ఈనాడు, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల నుంచి సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూలకు 75 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. సెప్టెంబరు 16 నుంచి 25వ తేదీ వరకు మెయిన్స్ పరీక్షలు జరిగాయి. వాటి ఫలితాలను యూపీఎస్సీ డిసెంబరు 6న వెల్లడించింది. మొత్తం 2,529 మంది ముఖాముఖికి ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా జూన్ 5న జరిగిన ప్రాథమిక పరీక్షకు దాదాపు 5 లక్షల మంది హాజరుకాగా వారిలో 13,090 మంది ప్రధాన పరీక్ష(మెయిన్స్) రాయడానికి అర్హత సాధించారు. హైదరాబాద్లో 473 మంది పరీక్షలు రాయగా ఆంధ్రప్రదేశ్లో రాసిన వారితో కలుపుకొంటే మొత్తం 650 మంది వరకు పరీక్షలకు హాజరయ్యారు. దేశవ్యాప్తంగా ఈ ఏడాది 1,011 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇంటర్వ్యూ కాలపట్టికను త్వరలో విడుదల చేస్తామని కమిషన్ పేర్కొంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థుల సంఖ్య 75కు పైగానే ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఏపీ, తెలంగాణతోపాటు చాలా మంది దిల్లీలో కోచింగ్ తీసుకొని అక్కడే పరీక్ష రాస్తున్నారని బ్రెయిన్ ట్రీ డైరెక్టర్ గోపాలకృష్ణ తెలిపారు. సాధారణంగా మెయిన్స్ ఫలితాలతో పాటు ముఖాముఖి కాలపట్టికను విడుదల చేస్తారని, ఈసారి మాత్రం త్వరలో వెల్లడిస్తామని కమిషన్ ప్రకటించిందని ఆయన పేర్కొన్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.