హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి టీఎస్పీఎస్సీ కార్యదర్శి, ఐఏఎస్ అధికారి అనితా రామచంద్రన్ ఈరోజు విచారణకు హాజరుకావాలని 160 సీఆర్పీసీ కింద సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో అనితా రామచంద్రన్ సిట్ కార్యాలయానికి చేరుకొని విచారణకు హాజరయ్యారు. ఆమె వాంగ్మూలాన్ని అధికారులు నమోదు చేస్తున్నారు. ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రవీణ్.. అనితా రామచంద్రన్ వద్ద పీఏగా పని చేశారు. దీంతో ప్రవీణ్ గురించి అనితా రామచంద్రన్ను సిట్ ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. ప్రశ్నాపత్రాల తయారీ, భద్రత, ఉద్యోగ నియామక పరీక్షలకు సంబంధించిన వివరాలను సైతం సిట్ అడగనున్నట్లు సమాచారం.
వాంగ్మూలాలు నమోదు
గ్రూప్-1 ప్రశ్నపత్రం లీకేజీకి సంబంధించి వందకు పైగా మార్కులు సాధించిన వారిలో ఇప్పటివరకు వంద మందిని సిట్ అధికారులు విచారించి వారి వాంగ్మూలాలు నమోదు చేశారు. మిగిలిన 21 మందిని రెండు మూడు రోజుల్లో ప్రశ్నించనున్నారు. ఇప్పటివరకు ప్రశ్నపత్రం లీక్ చేసిన ప్రవీణ్, రాజశేఖర్, వాటి ద్వారా పరీక్షలు రాసిన వారు సహా మొత్తం 15 మందిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.