• facebook
  • whatsapp
  • telegram

Group-1 : కఠిన నిబంధనలు... ఉల్లంఘిస్తే అంతే సంగతులు

* గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌లో పొరపాట్లకు తావులేకుండా చర్యలు
 


 

ఈనాడు, హైదరాబాద్‌: గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ నిర్వహణకు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) పకడ్బందీ నిబంధనలు రూపొందించింది. గతంలో ఎదురైన సంఘటనలు, న్యాయ వివాదాలకు కారణమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని... ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా కఠిన చర్యలు తీసుకుంటోంది. జూన్‌ 9న ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష నిర్వహించనున్న విషయం తెలిసిందే. పరీక్ష ప్రారంభానికి అరగంట ముందే గేట్లు మూసి వేస్తామని, అభ్యర్థులు చెప్పులు మాత్రమే ధరించాలని, నగలు, ఆభరణాలు తీసుకురావద్దంది. పరీక్ష గదిలో ఒకరి నుంచి ఒకరు వస్తువులు తీసుకోవడాన్నీ అనుమతించబోమంది. నిబంధనలను పాటించకున్నా, నిషేధించిన వస్తువులను తీసుకెళ్లినా, మాల్‌ ప్రాక్టీస్‌కు పాల్పడినా పోలీసు కేసు నమోదు చేసి, చట్టప్రకారం చర్యలు తీసుకుంటామంది. పరీక్షలు రాసేందుకు అనర్హులుగా ప్రకటిస్తామని స్పష్టంచేసింది. ఇవీ మరిన్ని నిబంధనలు... 

  హాల్‌టికెట్‌ను ఏ4 సైజులో ప్రింట్‌ తీసుకోవాలి. కలర్‌ప్రింట్‌ అయితే బాగుంటుంది. దానిపై కేటాయించిన స్థలంలో తాజా పాస్‌పోర్టు ఫొటోను అతికించాలి. ఫొటో పెట్టకుంటే అనుమతించరు. 

‣ డౌన్‌లోడ్‌ చేసుకున్న హాల్‌టికెట్‌పై ఫొటో సరిగా ముద్రించి లేకుంటే, అభ్యర్థి గెజిటెడ్‌ అధికారి లేదా చివరగా చదువుకున్న విద్యాసంస్థ ప్రిన్సిపల్‌ అటెస్ట్‌ చేసిన మూడు పాస్‌పోర్టు సైజు ఫొటోలతోపాటు కమిషన్‌ వెబ్‌సైట్లో పొందుపరిచిన ధ్రువీకరణ పత్రాన్ని పూర్తిచేసి ఇన్విజిలేటర్‌కు ఇవ్వాలి. లేదంటే అభ్యర్థిని పరీక్ష రాయనీయరు. 

‣ హాల్‌టికెట్, ప్రశ్నపత్రాన్ని నియామక ప్రక్రియ ముగిసే వరకు జాగ్రత్త పరచాలి. 

ఇన్విజిలేటర్‌దే తుది నిర్ణయం 

వ్యక్తిగత వివరాలను, గుర్తింపు కార్డులోని వివరాలతో పూర్తిగా పరిశీలించిన తర్వాతే పరీక్ష కేంద్రం, పరీక్ష గదిలోకి అభ్యర్థిని అనుమతిస్తారు. పరీక్ష గదిలో అభ్యర్థి గుర్తింపు విషయంలో ఇన్విజిలేటరే తుది నిర్ణయం తీసుకుంటారు. పరీక్ష ప్రారంభానికి ముందు ఇన్విజిలేటర్‌ సమక్షంలో అభ్యర్థి హాల్‌టికెట్‌పై సంతకం చేయాలి. తర్వాత ఇన్విజిలేటర్‌ కూడా సంతకం చేస్తారు. హాల్‌టికెట్‌పై ఉన్న ఫొటో, అభ్యర్థి అంటించిన ఫొటో, సంతకం, నామినల్‌ రోల్‌ ఫొటో, ఒరిజినల్‌ ఫొటో గుర్తింపు కార్డుపై ఫొటో, సంతకాలు సరిపోలాలి. ఈ విషయంలో ఇన్విజిలేటర్‌ సంతృప్తి చెందకుంటే అభ్యర్థిని పరీక్ష రాసేందుకు అనుమతించబోరు. ఏదైనా తప్పు జరిగినట్లు తేలితే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తారు.

Updated Date : 25-05-2024 13:13:01

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం