• facebook
  • whatsapp
  • telegram

Engineering counselling: కన్వీనర్‌ కోటా బీటెక్‌ సీట్లు 70,307

* నేటి నుంచి వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ
* గత ఏడాది తొలి విడత కంటే 6 వేలకు పైగా తక్కువ

 


ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో తొలి విడత ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌లో ఈసారి బీటెక్‌ సీట్లు తగ్గాయి. వెబ్‌ ఆప్షన్లు జులై 8 నుంచి ప్రారంభం కానుండగా కన్వీనర్‌ కోటా సీట్లు 70,307 మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి. ఈసారి ప్రభుత్వ, ప్రైవేట్‌ కళాశాలలు 173 ఉండగా... వాటిల్లో మొత్తం సీట్లు 98,296. ప్రైవేట్‌ కళాశాలల్లోని సీట్లలో 70 శాతాన్ని కన్వీనర్‌ కోటా కింద కౌన్సెలింగ్‌ ద్వారా భర్తీ చేస్తారు. ఆ ప్రకారం ఈసారి 70,307 సీట్లకు విద్యార్థులు ఐచ్ఛికాలు ఇచ్చుకోవచ్చు. గత సంవత్సరం (2023-24) తొలి విడత కౌన్సెలింగ్‌లో 173 కళాశాలల్లో 1,07,039 సీట్లు ఉండగా...కన్వీనర్‌ కోటా కింద 76,359 సీట్లు అందుబాటులో ఉన్నాయి. చివరి విడత పూర్తయిన తర్వాత ప్రత్యేక విడత నాటికి సీట్లు పెరిగాయి. ఆ ప్రకారం మొత్తం సీట్లు 1,16,720 అవగా...అందులో కన్వీనర్‌ సీట్లు 85,671. అంటే నిరుడు కంటే ఈసారి సీట్లు తగ్గాయని స్పష్టమవుతోంది. కాకపోతే రెండు, మూడు విడతల కౌన్సెలింగ్‌ నాటికి మళ్లీ సీట్లు చాలా వరకు పెరిగే అవకాశం ఉంది.

ఎందుకు తగ్గాయంటే?

ఈసారి డిమాండ్‌ లేని కోర్సులను మూసివేసుకొని వాటి స్థానంలో సీఎస్‌ఈ, సంబంధిత బ్రాంచీల్లో సీట్లను పెంచుకునేందుకు ఆయా కళాశాలలు ఏఐసీటీఈ నుంచి అనుమతి పొందాయి. ఆ ప్రకారం దాదాపు 8 వేల వరకు ఉండొచ్చని సమాచారం. పలు కళాశాలలు సీఎస్‌ఈ ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐవోటీ), సైబర్‌ సెక్యూరిటీ లాంటి వాటిని కూడా మూసివేసి సీఎస్‌ఈకి దరఖాస్తు చేసుకొని (కన్వర్షన్‌) అనుమతి తెచ్చుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇంకా వాటికి అనుమతి ఇవ్వలేదు. విద్యాశాఖ ప్రస్తుతం సీఎం రేవంత్‌రెడ్డి వద్దే ఉన్నందున ఆయన అనుమతి ఇస్తే తప్ప వాటిని కౌన్సెలింగ్‌లో చేర్చరు. రెండో విడత నాటికైనా అనుమతి రావొచ్చని భావిస్తున్నారు. మరో వైపు ఏఐసీటీఈ నిబంధనల మేరకు ఆయా కళాశాలలు పెద్ద సంఖ్యలో అదనపు సీట్లకు అనుమతి పొందాయి. అవి దాదాపు 20,500 వరకు ఉన్నట్లు తెలుస్తోంది. వాటికి సర్కారు అనుమతి ఇస్తుందా? లేదా? అన్నది వేచిచూడాలి.

* కౌన్సెలింగ్‌ కేంద్రాన్ని పరిశీలించిన కమిషనర్‌

రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ శ్రీదేవసేన సికింద్రాబాద్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలోని ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ కేంద్రాన్ని పరిశీలించారు. ఇటీవలే నూతన కమిషనర్‌గా బాధ్యతలు తీసుకున్న ఆమె జులై 7న సైతం దాదాపు రెండు గంటలపాటు ఉండి కౌన్సెలింగ్‌ ప్రక్రియను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వారికి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ఆరా తీశారు. ఆమె వెంట క్యాంపు అధికారి బి.శ్రీనివాస్‌ తదితరులు ఉన్నారు.




 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 08-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.