ఈనాడు, మహబూబాబాద్, న్యూస్టుడే, ఎన్జీవోస్ కాలనీ: బడులు లేని ఊరు ఉండకూడదని, ఉపాధ్యాయులు లేరని మూసివేసిన చోట అవసరమైన మేరకు నియామకాలు చేపట్టాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. అందుకు మెగా డీఎస్సీ నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. గతంలోని ఖాళీలకు తోడుగా ఇప్పుడు పోస్టుల సంఖ్య మరింత పెరగనుంది. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో డీఎడ్, బీఎడ్ శిక్షణ పొంది కొలువే లక్ష్యంగా పుస్తకాలతో కుస్తీ పడుతున్న వేలాది మంది నిరుద్యోగుల్లో ఆనందం నెలకొంది. గతేడాది విడదలైన నోటిఫికేషన్ ఆధారంగా దరఖాస్తు చేసుకున్న వారందరూ ఇప్పుడు రెట్టింపు ఉత్సాహంతో సన్నద్ధం కానున్నారు. ఇందుకోసం సొంతూళ్ల వదిలి పట్టణాల బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. వచ్చే విద్యాసంవత్సరం నాటికి డీఎస్సీ నిర్వహించి భర్తీ చేస్తే ఎంతో మందికి ప్రయోజనం చేకూరనుంది.
పెరగనున్న పోస్టులు
గత ప్రభుత్వ హయాంలో వచ్చి డీఎస్సీ నోటిఫికేషన్లో ఉమ్మడి జిల్లాలో 532 పోస్టుల భర్తీకి సిద్ధమైంది. అప్పుడు స్కూల్ అసిస్టెంట్ 163, ఎస్జీటీలు 245, భాషాపండితులు 94, వ్యాయామ ఉపాధ్యాయులు 30 పోస్టులను ఖాళీలుగా చూపారు. వీటి కోసం వేలాది మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పుడు పదోన్నతులు చేపట్టడంతో, పదవీ విరమణతో అయ్యే ఖాళీలతో పోస్టుల సంఖ్య పెరగనుంది. దీంతో దరఖాస్తుల సంఖ్య కూడా పెరిగే అవకాశాలున్నాయి.
మూతబడిన పాఠశాలలకు మహర్దశ
ఉమ్మడి వరంగల్ జిల్లాలో సుమారు 336 పాఠశాలలు చాలా వరకు పిల్లలు లేరని మూతబడ్డాయి. సర్కారు తీసుకోబోతున్న నిర్ణయంతో ఈ బడులకు మహర్దశ పట్టనుంది. అవి త్వరలోనే పునఃప్రారంభం కానున్నాయి. ఆ బడుల్లో బోధన చేయడానికి కొత్త సార్లు రానున్నారు. మరల ఆ గ్రామాల్లో, గూడేల్లో, తండాల్లో బడి గంట మోగనుంది.
నిరుద్యోగులకు మేలు..: ఎ.వసంత, ములుగు, డీఎస్సీ అభ్యర్థి
రెండేళ్ల కిందట బీఈడీ పూర్తి చేసి డీఎస్సీ ప్రకటన కోసం ఎదురుచూశా. గత ప్రభుత్వం గతేడాది తక్కువ పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేయగా దరఖాస్తు చేసుకుని బాగా చదువుతున్నాను. నిర్ణీత సమయానికి పరీక్ష నిర్వహించకపోవడంతో నిరుత్సాహానికి గురయ్యా. ఇప్పుడు కొత్త ప్రభుత్వం మెగా డీఎస్సీ నిర్వహించడానికి తీసుకున్న నిర్ణయం మంచిది. సర్కారు త్వరితగతిన నోటిఫికేషన్ జారీ చేసి సకాలంలో పరీక్షలు నిర్వహిస్తే నిరుద్యోగులకు మేలు జరుగుతుంది.
సంతోషంగా ఉంది: ఎస్.అనూష, కాకాజీ కాలనీ, హనుమకొండ
గతంలో డీఎస్సీ రాశాను. అప్పుడు కొద్ది మార్కుల తేడాతో కొలువు సాధించలేకపోయాను. గత సర్కారు జారీ చేసిన నోటిఫికేషన్లో తక్కువ పోస్టులున్నా ఉద్యోగమే లక్ష్యంగా చదువుతున్నాను. ఇంతలో కొత్త ప్రభుత్వం మెగా డీఎస్సీ నిర్వహిస్తామనడంతో పోస్టుల సంఖ్య పెరగనుండటం సంతోషంగా ఉంది. సత్వరమే నిర్వహించి వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి భర్తీ చేసేలా చూడాలి.
ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: సంకా బద్రినారాయణ, పీఆర్టీయూ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు
కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం మూసివేసిన బడులను తెరిపించడానికి మెగా డీఎస్సీ నిర్వహించాలని తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం అవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ప్రైవేటు బడుల నియంత్రణ ఉండేలా తగిన చొరవ చూపాల్సిన అవసరం ఉంది.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఫర్నిచర్ డిజైన్ కెరియర్ గైడెన్స్
‣ బాడీ లాంగ్వేజ్ ఎందుకు ముఖ్యం?
‣ ఇగ్నోలో నాన్ టీచింగ్ కొలువులు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.