* అధిక ప్రాధాన్యం ఇస్తున్న జెన్ జెడ్
* ఉద్యోగ దరఖాస్తుల్లో 11 శాతం వృద్ధి
* లింక్డ్ఇన్ నివేదిక
ఈనాడు, హైదరాబాద్: కృత్రిమ మేధ సాంకేతికత, ఐటీ నిపుణులకు తప్పనిసరి అవసరంగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 70 శాతం మంది దీని గురించే మాట్లాడుకుంటున్నారని ప్రొఫెషనల్ నెట్వర్క్ లింక్డ్ఇన్ పేర్కొంది. గత ఏడాది డిసెంబరు నుంచి ఈ ఏడాది సెప్టెంబరు మధ్య కాలంలో ’ఏఐ అట్ వర్క్’ నివేదికను సంస్థ రూపొందించింది. అంతర్జాతీయంగా కృత్రిమ మేధ (ఏఐ) ఉద్యోగాలకు దరఖాస్తులు 11 శాతం పెరిగాయి. అదే సమయంలో భారత్లో ఈ వృద్ధి 5.6 శాతం ఉందని నివేదిక వెల్లడించింది.
* కృత్రిమ మేధ నైపుణ్యాలు అధికంగా ఉన్న వారికి, గిరాకీ బాగా ఉంటోంది. ముఖ్యంగా మన దేశంలో ప్రొఫెషనల్ సేవలు, టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్, మీడియా, ఆర్థిక సేవల రంగాల్లో కృత్రిమ మేధకు ప్రాముఖ్యం పెరుగుతోందని నివేదిక పేర్కొంది.
* దీనికి తగ్గట్టుగానే కొత్తగా ఉద్యోగాల్లోకి వస్తున్న జెన్ జెడ్ (1997-2012 మధ్య పుట్టినవారు) తరంలో ఏఐ కోర్సులపై ఆసక్తి చూపుతున్న వారిలో 80శాతం వృద్ధి కనిపించింది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే ఉన్న ఐటీ నిపుణులూ, కృత్రిమ మేధ నైపుణ్యాలను సమకూర్చుకునేందుకు తమపై తాము పెట్టుబడి పెట్టుకుంటున్నారని లింక్డ్ఇన్ తెలిపింది.
* భారత్ నిపుణుల్లో జెన్ ఎక్స్ (1965-1980 జన్మించినవారు) ఎక్కువగా మేనేజ్మెంట్ లాంటి సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అదే సమయంలో జెన్ జెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా అనాలసిస్ వంటి డిజిటల్ నైపుణ్యాలను నేర్చుకుంటున్నారు. మిగతా దేశాలతో పోలిస్తే ఏఐ నైపుణ్యాలు నేర్చుకుంటున్న వారిలో భారత యువతే అధికంగా ఉంది.
* సాంకేతిక నైపుణ్యాలతో పాటు, సాఫ్ట్ స్కిల్స్ ఉన్న నిపుణులు మిగతా వారి కంటే 13 శాతం వేగంగా పదోన్నతి పొందుతున్నారని నివేదిక వెల్లడించింది. ఏఐతోపాటు కమ్యూనికేషన్, అనలిటికల్ నైపుణ్యాలున్న వారిని ఉద్యోగ విపణి కోరుకుంటోంది.
హైబ్రిడ్ పని విధానంలో..
గత ఏడాది ఆగస్టులో హైబ్రిడ్ ఉద్యోగ నియమాకాలు 13.2 శాతంగా ఉన్నాయి. ఈ ఏడాది ఈ సంఖ్య 20.1 శాతానికి పెరిగింది. చాలా సంస్థలు ఇప్పటికే ఫ్లెక్సీ ఉద్యోగ నియామకాలకు స్పందిస్తున్నాయని నివేదిక వెల్లడించింది. జనరేటివ్ ఏఐ అభివృద్ధితో కొత్త ఉద్యోగాల సృష్టి పెరుగుతోంది.
* నివేదికపై లింక్డ్ఇన్ ఇండియా కంట్రీ మేనేజర్ ఆశుతోష్ గుప్తా మాట్లాడుతూ.. కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టబోతున్న తరుణంలో ఏఐ నేతృత్వంలో ఉద్యోగాల పరివర్తనను చూస్తున్నట్లు తెలిపారు. ‘90వ దశకంలో ఇంటర్నెట్ ద్వారా జరిగిన వృద్ధికి ఇది సమానంగా ఉంటోంది. కొత్త సాంకేతికత వ్యాపారాల పని సంస్కృతిలో భాగంగా మారుతోంది. ఏఐ పూర్తి సామర్థ్యాలను ఉపయోగించుకునేందుకు మానవ నైపుణ్యాలను పెంచడమూ కీలకమే’ అన్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ 44 వేల విద్యార్థుల అనుసంధానం.. సింప్లీ న్యూరోసైన్స్
‣ సామర్థ్యాలను గుర్తిస్తేనే గెలుపు!
‣ బీటెక్ తర్వాత.. ఉన్నత విద్య లేదా ఉద్యోగమా?
‣ రెజ్యూమె.. ప్రాధాన్యం తగ్గుతోందా!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.