• facebook
  • whatsapp
  • telegram

NEET: నీట్‌ పేపర్‌ లీక్‌ వాస్తవమే: సుప్రీంకోర్టు

* జాగ్రత్తగా పరిశీలించిన అనంతరం తీర్పు

దిల్లీ: దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన నీట్‌ యూజీ 2024  పరీక్ష అక్రమాల వ్యవహారంపై సుప్రీంకోర్టు సోమవారం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ పరీక్షలో పేపర్‌ లీకైన  మాట వాస్తవమేనని కోర్టు స్పష్టం చేసింది. అయితే, ఇది 23లక్షల మందితో జీవితాలతో ముడిపడిన అంశం అయినందున.. ‘నీట్ రీటెస్ట్‌’ను తాము చివరి అవకాశంగా పరిగణిస్తామని వెల్లడించింది. 

* నీట్‌ యూజీ ప్రశ్నపత్రం లీకైందని, అవకతవకలు, అక్రమాలు జరిగాయని, పరీక్షను రద్దు చేయాలని సుప్రీం కోర్టు  లో మొత్తం 38 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ‘‘నీట్‌  ప్రశ్నపత్రం లీకైంది అన్న విషయం స్పష్టమైంది. పరీక్ష పవిత్రతను దెబ్బతీశారని రుజువైనా లేదా నేరం చేసిన వారిని గుర్తించలేకపోయినా మేం నీట్‌ రీ-టెస్ట్‌కు ఆదేశిస్తాం. లీకైన ప్రశ్నపత్రం సోషల్‌మీడియాలో వ్యాప్తి చేశారని తెలిసినా మళ్లీ పరీక్ష నిర్వహించాలని చెబుతాం. కానీ, రీ-టెస్ట్‌కు ఆదేశించే ముందు.. లీకైన పేపర్‌ ఎంతమందికి చేరిందో తేలాల్సి ఉంది’’ అని ధర్మాసనం తెలిపింది.

* ఈ సందర్భంగా కేంద్రానికి న్యాయస్థానం కీలక ప్రశ్నలు సంధించింది. ‘‘పేపర్‌ లీక్‌ తో ఇద్దరు విద్యార్థులకే సంబంధం ఉందని అంటున్నారు.. కానీ, అది 23లక్షల మంది జీవితాలతో ముడిపడిన అంశం. అందువల్ల, లీక్‌ ఎలా జరిగింది అనేది తెలుసుకోవాలి. లీకైన పేపర్‌ ఎంతమందికి చేరిందో గుర్తించారా? ఎలా చేరిందో తెలుసుకున్నారా?లీకేజీతో లబ్ధిపొందిన విద్యార్థులపై ఏం చర్యలు తీసుకున్నారు?ఎంతమంది విద్యార్థుల ఫలితాలను హోల్డ్‌లో ఉంచారు?వీటికి సమాధానాలు కావాలి. వీటన్నిటిపై సమగ్ర దర్యాప్తు జరగాలి’’ అని ధర్మాసనం ఆదేశించింది. అన్నీ పరిశీలించిన తర్వాత దీనిపై తీర్పు చెబుతామని వెల్లడించింది.

* నీట్‌ వ్యవహారం  పై దర్యాప్తు ఎక్కడిదాకా వచ్చిందో తెలుపుతూ తమకు నివేదిక సమర్పించాలని సీబీఐని కోర్టు ఆదేశించింది. ప్రశ్నపత్రం తొలిసారి ఎప్పుడు లీకైందన్న విషయాన్ని వెల్లడించాలని జాతీయ టెస్టింగ్‌ ఏజెన్సీకి సూచించింది.

*  ఈ ఏడాది మే 5వ తేదీన దేశవ్యాప్తంగా నీట్‌ యూజీ 2024  పరీక్ష నిర్వహించారు. అయితే పరీక్ష పేపర్‌ లీక్‌ అవడంతో పాటు పరీక్ష నిర్వహణలో అవకతవకలు చోటుచేసుకున్నట్లు వార్తలు రావడంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. ఫలితాల్లో ఏకంగా 67 మందికి జాతీయస్థాయిలో మొదటి ర్యాంకు రావడంపైనా పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే సుప్రీం ఆదేశాల మేరకు ఇటీవల గ్రేస్‌ మార్కులు కలిపిన 1563 మందికి మళ్లీ పరీక్ష  నిర్వహించి సవరించిన నీట్‌ ర్యాంకుల జాబితాను ఎన్‌టీఏ విడుదల చేసింది. తాజా పరిణామాలతో అటు కౌన్సెలింగ్‌ను కూడా వాయిదా వేసింది.


మరింత సమాచారం... మీ కోసం!

‣ క్లర్క్‌ కొలువు సాధనతో సులువు!

‣ అందుకుందాం ఐటీ ఉద్యోగం!

‣ కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌లో ప్రాజెక్ట్‌ ఆఫీసర్ ఉద్యోగాలు!

‣ గ్రూపు-1 మెయిన్స్‌ 100 రోజుల వ్యూహాం!

‣ అనువర్తన ధోరణిలో అధ్యయనం మేలు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 08-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.