• facebook
  • whatsapp
  • telegram

Governor: ప్రశ్నపత్రాల ప్రింటింగ్‌ ఎక్కడని విద్యార్థులు అడుగుతున్నారు

* గవర్నర్‌ వ్యాఖ్య

ఈనాడు, హైదరాబాద్‌; న్యూస్‌టుడే, కూకట్‌పల్లి: ‘రేపు పరీక్షలున్నాయి.. శ్రద్ధగా చదివి రాయండి అంటే.. ప్రశ్నపత్రాలు ఎక్కడ ప్రింట్‌ అవుతున్నాయని విద్యార్థులు అడుగుతున్నారు. ఇది జోక్‌ కాదు.. వాస్తవం’ అని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. శనివారం(మార్చి 18) జరిగిన హైదరాబాద్‌ జేఎన్‌టీయూ స్నాతకోత్సవానికి కులపతి హోదాలో ఆమె అధ్యక్షత వహించారు. విద్యార్థులు చదువుపై దృష్టి కేంద్రీకరించాలని, ఆత్మహత్యలకు పాల్పడి కుటుంబాల్లో విషాదం నింపొద్దని సూచించారు. సమాజంలో ఇప్పటికీ లింగ వివక్ష ఉందని పేర్కొన్నారు. కొద్దిరోజుల క్రితం పుదుచ్చేరిలో ఓ కార్యక్రమానికి వెళ్తే అక్కడ ఓ విద్యార్థి.. గవర్నర్‌గా మహిళలుంటారా? అని ప్రశ్నించాడని చెప్పారు. ‘నేటి విద్యార్థులు మొబైల్‌ ఫోన్లపై విపరీతంగా ఆధారపడుతున్నారు. దాని నుంచి బయటపడాలి. పరీక్ష బాగా రాశావా? అని ఒక విద్యార్థిని ప్రశ్నిస్తే 3 గంటలపాటు సెల్‌ఫోన్‌, ఇంటర్నెట్‌కు దూరంగా ఉన్నానంటూ సమాధానం ఇచ్చాడు. పరీక్షలకు హాజరైనందుకు విద్యార్థులకు కృతజ్ఞతలు చెప్పే పరిస్థితి వచ్చింది’ అని గవర్నర్‌ వ్యాఖ్యానించారు.

శాస్త్రసాంకేతిక పరిశోధనలకు చిరునామాగా హైదరాబాద్‌: కస్తూరి రంగన్‌

  శాస్త్ర సాంకేతిక పరిశోధనలకు చిరునామాగా హైదరాబాద్‌ మారుతోందని రాజస్థాన్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం కులపతి డాక్టర్‌ కృష్ణస్వామి కస్తూరిరంగన్‌ అన్నారు. జేఎన్‌టీయూ గౌరవ డాక్టరేట్‌ను స్వీకరించిన అనంతరం ఆయన స్నాతకోత్సవ ప్రసంగం చేశారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో మైక్రో సెకన్లలో మార్పులు వస్తున్నాయని, వీటికనుణంగా విద్యార్థులు పరిశోధనలపై దృష్టి కేంద్రీకరించాలని తెలిపారు. ఈ స్నాతకోత్సవంలో 92,005 మందికి డిగ్రీలు ప్రదానం చేశామని, వీరిలో 149 మంది పీహెచ్‌డీలు, 46 మంది బంగారు పతకాలు పొందినవారు ఉన్నారని వర్సిటీ వీసీ కట్టా నరసింహారెడ్డి తెలిపారు. రిజిస్ట్రార్‌ మంజూర్‌ హుస్సేన్‌, రెక్టార్‌ ఎ.గోవర్ధన్‌, అధ్యాపకులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 19-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.