* గతేడాదిలాగే ఈ సారీ ప్రశ్నపత్రం
ఈనాడు ప్రతిభ డెస్క్: జేఈఈ అడ్వాన్స్డ్-2024 ప్రశ్నపత్రం గతేడాదిలాగే ఉందని శ్రీ చైతన్య విద్యాసంస్థల ఆల్ ఇండియా ఐఐటీ కో-ఆర్డినేటర్ ఎం.ఉమాశంకర్ పేర్కొంటున్నారు. దేశ వ్యాప్తంగా జేఈఈ అడ్వాన్స్డ్ 2024 పరీక్షలు మే 26న నిర్వహించారు. పేపర్-1, 2 కలిపి మొత్తం 360 మార్కులకు జరిగింది. ఆదివారం పరీక్షలు పూర్తి కాగానే ఆయన ప్రశ్నపత్రాన్ని విశ్లేషించారు. ‘ప్రశ్నల కాఠిన్యతా స్థాయి సైతం 2023 ప్రశ్నపత్రం మాదిరే ఉంది. పేపర్-1తో పోలిస్తే, పేపర్-2 కాస్త కఠినంగా ఉంది. పేపర్-1లో మ్యాథ్స్, ఫిజిక్స్ ప్రశ్నలు సుధీర్ఘంగా సమయం తీసుకునేవిగా ఉన్నాయి. కెమిస్ట్రీ అన్నిటికంటే కఠినంగా ఉంది. మార్కుల సాధనలో కెమిస్ట్రీ భాగం కీలకంగా మారనుంది. మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టుల్లో మధ్యస్థం నుంచి కఠిన స్థాయి ప్రశ్నలు అడిగారు. ఆర్గానిక్ కెమిస్ట్రీలో సరళ ప్రశ్నలు వచ్చాయి. ఫిజికల్ కెమిస్ట్రీలో క్యాలిక్యులేషన్తో కూడిన సుధీర్ఘమైనవిగా ఉన్నాయి. మొత్తంమీద ఈ సారీకూడా గతేడాదిలాగే కటాఫ్ ఉండవచ్చని’ ఆయన తెలిపారు.