మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడి
ఈనాడు, అమరావతి: ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో పదో తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను సన్మానించనున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. సమగ్ర శిక్షా అభియాన్ కార్యాలయంలో మే 17న ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. ‘అత్యధిక మార్కులతో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లను నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయిలో సన్మానిస్తాం. 23న నియోజకవర్గ స్థాయిలో పతకం, సర్టిఫికెట్, జ్ఞాపిక, శాలువా ఇస్తాం. 27న జిల్లా స్థాయిలో నిర్వహించే కార్యక్రమంలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారికి రూ.50 వేలు, రూ.30 వేలు, రూ.10 వేల నగదు బహుమతి, పతకం, సర్టిఫికెట్, జ్ఞాపిక అందిస్తాం. రాష్ట్రస్థాయిలో 31న నిర్వహించే కార్యక్రమంలో ప్రథమ స్థానానికి రూ.లక్ష, ద్వితీయ స్థానానికి రూ.75 వేలు, మూడో స్థానంలో నిలిచిన విద్యార్థికి రూ.50 వేల నగదుతోపాటు పతకం, సర్టిఫికెట్, జ్ఞాపిక అందిస్తాం. పాఠశాలలు యాజమాన్యాల వారీగా, జూనియర్ కళాశాలలు గ్రూపుల వారీగా మొదటి మూడు స్థానాలను ఎంపిక చేస్తారు. జిల్లాపరిషత్తు, ప్రభుత్వ, పురపాలక బడులను ఒక యాజమాన్యంగానే పరిగణిస్తారు. అన్ని స్థాయిల్లో కలిపి 3,075 మంది విద్యార్థులను సన్మానించనున్నాం’’ అని వెల్లడించారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.