అదేవిధంగా 401 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, 40 మోడల్ డిగ్రీ కళాశాలలు, 50 అమ్మాయిల హాస్టళ్లు నిర్మించాలని నిర్ణయించింది. ఆయా రాష్ట్రాల నుంచి ప్రతిపాదనలను స్వీకరించింది. వాటిలో తెలంగాణ నుంచి మూడు వర్సిటీలు, 13 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఎంపికయ్యాయి. ఈ పథకం కింద వచ్చే నిధులను 2026 మార్చి నాటికి ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంటే గట్టిగా రెండేళ్లు కూడా లేదు.
‘పాలమూరు’కు నిధుల పరవళ్లు
‘మెరు’ విభాగంలో ఎంపికైన పాలమూరు విశ్వవిద్యాలయానికి రెండేళ్లలో రూ.100 కోట్లు రానున్నాయి. ఇందులో కేంద్రం రూ.60 కోట్లు, రాష్ట్రం రూ.40 కోట్లు భరిస్తాయి. ప్రాజెక్టు ఆమోద మండలి(పీఏబీ) కూడా అనుమతి ఇచ్చినందున వెంటనే పనులను మొదలుపెట్టొచ్చు. ఈ నిధుల్లో పరిశోధనకు రూ.13 కోట్లు, మరమ్మతులకు రూ.5 కోట్లు, సాఫ్ట్వేర్కు రూ.3 కోట్లు ఖర్చు చేయాలి. మిగిలిన నిధులను... న్యాయ, ఇంజినీరింగ్ కళాశాలలకు, ఆసుపత్రికి, పరిశోధన విభాగానికి భవనాల నిర్మాణానికి, ఇండోర్ స్టేడియం, అమ్మాయిల ఈత కొలను కోసం ఖర్చు చేస్తారు. ఈ సందర్భంగా వర్సిటీ రిజిస్ట్రార్ మధుసూదన్రెడ్డి మాట్లాడుతూ... ఏఐసీటీఈ, రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో 2025-26 విద్యా సంవత్సరం నుంచి బీటెక్ కోర్సులను ప్రవేశపెడతామని తెలిపారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Share chat, Google News Subscribe our Youtube Channel.