* జూన్ 11న పరీక్ష
* 3 లేదా 4వ తేదీన హాల్టికెట్ల జారీ!
ఈనాడు, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కారణంగా రాష్ట్రంలో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను తిరిగి నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఏర్పాట్లు పూర్తిచేసింది. అత్యధికంగా 503 గ్రూప్-1 ఉద్యోగాల కోసం షెడ్యూల్ ప్రకారం జూన్ 11న ఈ పరీక్ష నిర్వహించనుంది. అభ్యర్థులకు పూర్తిస్థాయి తనిఖీలు నిర్వహించి, బయోమెట్రిక్ ధ్రువీకరణ తరువాతే అనుమతించేలా ఏర్పాట్లు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే అభ్యర్థులపై కఠిన చర్యలు తీసుకునేలా చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో నియామక నిబంధనల ప్రకారం పరీక్ష తేదీకి వారం రోజులు ముందుగా పరీక్ష కేంద్రాలను పేర్కొంటూ హాల్టికెట్లు జారీ చేసేందుకు కమిషన్ ‘ర్యాండమైజేషన్’ ప్రక్రియ నిర్వహిస్తోంది. ఇది మరో రెండు రోజుల్లో ముగియనుంది. గ్రూప్-1 హాల్టికెట్లు జూన్ 3 లేదా 4వ తేదీన (శనివారం లేదా ఆదివారం) అందుబాటులోకి రానున్నాయి. ప్రిలిమినరీ పరీక్షను ఓఎంఆర్ (ఆప్టికల్ మార్క్ రికగ్నైజేషన్) పద్ధతిలో కమిషన్ నిర్వహించనుంది.
నిబంధనలను ఉల్లంఘిస్తే డిబార్..
సర్వీస్ కమిషన్ పరీక్షల్లో ఇక నుంచి ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కమిషన్ నిబంధనల ప్రకారం భవిష్యత్తులో ఎలాంటి పరీక్షలు రాయకుండా డిబార్ చేయాలని నిర్ణయించింది. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసుతో ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలున్న 37 మందిని కమిషన్ ఇప్పటికే డిబార్ చేసిన సంగతి తెలిసిందే. పరీక్ష కేంద్రాల్లో అల్లరి చేసినా, ఎలక్ట్రానిక్ పరికరాలతో పట్టుబడినా పోలీసు కేసులతో పాటు చర్యలు తప్పవు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.