* ఫీజు చెల్లించకపోయినా పరీక్ష రాయొచ్చు
ఈనాడు, అమరావతి: పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులందరికీ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాసేందుకు హాల్టికెట్లు ఇచ్చామని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు దేవానందరెడ్డి తెలిపారు. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీకి పరీక్ష ఫీజు చెల్లించకపోయినా విద్యార్థులు పరీక్షలు రాసుకునేందుకు అవకాశం కల్పించామని చెప్పారు. వారందరూ హాల్టికెట్లు తీసుకుని, పరీక్షలకు హాజరు కావొచ్చని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.61 లక్షల మంది ఫెయిల్ కాగా.. పరీక్ష ఫీజు 1.15 లక్షల మందే కట్టారని పేర్కొన్నారు. పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన రీకౌంటింగ్, రీవెరిఫికేషన్కు ఫలితాలను ఆన్లైన్లో అందుబాటులో ఉంచామని, మొత్తం 55,966 జవాబు పత్రాల పరిశీలనకు దరఖాస్తులు రాగా.. 43,714 పత్రాల ఫలితాలు విడుదల చేశామని వెల్లడించారు. పెండింగ్లో ఉన్న వాటిని నెలాఖరులోపు ఇస్తామని తెలిపారు.