* తొలుత, ప్రస్తుత ఫలితాల్లో భారీ వ్యత్యాసం
![]() |
దిల్లీ: నీట్ యూజీ 2024 పరీక్షలో అక్రమాలు (NEET Row) చోటుచేసుకోవడం తీవ్ర దుమారం రేపింది. ఈక్రమంలోనే గ్రేస్ మార్కులు పొందిన అభ్యర్థులకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇటీవల మళ్లీ పరీక్ష నిర్వహించారు. సుప్రీం విచారణలో భాగంగా నగరాలు, పరీక్ష కేంద్రాల వారీగా నీట్-యూజీ ఫలితాలను జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ) శనివారం వెల్లడించింది. ఆ డేటా ప్రకారం.. జూన్ 4న వెలువడిన నీట్ ఫలితాల్లో దేశవ్యాప్తంగా 67 మందికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అందులో ఒకే కేంద్రంలో పరీక్ష రాసిన ఆరుగురికి 720కి 720 మార్కులు వచ్చాయి. ఆ ఫలితాలపై తీవ్ర అనుమానాలు వ్యక్తమయ్యాయి. 1563 మందికి గ్రేస్ మార్కులు కలపడం ఆ పరిస్థితికి దారితీసిందని గుర్తించిన సుప్రీం.. వారికి మళ్లీ పరీక్ష నిర్వహించాలని ఆదేశించింది. వారిలో 813 మంది మాత్రమే హాజరయ్యారు. ఫలితాల అనంతరం సదరు కేంద్రంలో వచ్చిన అత్యధిక స్కోరు 682గా ఉండటం గమనార్హం. అది కూడా ఒక్క విద్యార్థికే వచ్చింది. 13 మంది విద్యార్థులకు 600 పైగా మార్కులు వచ్చాయి. తొలుత వెల్లడైన ఫలితాలకు వీటికి మధ్య భారీ వ్యత్యాసం కనిపించింది. ఇదిలా ఉంటే.. రీటెస్ట్ తర్వాత నీట్ యూజీ పరీక్ష రాసిన అందరి ర్యాంకులు మారినట్లు ఫలితాల తర్వాత ఎన్టీఏ వెల్లడించింది.
అవకతవకలపై సుప్రీంలో విచారణ
నీట్ పరీక్షలో పేపర్ లీక్ జరిగిన ఆరోపణలపై దర్యాప్తు జరుగుతోంది. మరోపక్క ఈ అవకతవకలపై సుప్రీంలో విచారణ జరుగుతోంది. ఈ క్రమంలోనే విచారణలో భాగంగా మిగతా కేంద్రాలతో పోలిస్తే అనుమానిత పరీక్ష కేంద్రాల్లో రాసిన వారికి ఎక్కువ మార్కులు వచ్చాయా.. లేదా అని తెలుసుకోవడానికి కేంద్రాల వారీగా ఫలితాలు అందించాలని కోర్టు ఎన్టీఏను ఆదేశించింది. ఫలితాలను ఎన్టీఏ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని, అయితే విద్యార్థుల గుర్తింపు బయటపడకుండా చూడాలని సూచించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మే 5న నీట్ యూజీ పరీక్ష జరిగింది. 571 నగరాల్లోని 4,750 సెంటర్లలో నిర్వహించిన ఈ పరీక్షకు 24 లక్షల మందికి పైగా హాజరయ్యారు. ఇందులో 14 కేంద్రాలు విదేశాల్లో ఉన్నాయి.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Share chat, Google News Subscribe our Youtube Channel.