ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో జూన్ 9న నిర్వహించనున్న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష హాల్టికెట్లలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) స్వల్ప మార్పులు చేసింది. కొత్తగా కమ్యూనిటీకి (కుల) సంబంధించిన క్రీమీలేయర్, నాన్క్రీమీలేయర్, ఈడబ్ల్యూఎస్ వివరాలు పొందుపరిచింది. ఈ మేరకు సవరించిన హాల్టికెట్లను జూన్ 3న మధ్యాహ్నం నుంచి అందుబాటులోకి తీసుకువచ్చింది. హాల్టికెట్లలో మార్పుల విషయాన్ని టీజీపీఎస్సీ అభ్యర్థులకు ఎస్ఎంఎస్ల ద్వారా తెలిపింది. పరీక్ష కేంద్రం, ఇతర వివరాల్లో ఎలాంటి మార్పుల్లేవు. హాల్టికెట్లు జూన్ 1వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి టీజీపీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులోకి వచ్చాయి. తొలుత పొందుపరిచిన హాల్టికెట్లలో కులవివరాలు పేర్కొన్నప్పటికీ క్రీమీలేయర్, నాన్క్రీమీలేయర్ వివరాల్లేవు. మెయిన్స్, ఇంటర్వ్యూల వరకు ప్రిలిమినరీ హాల్టికెట్ కీలకమని.. దీన్ని తుది నియామకాల వరకు భద్రపరచుకోవాలని టీజీపీఎస్సీ స్పష్టం చేసింది. కమ్యూనిటీ వివరాల్లో అదనపు అంశాలు చేర్చినందున అభ్యర్థులందరూ సవరించిన తాజా హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
గత మూడు నెలల్లో తీసుకున్న ఫొటో అతికించాలి
గ్రూప్-1 ప్రిలిమినరీ హాల్టికెట్పై గత మూడునెలల్లో తీసుకున్న పాస్పోర్టు ఫొటోను అతికించాలని కమిషన్ కార్యదర్శి నవీన్ నికోలస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని ఇప్పటికే హాల్టికెట్పై ముద్రించిన నిబంధనల్లో స్పష్టం చేశామని.. అభ్యర్థులు చదువుకోవాలని సూచించారు. పరీక్షకు వచ్చే ముందుగానే ఫొటో అతికించాలని వివరించారు. హాల్టికెట్పై అభ్యర్థి సంతకాన్ని ఇన్విజిలేటర్ సమక్షంలో చేయాలన్నారు. ప్రభుత్వం జారీ చేసిన పాస్పోర్టు, పాన్కార్డు, ఓటరు ఐడీ, ఆధార్ కార్డు, ప్రభుత్వ ఉద్యోగి గుర్తింపుకార్డు, డ్రైవింగ్ లైసెన్సు తదితర ఒరిజినల్ గుర్తింపుకార్డుల్లో ఏదైనా ఒక దాన్ని పరీక్ష కేంద్రంలోకి ప్రవేశించే ముందు అక్కడి సిబ్బందికి చూపించాలన్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ డిగ్రీతో రక్షణ రంగంలో ఉద్యోగాలు!
‣ డేటాసైన్స్తో ఉద్యోగ అవకాశాలు!