* మెరిట్ ప్రకారం సీట్ల భర్తీ
ఈనాడు, అమరావతి: ఇంజినీరింగ్ యాజమాన్య కోటా కింద 30శాతం సీట్ల భర్తీకి ఉన్నత విద్యామండలి ఈ ఏడాది ప్రత్యేక వెబ్సైట్ తీసుకురానుంది. గత ఏడాది యాజమాన్య కోటాలోని 15శాతం ఎన్నారై సీట్లు మినహా మిగతా వాటిని కన్వీనర్ ద్వారా మెరిట్ ప్రాతిపదికన భర్తీ చేశారు. కన్వీనర్ ద్వారా యాజమాన్య కోటాను భర్తీ చేయడంపై కొన్ని కళాశాలల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. యాజమాన్య కోటాలో మెరిట్ ప్రకారం భర్తీ చేసినందున వీరికి బోధన రుసుములు చెల్లించాలని హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో ఇంజినీరింగ్ కళాశాలలకు గతంలో ఉన్న ఉత్తర్వులను నిలిపివేసి, ఆ స్థానంలో ఉత్తర్వులు-66ని అమలులోకి తెచ్చి దీని ఆధారంగా యాజమాన్య కోటా సీట్లను భర్తీ చేయాలని ఉన్నత విద్యాశాఖ భావిస్తోంది. ఇందుకు ప్రత్యేక వెబ్సైట్ను తీసుకొస్తుంది. కళాశాలల యాజమాన్యాలు ఈ వెబ్సైట్లో సీట్లు, వారికి వచ్చిన దరఖాస్తులను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. విద్యార్థులు సైతం ఆయా కళాశాలల్లో యాజమాన్య కోటా సీట్ల కోసం నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం దరఖాస్తులను యాజమాన్యాలకు పంపిస్తారు. దరఖాస్తుల్లోని విద్యార్థుల మెరిట్ ప్రకారం సీట్లు కేటాయించాల్సి ఉంటుంది. విద్యార్థి ఆర్థిక పరిస్థితిని పరిశీలించుకునే అవకాశాన్ని కళాశాలకు కల్పించడంతో ఫీజు చెల్లించగలరా? లేదా అనే ఆర్థిక పరిస్థితిని యాజమాన్యాలు పరిశీలించుకోవచ్చు. అయితే ఈ కారణంతో యాజమాన్యాలు దరఖాస్తులను తిరస్కరించే ప్రమాదం ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే చాలా కళాశాలలు యాజమాన్య సీట్లను భర్తీ చేసేసుకున్నాయి. కొన్ని కళాశాలలు కన్వీనర్ కోటా ఫీజుపై మూడింతలు తీసుకోగా.. మరికొన్ని రూ.3లక్షల నుంచి- రూ.5లక్షల వరకు అదనంగా డొనేషన్లు వసూలు చేశాయి. ఇప్పుడు కొత్తగా యాజమాన్య కోటాకు విద్యార్థులు దరఖాస్తు చేస్తే ఆర్థిక పరిస్థితి పరిశీలన పేరుతో తిరస్కరించే అవకాశం ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. యాజమాన్య కోటాకు వచ్చిన దరఖాస్తుల్లో మెరిట్ ప్రకారం సీట్ల కేటాయింపు చేసేలా చూడాలని కోరుతున్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.