* 5 విడతలు.. 44 రోజులు
* జులై 23 నాటికి పూర్తి
ఈనాడు, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ఐటీలు, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే ఇతర సాంకేతిక విద్యాసంస్థల్లో బీటెక్ సీట్ల భర్తీకి జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) కౌన్సెలింగ్ మొత్తం 44 రోజుల పాటు సాగనుంది. జూన్ 9వ తేదీన జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు వెల్లడవుతాయి. ఆ మరుసటి రోజు (జూన్ 10) నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలవుతుంది. మొత్తం 5 విడతల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. జులై 23వ తేదీకి ఐదో విడత ప్రక్రియ పూర్తవుతుంది. ఈ మేరకు జూన్ 6 పూర్తి కాలపట్టికను విడుదల చేసింది. ఈసారి మొత్తం 121 విద్యాసంస్థలు కౌన్సెలింగ్లో పాల్గొననున్నాయి. అన్నింటికీ కలిపి సంయుక్తంగా కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. జోసా చివర విడత సీట్లు కేటాయించిన జులై 17వ తేదీ నుంచే ఎన్ఐటీలు, ట్రిపుల్ఐటీలు, ఇతర కేంద్ర విద్యాసంస్థల్లో సీట్లు మిగిలిపోతే వాటికి ప్రత్యేక కౌన్సెలింగ్ మొదలవుతుంది. ఈ ప్రక్రియ జులై 26వ తేదీకి ముగుస్తుంది.
17 వరకు నమూనా కౌన్సెలింగ్..
జూన్ 10వ తేదీ నుంచి జోసా కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆ రోజు రుసుం చెల్లించాల్సి ఉంటుంది. అయితే 17వ తేదీ వరకు అర్హత సాధించిన విద్యార్థులకు రెండు సార్లు నమూనా కౌన్సెలింగ్ జరుగుతుంది. అంటే విద్యార్థులు తమ ర్యాంకుకు ఎక్కడ సీటు లభిస్తుందో తెలుసుకోవచ్చు. ఆ తర్వాత అసలు కౌన్సెలింగ్లో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్ చేసుకొని అవసరమైతే ఐచ్ఛికాలను మార్చుకోవచ్చు.
మరింత సమాచారం...మీ కోసం!
♦ నైపుణ్యాల ప్రయాణం ఇలా విజయవంతం!
♦ బీఎస్ఎఫ్లో ఇన్స్పెక్టర్ పోస్టులు
♦ ఎన్సీబీ, ఫరీదాబాద్లో పీజీ డిప్లొమా ప్రోగ్రామ్
♦ ఈఎస్ఐసీ, అల్వార్లో 115 ఫ్యాకల్టీ పోస్టులు