‣ జూన్ 3 వరకు ఆన్లైన్ వెబ్ ఆధారిత కేంద్రాల్లో కౌన్సెలింగ్
కరెన్సీనగర్, న్యూస్టుడే: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో సీట్ల భర్తీకి మే 27 నుంచి జూన్ 3వ తేదీ వరకు విజయవాడలోని మూడు ఆన్లైన్ వెబ్ ఆధారిత కేంద్రాల్లో కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే సాంకేతిక విద్యా శాఖ పాలీసెట్ ర్యాంకులు విడుదల చేసింది. కౌన్సెలింగ్కు వచ్చే అభ్యర్థులు ఫీజు చెల్లించిన రశీదు, హాల్ టిక్కెట్, ర్యాంకు కార్డు, పదో తరగతి ఉత్తీర్ణత ధ్రువపత్రం, 4-10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్, అర్హులు ఈడబ్ల్యూఎస్, ఆదాయ, బదిలీ, ప్రత్యేక కేటగిరీ ధ్రువపత్రాలు తీసుకురావాల్సి ఉంటుంది. ఎన్సీసీ, ఆర్మీ, క్రీడా, పోలీస్, దివ్యాంగుల కేటగిరీ అభ్యర్థులకు మే 31వ తేదీ నుంచి జూన్ మూడో తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. కౌన్సెలింగ్కు ఆయా ప్రత్యేక కేటగిరీ డైరెక్టరేట్లు హాజరవుతారని కన్వీనర్ ఎం.విజయసారథి తెలిపారు. కౌన్సెలింగ్లో సర్టిఫికెట్లు పరిశీలన చేయించుకున్న వారంతా ఆయా తేదీల్లో కళాశాలలు, కోర్సుల ఆప్షన్లు పెట్టుకోవాల్సి ఉంటుంది.
ర్యాంకులు.. కళాశాలలు..
ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మెరిట్ ఆర్డరు 1 నుంచి 4000 ర్యాంకుల వారు, ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 4001 నుంచి 8000, ఆంధ్రా లయోల కళాశాల కేంద్రంలో 8001 నుంచి 12,000 ర్యాంకుల వారు వచ్చి తమ సర్టిఫికెట్లను పరిశీలన చేయించుకోవాలి.