*రాష్ట్ర కోటాలో క్లినికల్కు 15 శాతం, నాన్క్లినికల్కు 30 శాతం
* పీజీ దంత కోర్సుల దరఖాస్తులకు ఈ నెల 24వరకు అవకాశం
ఈనాడు, అమరావతి - ఆరోగ్య విశ్వవిద్యాలయం, న్యూస్టుడే: పీజీ మెడికల్ కోర్సుల ప్రవేశాల మార్గనిర్దేశాల జీవోను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శనివారం విడుదల చేసింది. గిరిజన, గ్రామీణ, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో వైద్యుల కొరతను దృష్టిలో ఉంచుకొని పీజీ వైద్యవిద్య ప్రవేశాలను చేపట్టాలని విజయవాడ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి సూచించింది. కేంద్ర వైద్య కళాశాలల్లో సీట్లు మినహాయించిన తర్వాత రాష్ట్ర కోటాలోని 50% సీట్లలో 15% క్లినికల్ సబ్జెక్టులకు కేటాయించాలన్నారు. ఈ సీట్లు జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, గైనకాలజీ, పీడియాట్రిక్స్, ఎనస్థీషియా, ఎమర్జెన్సీ మెడిసిన్ స్పెషాలిటీస్కు కేటాయించనున్నారు. మిగతా వాటిలో 30% సీట్లను నాన్ క్లినికల్ స్పెషాలిటీస్కు కేటాయించాలని ఆదేశించారు. నిబంధనల ప్రకారం.. ఇన్ సర్వీస్ అభ్యర్థుల్లో రెండేళ్లు గిరిజన ప్రాంతాల్లో గానీ, మూడేళ్లు గ్రామీణ ప్రాంతాల్లో గానీ, ఆరేళ్లు పట్టణ ప్రాంతాల్లో గానీ పనిచేసినవారే అర్హులని జీవోలో పేర్కొన్నారు. పీజీ మెడికల్ కోర్సుకు వయోపరిమితి 50ఏళ్లు మించకూడదని నిబంధన ప్రవేశపెట్టారు.
పీజీ దంత వైద్య కోర్సులకు దరఖాస్తులు
2024-25 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని దంత వైద్య కళాశాలల్లో అందుబాటులో ఉన్న ఎండీఎస్ సీట్ల ప్రవేశానికి దరఖాస్తులు శనివారం నుంచి అందుబాటులో ఉంచారు. ఈ నెల 24వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంట వరకు దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. యూనివర్సిటీ ప్రవేశాల లింక్ ద్వారా అభ్యర్థులు తమ దరఖాస్తులను నమోదు చేసుకోవాలి.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Share chat, Google News Subscribe our Youtube Channel.