• facebook
  • whatsapp
  • telegram

NEET: నీట్‌ యూజీ పేపర్‌ లీకేజీలో విస్తుగొలిపే వాస్తవాలు

ఏకంగా ప్రింటింగ్‌ ప్రెస్‌ నుంచే కాజేశారు



ఇంటర్నెట్‌ డెస్క్‌: ఓవైపు ‘నీట్‌ యూజీ-2024 ప్రవేశ పరీక్షపై గందరగోళం నెలకొన్న వేళ.. ఉత్తర్‌ ప్రదేశ్‌లో ఫిబ్రవరి 11న జరిగిన రివ్యూ ఆఫీసర్‌/అసిస్టెంట్‌ రివ్యూ ఆఫీసర్‌ నియామక ప్రశ్నపత్రం లీకేజీలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. మొత్తం నలుగురు ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లు ప్రశ్నపత్రాన్ని లీక్‌ చేసినట్లు విచారణలో తేలింది. పేపర్‌ లీకవలేదని తొలుత అధికారులు చెప్పినప్పటికీ.. టాస్క్‌ఫోర్స్‌ ముమ్మర దర్యాప్తుతో నాలుగు నెలల తర్వాత అసలు నిజాలు బయటపడ్డాయి. మొత్తం రెండు చోట్ల పేపర్‌ లీకైనట్లు విచారణలో తేలింది. ప్రయాగ్‌రాజ్‌లోని బిషప్‌ జాన్సన్‌ బాలికల హైస్కూల్‌ కేంద్రంలో పరీక్ష ప్రారంభానికి 4 గంటల ముందే ప్రశ్నపత్రం బయటకొచ్చినట్లు అధికారులు తేల్చారు. అర్పిత్‌ వినీత్, యశ్వంత్‌ అనే ఇద్దరు వ్యక్తులు ఫొటోలు తీసి కొందరు అభ్యర్థులకు చేరవేసినట్లు విచారణలో రుజువైంది. దీంతో అర్పిత్‌తోపాటు మరో ఐదుగురిని  పోలీసులు అరెస్టు చేశారు. మరింత లోతుగా దర్యాప్తు చేపట్టిన అధికారులు విస్తుపోయే నిజాలను వెల్లడించారు. ప్రశ్నపత్రం ప్రింటింగ్‌ కేంద్రంలోనే లీకైనట్లు గుర్తించారు. దీనికి నలుగురు ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లు రాజీవ్‌ నారాయణ్‌ మిశ్రా, సునీల్‌ రఘువంశీ, విశాల్‌ దుబే, సుభాష్‌ ప్రకాశ్‌లను కారకులుగా తేల్చారు. మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌కు 950 కి.మీ. దూరంలోని ఓ ప్రింటింగ్‌ కేంద్రంలో ప్రశ్నపత్రాలను ముద్రిస్తున్నట్లు ప్రధాన నిందితుడు రాజీవ్‌ నారాయణ్‌కు సమాచారం అందింది. ఎలాగైనా లీక్‌ చేయాలనుకున్నాడు. దీని కోసం తన స్నేహితుడు విశాల్‌ దుబే సాయం తీసుకున్నాడు. అదే ప్రింటింగ్‌ ప్రెస్‌లో పని చేస్తున్న సునీల్‌ రఘువంశీ, విశాల్‌ స్నేహితులు కావడం రాజీవ్‌కు కలిసొచ్చింది. ఇద్దరూ కలిసి సునీల్‌ను ప్రలోభపెట్టారు. గతంలో విశాల్‌ దుబే, సునీల్‌ గతంలో ఒకే కాలేజీలో చదువుకోవడంవల్ల అతడిని ఒప్పించడం సులువైంది. వృత్తిరీత్యా ఓ కన్సల్టేషన్‌ కార్యాలయంలో పని చేస్తున్న విశాల్, సుభాష్‌ ప్రకాశ్‌తో కలిసి వివిధ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో విద్యార్థులను చేరుస్తుండేవారు. ఈ నలుగురు పేపర్‌ను లీక్‌ చేసేందుకు పన్నాగం పన్నారు. ఆర్‌వో/ఏఆర్‌వో ప్రశ్నాపత్రం ప్రింటింగ్‌కు రాగానే సునీల్‌ మిగతా ముగ్గురికీ సమాచారం అందించాడు. కాపీలు కావాలంటే రూ.10 లక్షలు డిమాండు చేశాడు. ప్రశ్నపత్రాలు సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యే అవకాశం ఉన్నందున అభ్యర్థులు వాటి ఫొటోలు తీసుకోరాదని షరతు విధించాడు. దీనికి  మిగతావారంతా అంగీకరించారు.


సరైన అవకాశం కోసం సునీల్‌ వేచి చూశాడు. ప్రింటింగ్‌ మధ్యలో ఏదైనా సమస్య వస్తే ఆ పేపర్‌ను చించేస్తారు. పక్కా ప్రణాళిక ప్రకారం మెషీన్‌లో సునీల్‌ సమస్య సృష్టించి.. పేపర్‌ను చించేసినట్లు నటించి.. అధికారుల కళ్లుగప్పి ప్రశ్నపత్రాన్ని రహస్యంగా ఇంటికి తీసుకొచ్చాడు. మిగతా ముగ్గురికి సమాచారం అందించాడు. ఈలోగా ఉత్తర్‌ ప్రదేశ్‌కు చెందిన వివేక్‌ ఉపాధ్యాయ, బిహార్‌కు చెందిన అమర్జీత్‌ అనే ఇద్దరు ఏజెంట్లు.. అభ్యర్థులను గుర్తించి, వారికి ఉద్యోగ హామీ ఇచ్చి.. ఒక్కొక్కరి నుంచి రూ.12 లక్షలు వసూలు చేశారు. ఫిబ్రవరి 8న.. అంటే పరీక్షకు మూడు రోజుల ముందు ఓ హోటల్‌కు వారందరినీ పిలిపించారు. ప్రశ్నపత్రంతో సునీల్‌ హోటల్‌కు చేరుకున్న తర్వాత సుభాష్‌ ప్రకాశ్‌ కొంత మంది సాయంతో ‘కీ’ తయారు చేయించాడు. ప్రశ్నపత్రంలోని అంకెల వరుస క్రమంలో ‘కీ’ని యథాతథంగా గుర్తుంచుకోవాలని అభ్యర్థులకు సూచించాడు. ‘కీ’ ఫొటోలను అభ్యర్థులకు ఇచ్చి వారందరికీ హోటల్‌లోనే ఆశ్రయం కల్పించాడు. పరీక్ష రాసిన వారిలో సుభాష్‌ ప్రకాశ్‌ కూడా ఉన్నాడు. అయితే, డబ్బు మీద ఆశతో రాజీవ్‌ మిశ్ర.. ప్రశ్నపత్రం ఫొటోలను మరో వ్యక్తికి ఫార్వర్డ్‌ చేశాడు. అతడు మరికొందరికి పంపడంతో సామాజిక మాధ్యమాల్లో ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి. ఈ కేసులో ఇప్పటివరకు ఆరుగురిని అరెస్టు చేశామని, దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని యూపీ పోలీసులు వెల్లడించారు. మరోవైపు యూపీ పోలీస్‌ కానిస్టేబుల్‌ ప్రశ్నపత్రాన్ని కూడా రాజీవ్‌ మిశ్ర, రవి అత్రిలే లీక్‌ చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ కేసులో ఇప్పటికే వీరిద్దరినీ అరెస్టు చేసి మేరఠ్‌ జైల్లో ఉంచారు.


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ పరీక్ష లేకుండానే ఫార్మా కొలువులు

‣ వాయుసేనలో అగ్నివీరులవుతారా?

‣ బెల్‌లో ఉద్యోగాలు!

‣ డిప్లొమాతో ఉద్యోగాలకు బాటలు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 25-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.