* ఏప్రిల్లో ఫలితాల విడుదలకు అవకాశం
ప్రతిభ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లా కోర్టుల్లో 3,432 ఉద్యోగాల భర్తీకి హైకోర్టు చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. నియామకాల్లో భాగంగా డిసెంబర్ 22 నుంచి జనవరి 2 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించింది. జనవరి 4న కీని విడుదల చేసింది. జిల్లా న్యాయస్థానాల్లో కార్యాలయ సిబ్బంది నియామకాలకు సంబంధించి అదనంగా మరిన్ని పోస్టులను మంజూరు చేస్తూ అధికారిక ప్రకటనను విడుదల చేసింది. 118 పోస్టులు అదనంగా భర్తీకానున్నాయి. అలాగే 4 ఖాళీలను తగ్గించారు. దీంతో మొత్తం 3,546 ఉద్యోగాలు భర్తీ కానున్నాయి.
త్వరలో ఫలితాలు
ఏపీలోని జిల్లా న్యాయస్థానాల్లో కార్యాలయ సిబ్బంది నియామకాలకు సంబంధించి రాత పరీక్ష ఫలితాలు త్వరలో వెల్లడి కానున్నాయి. ప్రశ్నపత్రాల మూల్యాంకనం పూర్తయి ఏప్రిల్లో ఫలితాలు విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే హైకోర్టు నియామకాలకు సంబంధించి 241 పోస్టుల రాత పరీక్ష ఫలితాలు వెల్లడైన విషయం తెలిసిందే. జిల్లా కోర్టు ఉద్యోగాలకు నిర్వహించిన రాత పరీక్ష ఫలితాల కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. ఈ ఉద్యోగ ప్రకటన ద్వారా ఆఫీస్ సబార్డినేట్, జూనియర్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, ఫీల్డ్ అసిస్టెంట్, అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్, స్టెనోగ్రాఫర్ తదితర ఖాళీలు భర్తీ కానున్నాయి.
‘నియామకాల’పై సీజేకు సందేశాలు పంపొద్దు
గతేడాది అక్టోబరు 21న జారీచేసిన ఉద్యోగ ప్రకటనల ప్రకారం ఏపీలోని జిల్లా కోర్టుల్లో పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని రిజిస్ట్రార్(నియామకాలు) ఎస్.కమలాకరరెడ్డి తెలిపారు. కొత్త కోర్టుల ఏర్పాటు నేపథ్యంలో భర్తీ చేసే పోస్టుల సంఖ్య పెరిగిందని మార్చి 27న ఓ ప్రకటనలో వెల్లడించారు. ఫలితాల వెల్లడి వ్యవహారమై కొంతమంది అభ్యర్థులు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రకు నేరుగా సందేశాలు, ఈ-మెయిళ్లు పంపుతున్నారని పేర్కొన్నారు. ఇలాంటి చర్య అభ్యంతరకరమని అన్నారు. సందేశాలు పంపిన అభ్యర్థులను అనర్హులుగా ప్రకటిస్తామని తెలిపారు.